అఖిలపక్షానికి బాబ్లీ చూపండి – చవాన్కు చిరు లేఖ

బాబ్లీ ప్రాజెక్టు సందర్శనకు రాష్ట్రంలోని అఖిలపక్ష బృందానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్కు పీఆర్పీ అధినేత చిరంజీవి బుధవారం లేఖ రాశారు. ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందాలను, ట్రిబ్యునల్ అ వార్డులను గౌరవించాలని, రాష్ట్ర ప్రభుత్వాన్ని చర్చలకు ఆ హ్వానించాలని ఆ లేఖలో కోరారు.
నీటి పంపిణీ ఒప్పందా లు, గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ అవార్డులను ఉల్లంఘించి మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న బాబ్లీ.. ఇతర 13 ప్రాజెక్టులు ఉత్తర తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఈ అక్రమ కట్టడాల వల్ల కరువు పరిస్థితులు వచ్చినప్పుడు ఈ ప్రాంతం ఎడారిగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని రాష్ట్రంలోని అన్ని పార్టీలూ తీవ్రంగా పరిగణిస్తున్నాయన్నారు.
అఖిలపక్ష బృందం ప్రధానిని కలవబోతున్న విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోనే బాబ్లీ సందర్శనకు పూనుకున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పట్ల మహారాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఇది సమాఖ్య స్ఫూర్తికి, జాతీయ సమగ్రతకు వ్యతిరేకమని చిరంజీవి పేర్కొన్నారు.




