అన్నమయ్య 507వ వర్ధంతి మహోత్సవాలు
అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి తాళ్లపాక అన్నమాచార్యుల 507వ వర్ధంతి మహోత్సవాలను టీటీడీ నిర్వహించనుంది. తిరుమల శ్రీవారి సన్నిధిలో ప్రారంభం కానున్న ఈ కార్యక్రమంలో అన్నమయ్య విరచిత ద్వాదశి సంకీర్తనలు, సప్తగిరి సంకీర్తన గోష్టి గానాన్ని నిర్వహించనున్నారు. నారాయణగిరి ఉద్యానవనంలో ఉత్సవర్లను వేంచేపుచేసి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించి తాళ్లపాక వంశీయులను సన్మానించనున్నారు. అహోబిలమఠ పీఠాధిపతి, ఉత్తరాధిపతి ఆధ్వర్యంలో జరగనున్న ఈ వేడుకలలో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా తిరుమల ఆస్థానమండపంతో పాటు తిరుపతి అన్నమాచార్య కళామందిరం, మహతి కళాక్షేత్రం, తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆస్థానమండపం, తాళ్లపాకలో 108అడుగుల అన్నమాచార్య విగ్రహం వద్ద, దేవుని కడపలోని లక్ష్మీవేంకటేశ్వర స్వామివారి దేవాలయ ప్రాంగణంలో సాంస్కతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఆయా ప్రాంతాలలో 18వతేదీ వరకు అన్నమయ్య వర్థంతి మహోత్సవాలను ఘనంగా జరపనున్నారు.




