ఆనాడు ఎందుకు అడ్డుకోలేదో – రోశయ్య

గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టును చూసేందుకు తెలుగుదేశం పార్టీ సాహసోపేత ప్రయత్నం చేసిందని ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య అన్నా రు. ఈ ప్రయత్నాన్ని హృదయ పూర్వకంగా అభినందిస్తున్నానని చెప్పారు. మహారాష్ట్ర ప్రభుత్వం దురుసు ప్రవర్తన సహించి… కొందరు నేతలు లాఠీఛార్జికి వెరవకుండా సాహసంతో ప్రాజెక్టు సైట్ను చూసే యత్నం చేశారని ఆయన పే ర్కొన్నారు. మహారాష్ట్ర పోలీసుల తీరు గర్హనీయంగా ఉం దంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని, పోలీసు చర్యను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఆయన మరోసారి తీవ్రంగా ఖండించారు.బాబ్లీ సమస్యను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలన్నది తమ అభిమతమని సీఎం స్పష్టం చేశారు. సీనియర్ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, ఆనం రామనారాయణరెడ్డి, పితాని సత్యనారాయణతో కలిసి ఆయన బుధవారం సచివాలయంలో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. టీడీపీ ఆందోళనను అభినందిస్తూనే.. ఆ పార్టీ పాలనలో బాబ్లీకి వచ్చిన అనుమతులు, టెండర్ల అంశాలను ప్రస్తావించారు. ఉప ఎన్నికల సమయంలో బాబ్లీ యాత్ర చేపట్టిన చంద్రబాబు.. ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఎందుకు ఆందోళన వ్యక్తం చేయలేదని ప్రశ్నించారు. 2003లో బాబ్లీ నిర్మాణానికి గ్లోబల్ టెండర్లు పిలిచినప్పుడు చంద్రబాబు ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. ‘టెండర్ల నోటిఫికేషన్ను ఎందుకు గుర్తించలే దు? అప్పుడు మీరేం చేశారు? ఆ రోజు రాష్ట్ర సీఎంగా, జాతీ య స్థాయి నేతగా మీరు ప్రజాస్వామికంగా అడ్డుపడితే ఇప్పుడు రాష్ట్రానికి ఇంత నష్టం జరిగేది కాదు. ఆ రోజు స్పం దించకుండా ఇప్పటి వరకు ఎందుకు మౌనంగా ఉన్నారు?” అని రోశయ్య ప్రశ్నించారు. ఇటీవల శాసనసభలో విపక్షాల కోరిక మేరకు మహారాష్ట్ర, కర్ణాటక అక్రమ ప్రాజెక్టులపై ప్రధానికి నివేదించేందుకు ఆయన అపాయింట్మెంట్ తీసుకున్నామని తెలిపారు. అఖిలపక్షం ఉన్నందున బాబ్లీ బస్సు యాత్రను విరమించుకోవాలని కోరినా బాబు వినలేదని ఆయ న తెలిపారు. తాము మహారాష్ట్ర పోలీసుల చర్యను ఖండిస్తే టీడీపీ నేతలు తమను ఖండిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశా రు. టీడీపీ నేతలు నోటిని అదుపులో పెట్టుకోకుండా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ మధ్య మనస్ఫర్థలు పెరిగేలా మాట్లాడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. మరాఠీల పని పట్టాలన్న ఓ నేత వ్యాఖ్యలను బాబు ఖండించకుండా మౌనంగా ఎందుకున్నారని ఆయన ప్రశ్నించారు.
ఉప ఎన్నికలకు వెళ్లలేక…
తెలంగాణలో ఉప ఎన్నికలు లేకుంటే బాబు ఇంత హడావుడి చేసేవారు కాదని రోశయ్య విమర్శించారు. ఉప ఎన్నికల్లో ప్రచారం చేయాలని బాబుపై ఒత్తిడి ఉందని, దాన్ని సర్దుబాటు చేసుకునేందుకు బస్సు యాత్ర పేరిట ఈ నెల 27 దాకా అక్కడే (మహారాష్ట్ర) ఉండాలనుకున్నారని చెప్పారు. దీంట్లో భాగంగా ఎవరైనా ప్రచారానికి పిలిస్తే బిజీ అంటున్నారని ఆరోపించారు.
మీ చరిత్ర మరిచారా?
“1983లో ప్రకాశం జిల్లా టంగుటూరు రోడ్డుపై ఆందోళన చేసిన పొగాకు రైతులపై కాల్పులు జరిపారు. వారేమైనా విదేశీయులా లేక శత్రుదేశాల వారా? మీ పాలనలో వేతనాలడిగిన అంగన్వాడీ వర్కర్లను గుర్రాలతో తొక్కించిన అమానుషాన్ని లోకం కోడైకూసింది. 2003లో బషీర్బాగ్లో విద్యుత్ ఉద్యమం సందర్భంగా కాల్పులు జరిపారు. నేనూ ఆ ఆందోళనలో పాల్గొన్నాను.
శత్రుదేశం వారు ఏమైనా బాంబులు తీసుకొస్తున్నారని కాల్పులు జరిపారా? ఇవన్నీ మరిచిపోయి వేదాంత ప్రవచనం చెబుతున్నారు. మీ గొప్పతనం మీరు చెప్పుకోండి. మధ్యలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు, ఏం చేయడం లేదని చెప్పడం బాగోలేదు. మేం ఏమీ చేయ డం లేదు కానీ ఆందోళన ఉన్న వాళ్లం. చేయాల్సిందంతా చేస్తున్నాం. ఇక ముందూ చేస్తాం. కలిసిరండి” అని కోరారు.
ప్రతి రోజూ మాట్లాడా..
ప్రభుత్వానికి లేని ఆరాటం ప్రతిపక్షానికి ఎందుకన్న మహారాష్ట్ర సీఎం చవాన్ వ్యాఖ్యపై రోశయ్య సీఎం అభ్యంతరం వ్య క్తం చేశారు. చవాన్కు జ్ఞాపకశక్తి లేదేమోనన్నారు. బాబ్లీ స మస్య తీవ్రమయ్యాక ప్రతీ రోజూ ఆయనతో మాట్లాడానని తెలిపారు. తాను పట్టించుకోకపోతే ఆయనతో ఎలా మాట్లాడతానని సీఎం మండిపడ్డారు. బాబ్లీని ఆపించాలని సుప్రీం కోర్టుకు వెళ్లామని, 2006లో ప్రధాని దగ్గర సమావేశం పెట్టి, వారిది తప్పు అనిపించామన్నారు.
జంఝావతి, విద్యుత్ ప్రాజెక్టుల విషయంలో ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్కు లేఖ రాసినట్లు ఆయన వివరించారు. ఇప్పటి దాకా జరిగిన దానితో సంబంధం లేకుండా బాబ్లీపై చర్చించేందుకు రావాలని మహారాష్ట్ర సీఎంనూ కోరినట్లు సీఎం తెలిపారు.
మహారాష్ట్ర పోలీసుల వైఖరి వల్ల తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతిన్నదన్న టీడీపీ నేతల విమర్శలను ప్రస్తావించగా ఆయన తీవ్రంగా స్పందించారు. మరాఠీల సంగతి చూస్తామంటే సమస్య మరింత జటిలం అవుతుందన్నారు. మహారాష్ట్రలో ఉన్న తెలుగువారు, ఇక్కడున్న మరాఠీలు క్షేమంగా, స్వేచ్ఛగా ఉండాలని ఆకాక్షించారు.




