ఆరోగ్య సేవలను విస్తృతం చేయండి జిల్లా కలెక్టర్‌ వీ.దుర్గాదాస్‌

జవహర్‌ బాల ఆరోగ్య రక్షకు కేటాయించిన 6595 కేసులకు వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్‌ వీ.దుర్గాదాస్‌ వైద్యాధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, రాజీవ్‌విద్యా మిషన్‌ పిఓ, ఆర్‌ డబ్లూఎస్‌ ఎస్‌ఈ, ఐసిడిఎస్‌ పిడి, జిల్లా అంధత్వ నివారణ అధికారి ప్రభుత్వాసుపత్రి వైద్యులు, ఆర్‌డిటి సంస్థ లతో జవహర్‌ బాల ఆరోగ్య రక్ష కార్యక్రమ అమలుపై సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ.. గుండెజబ్బులతో బాధపడుతున్న వారి వివరాలు, వారికి అందించిన వైద్య సేవలపై సమగ్ర నివేదికను అందజేయాలని ఆరోగ్య శ్రీ కోఆర్డినేటర్‌ను ఆదేశించారు. ప్రభుత్వాసుపత్రిలో రెఫరల్‌ కౌంటర్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. అదే రోజు జిల్లాలో అన్ని ప్రభుత్వ సిహెచ్‌సీలలో రెఫరల్‌ కౌంటర్‌ మొదలుపెట్టాలని కోరారు. ఆరోగ్య రీత్యా అందించే సేవలలో లోటుపాట్లను పూడ్చడానికి ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహించి, అవసరమైన వారికి కంటిఅద్దాలను ఇస్తున్నట్లు వైద్యాధికారి కలెక్టర్‌కు వివరించారు. స్వచ్ఛంధ సంస్థలతో, ఐఎంఏ, రోటరీక్లబ్‌లను బాగస్వాములను చేసుకుని సమావేశం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ సూచించారు. జిల్లాలోని అన్ని పాఠశాలలకు తాగునీటి వదుపాయం కల్పించాలని ఆర్‌డబ్లూఎస్‌ ఎస్‌ఈని ఆదేశించారు. విద్యార్థులకు మరిన్ని వైద్య సేవలు అందించేందుకు అధికారులు కృషిచేయాలన్నారు. క్యాంపులు నిర్వహించి ఆరోగ్య సేవల పట్ల సిబ్బందికి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటుచేయాలన్నారు.

Leave a Reply

free website analytics