కెసిఆర్ , కోమటిరెడ్డిలకు షోకాజ్

టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్రావుకు కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి షోకాజ్ నోటీస్ జారీ చేసింది. రాష్ట్ర హోంశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డిని సన్యాసి అని కెసిఆర్ చేసిన వ్యాఖ్యలపై ఈసి తీవ్రంగా స్పందించింది. ఈ నెల 23వ తేదీన సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారంలో భాగంగా సబితా ఇంద్రారెడ్డిని ఉద్దేశించి కెసిఆర్ వాడిన అసభ్య పదజాలంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈసి దీనిని సుమోటోగా స్వీకరించింది.ఇదిగాక 22వ తేదీన వేములవాడలో బహిరంగ సభలో మాట్లాడుతూ పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్ను ఉద్దేశించి “కొట్టినా లేవలేని వాడు తిడితే లేస్తాడా..!”అంటూ వ్యాఖ్యానించారు.రాజకీయపార్టీల వద్ద డబ్బులు తీసుకుని ఓట్లు మాత్రం టిఆర్ఎస్ అభ్యర్ధులకు వేయాలని సూచించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఓటర్లను ప్రలోభపెట్టడమేనని ఈసి అభిప్రాయపడింది. మరో వైపు రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఈసి నోటీసులు జారీ చేసింది.సిర్పూర్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లను ఆకట్టుకునేందుకు సాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు నిర్మాణాలు చేపడతామని హామీలివ్వడాన్ని ఈసి సీరియస్గా పరిగణించింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘనగా భావిస్తూ ఆయనకు నోటీస్ జారీ చేసింది. కెసిఆర్, కోమటిరెడ్డిలకు ఇచ్చిన నోటీసులపై సోమవారం మధ్యాహ్నం 11 గంటల్లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది.




