జర్నలిస్టుల ధర్నా

తమ డిమాండ్ల సాధన కోసం జర్నలిస్టులు సోమవారం హైదరాబాద్లోని సమాచారభవన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్య (ఎపిడబ్ల్యుజెఎఫ్) ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో జర్నలిస్టులు నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, అర్హులైన జర్నలిస్టు లకు ఇళ్లస్థలాలు ఇవ్వాలని, ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరు చేయాలని, ప్రెస్ అకాడమీతో సహా ప్రభుత్వం జర్నలిస్టుల కోసం నియమించే అన్ని కమిటీల్లో ఎపిడబ్ల్యుజెఎఫ్కు ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతూ ఈ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.ఎస్ హష్మి, జి. ఆంజనేయులు, కార్యదర్శులు పి. శంకర్, కె. మంజరి, కార్యవర్గ సభ్యులు ఓ.శాంతి, హెచ్యుజె అధ్యక్ష, కార్యదర్శులు ఎం. సోమయ్య, పి.ఆనందం తదితరులు పాల్గొన్నారు.సెప్టెంబర్ 15 నుంచి హైదరాబాద్లో బిపిఎల్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఆరోగ్యశ్రీ కార్డుల మంజూరుకు అవసరమైన డేటా సేకరణ చేపడతామని సమాచార శాఖ కమిషనర్ సి. పార్థసారధి ఫెడరేషన్ ప్రతినిధి వర్గానికి హామీ ఇచ్చారు.




