జాతీయ చలన చిత్ర అవార్డులు

రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మకమైన మూడు జాతీయ చలన చిత్ర అవార్డులు, ఒక రాష్ట్రీయ తెలుగు చలన చిత్ర అవార్డును 2008 సంవత్సరానికిగాను గురువారం ప్రకటించారు. ఎన్టీఆర్ జాతీయ చలన చిత్ర అవార్డును ప్రముఖ నటి జమునకు, బి.ఎన్.రెడ్డి జాతీయ చలన చిత్ర అవార్డును ప్రముఖ దర్శకుడు కె.బి. తిలక్కు ప్రకటించారు. నాగిరెడ్డి, చక్రపాణి జాతీయ చలన చిత్ర అవార్డుకు ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ అధిపతి, నిర్మాత ఎ.రమేష్ ప్రసాద్ను ఎంపిక చేశారు.
రఘుపతి వెంకయ్య చలన చిత్ర అవార్డుకు ప్రముఖ నటి, మహిళా దర్శకురాలు విజయ నిర్మలను ఎంపిక చేసినట్లు ప్రకటించారు. ఈ అవార్డులను ఈ నెల 16న లలితా కళా తోరణంలో జరిగే చలన చిత్ర నంది అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కె.రోశయ్య చేతుల మీదుగా అందజేస్తారని రాష్ట్ర చలన చిత్ర, టి.వి. నాటక రంగ అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సి.పార్థసారథి తెలిపారు.




