తెలంగాణ వస్తే పాక్ కలలు నెరవేరినట్టే – కమిటీకి లగడపాటి మూడో లేఖ
విడిపోతే ఐదు రాష్ట్రాలు.. గ్రేటర్ హైదరాబాద్ తప్ప మిగిలినవి దివాలా
హైదరాబాద్ లేకపోతే జలయజ్ఞం బూడిదలో పోసిన పన్నేరే
కుల,మత ఘర్షణలు పెచ్చరిల్లుతాయి
నేటి తెలంగాణ నేతలు పీవీ కంటే మేధావులా!? శ్రీకృష్ణ కమిటీకి లగడపాటి మూడో లేఖ
ఆంధ్రప్రదేశ్ ముక్కలు కావాలని పాకిస్థాన్ సైన్యం, ఆ దేశ నిఘా సంస్థ ఐఎస్ఐ కోరుకుంటున్నాయని, తెలంగాణ కావాలని కోరుతున్నవారు ఐఎస్ఐ కలలను నెరవేరుస్తున్నారని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వ్యాఖ్యానించారు. ఐఎస్ఐ తెలంగాణలో అడ్డా ఏర్పరచుకుంటే భారతదేశ ప్రయోజనాలు దెబ్బతింటాయని, పక్కనే ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి కూడా తీవ్ర నష్టం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకవేళ రాష్ట్రాన్ని విభజిస్తే.. దానిని గ్రేటర్ హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్ర, ఉత్తర కోస్తాంధ్ర, గ్రేటర్ రాయలసీమగా విడదీయాలని, వీటిలో ఒక్క గ్రేటర్ హైదరాబాద్ తప్ప మిగిలిన ప్రాంతాలన్నీ దివాలా తీస్తాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
కేవలం హైదరాబాద్ నుంచే 50 శాతం ఆదాయం రాష్ట్రానికి లభించడమే ఇందుకు కారణమని వివరించారు. హైదరాబాద్ లేకపోతే జలయజ్ఞం కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరుగా మారతాయని ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీకృష్ణ కమిటీకి రాసిన మూడో లేఖను మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాశ్ ద్వారా గురువారం ఆయన కమిటీ కార్యాలయానికి పంపించారు. వాస్తవానికి, తెలంగాణ కోసం గొంతెత్తి మాట్లాడే వారికన్నా, సమైక్యాంధ్ర కోరుకునే తెలంగాణ ప్రజలే మెజారిటీ సంఖ్యలో ఉన్నారని ఆ లేఖలో రాజగోపాల్ పేర్కొన్నారు. ఈ తెలుగు బంధాన్ని విడదీస్తే అది రెండు రాష్ట్రాలతో ఆగిపోదని, కనీసం ఐదు రాష్ట్రాలు ఏర్పడాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
దేశ తలసరి ఆదాయం 2007-08లో రూ.35,430 ఉండగా.. తెలంగాణ సగటు ఆదాయం రూ.36,500 ఉందని వివరించారు. దీనినిబట్టి దేశ సగటు అభివృద్ధి కంటే తెలంగాణలో ఎక్కువ అభివృద్ధి జరిగినట్లు అర్థమవుతోందని ఆయన పేర్కొన్నారు. బీహెచ్ఈఎల్ – ఎన్టీపీసీ మన్నవరం వంటి అనేక ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్ పోరాడి సాధించుకుందని, విడిపోతే రెండు రాష్ట్రాలకూ కేంద్రం వద్ద ఏ ప్రాజెక్టునైనా సాధించుకోగల శక్తి పోతుందని ఆయన వివరించారు. ప్రధాన సంస్థలు, యూనివర్సిటీలు, రక్షణ, పరిశోధన సంస్థలు, అనేక ప్రైవేట్ సంస్థలు హైదరాబాద్లోనే ఉన్నాయని పేర్కొన్నారు. కొత్త రాజధానిని ఏర్పరచడం వేల కోట్లు ఖర్చవుతుందని, ఇది నిరుత్పాదక వ్యయం తప్ప మరేమీ కాదని అభిప్రాయపడ్డారు. మరో కొత్త రాజధానికి హైదరాబాద్ స్థాయి రావాలంటే కొన్ని దశాబ్దాలు పడుతుందని వివరించారు.
తెలంగాణ ఏర్పడితే మరిన్ని ఉప ప్రాంతీయ పార్టీలు ఏర్పడి రాజకీయ సుస్థిరత దెబ్బతింటుందని, కుల, మత ఘర్షణలు మరింత పెచ్చరిల్లుతాయని అభిప్రాయపడ్డారు. తెలంగాణకు చెందిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వంటి మేధావే సమైక్యాంధ్ర కోసం కట్టుబడి పనిచేశారని, నేటి తెలంగాణ నేతలు ఆయన కంటే రాజనీతిజ్ఙులా? అని రాజగోపాల్ తన లేఖలో ప్రశ్నించారు. కృష్ణానదికి ఇరువైపులా ఉన్న ప్రజలు కలిసి మెలిసి మహోన్నత ఆంధ్రప్రదేశ్ను ఏర్పరచాలని 1956లో నిజామాబాద్లో జరిగిన ఒక సభలో మాట్లాడుతూ భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అన్న మాటలను ఆయన ఉటంకించారు.




