దిగిన పప్పుల ధరలు

మూడు నెలల క్రితం రికార్డు స్థాయికి చేరుకున్న కందిపప్పు ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇతర నిత్యావసర సరకుల ధరల తగ్గుదలతో పోలిస్తే కందిపప్పు ధర తగ్గుదల స్థాయే ఎక్కువగా ఉంది. కంది పప్పు ధర 24.8 శాతం మేర తగ్గడంతో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎంతో ఆనందంగా ఉన్నారు. చక్కెర మినహా ఇతర సరకుల ధరలు తగ్గుముఖం పట్టినట్లు మంత్రి సోమవారం తెలియజేశారు. రాష్ట్రంలోని గోదాములలో అధిక భాగం కందిపప్పు, సెనగపప్పు నిల్వలతో నిండిపోయి ఉన్నాయని ఆయన చెప్పారు. మినప్పప్పు, పెసరపప్పు, సెనగపప్పు, చింతపండు, మిర్చి, ఉల్లిపాయల ధరలు బాగా తగ్గాయని జూపల్లి తెలిపారు. ‘పొరుగు రాష్ట్రాల నుంచి కొత్త సరకులు రావడం వల్ల రాష్ట్రంలో పప్పుల ధరలు తగ్గాయి’ అని ఆయన చెప్పారు. క్రితం సంవత్సరం మంచి లాభాలు రావడంతోను, ప్రభుత్వం ప్రోత్సహిస్తుండడంతోను కోస్తా ప్రాంతాలలో చాలా మంది రైతులు కందుల పెంపకాన్ని చేపట్టారని మంత్రి తెలిపారు. కాగా, ‘సూపర్ ఫైన్’ రకం బియ్యం ధర కిలోకు రూ. 36 నుంచి రూ. 31.43కు తగ్గిందని జూపల్లి తెలియజేశారు. సగటు నాణ్యమైన బియ్యం ధర కిలోకు రూ. 26.13కు తగ్గిందని ఆయన చెప్పారు. వేరుశనగ ఉత్పత్తి కొన్ని ప్రాంతాలలో తగ్గినప్పటికీ వేరుశనగ నూనె ధర లీటర్ కు రూ. 69.29కి తగ్గింది. సన్ ఫ్లవర్ ఆయిల్, పామోలిన్ ఆయిల్ ధరలు కూడా వరుసగా 20.75, 7.56 శాతం మేర తగ్గాయి. ఇక గత 15 రోజులలో చక్కెర ధరలు 2.42 శాతం తగ్గాయి. కాని దాని ధర కిలో రూ. 37గా కొనసాగుతోంది.




