నేడు మన్నవరానికి మన్మోహన్

కేంద్రప్రభుత్వం ఎన్టిపిసి, బిహెచ్ ఇఎల్ సంయుక్త ఆధ్వర్యంలో 6వేల కోట్ల రూపాయల పెట్టుబడితో తిరుపతి సమీపంలోని మన్నవరం వద్ద నిర్మించనున్న భారీ విద్యుత్తు పరికరాల కర్మాగారానికి ప్రధాని డాక్టర్ మన్మోహన్సింగ్ బుధవారం శంఖుస్ధాపన చేయనున్నారు. గత సంవత్సరం సెప్టెంబర్లో ప్రారంభం కావాల్సిన ఈ కార్యక్రమం పలు కారణాల రీత్యా ఇప్పటికి 6సార్లు వాయిదా పడింది. మన్నవరం వద్ద ఫ్యాక్టరీ నిర్మాణం కోసం 750 ఎకరాల భూమిని ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్ధ ద్వారా విద్యుత్తు పరికరాల సంస్ధకు (ఎన్బిపిపిఎల్) అప్పగించారు. కర్మాగార నిర్మాణానికి ఇప్పటికే రెండు సంస్ధలు ప్రాధమికంగా 100 కోట్లు చొప్పున నిధులు సమకూర్చాయి. శంఖుస్ధాపన పూర్తి అయిన వెంటనే పనులు ఊపందుకోనున్నాయి. విద్యుత్తు పరికరాల కర్మాగారం పూర్తయితే ఈ ప్రాంతంలో 6వేల మందికి ప్రత్యక్షంగానూ 25వేల మందికి పరోక్షంగానూ వుపాధి లభించనుంది. ఈ కర్మాగారంలో భారీ విద్యుత్తు జనరేషన్ ప్రాజెక్టులకు అవసర మయ్యే టర్బైన్లు, జనరేటర్లు, బాయిలర్స్ను ఉత్పత్తి చేయనున్నారు. ఈ ప్రాంతానికి వైఎస్ఆర్ పురంగా నామకరణం చేశారు. ఇక్కడి నుండి 5000 మెగా వాట్ల సామర్ధ్యం వున్న జనరేటర్లను సైతం తయారు చేయనున్నారు. 2014 కల్లా కర్మాగారము పూర్తి స్ధాయిలో ఉత్పత్తులు ప్రారంభించనుంది. ఇంకా ఈ కర్మాగారము ప్రారంభం కాకుండానే ఎన్టిపిసిి, బిహెచ్ఇఎల్ నుండి పలు ఆర్డర్లు పొందడం విశేషం. అలాగే ఎపిజెన్కో నుండి కూడా 500/600 మెగావాట్ల పవర్ప్లాంట్ కొరకు పరికరాలను పొందనుంది. భవిష్యత్తు లో ఈ కర్మాగారం నుండి బొగ్గు, మాష్ వాడకంతో కూడిన ఉత్పత్తులు రానున్నాయి. కంపెనీకి సియండిగా సి.పి.సింగ్ వ్యవహరిస్తుండగా డైరెక్టర్లుగా ఎన్టిపిసి నుండి ఇద్దరు, బిహెచ్ఇఎల్ నుండి ఇద్దరు సభ్యులుగా వుండనున్నారు. ఈ కర్మాగారం పూర్తయితే పారిశ్రామికంగా వెనకబడ్డ చిత్తూరు జిల్లా అభివృద్ధికి ఎంతో దోహదపడనుంది




