పండుగల భద్రతపై సీఎస్ ఎస్.వి. ప్రసాద్ సమీక్ష
రెండు పర్వదినాలు ఒకరోజు తేడాతో వస్తున్న గణపతి నవరాత్రి ఉత్సవాలు, రంజాన్ పర్వదినంపై రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్వీప్రసాద్ సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. డీజీపీ అరవిందరావు, నగర పోలీసు కమిషనర్ ఎ.కే.ఖాన్, ఇంటెలిజెన్స్ ఛీఫ్ ఎం.మహేందర్రెడ్డి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఎ.కే.ఖాన్ మాట్లాడుతూ రంజాన్, గణపతి నవరాత్రులకు ముందుగానే బందోబస్తును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మండపాల ఏర్పాటు చేసే నిర్వాహకులతో సమావేశం నిర్వహించామనీ, నగర పోలీసులతో పాటు అదనంగా ఇతర జిల్లాల నుంచి 9వేల మంది సిబ్బందిని నగరానికి తరలిస్తున్నట్లు చెప్పారు.
అలాగే విగ్రహాల నిమజ్జనానికి 45 క్రేన్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉస్మానియా యూనివర్శిటీ బీఇడీ కేంద్రంలోకి విద్యార్థుల చొరబాటులో పోలీసుల వైఫల్యం లేదని, పరీక్షా కేంద్రాల వద్ద ప్రహారీగోడ చిన్నదిగా ఉండటం వల్ల వారిని నియంత్రించలేకపోయినట్లు చెప్పారు. ఇక నుంచి ఇలాంటి పరీక్షలు నిర్వహించే కేంద్రాల ఎంపిక సమయంలో పోలీసులను కూడా సంప్రదిస్తే ఏ కేంద్రాల్లో ఏర్పాటు చేస్తే భద్రతకు అనువుగా ఉంటుందో సూచించే అవకాశం ఉంటుందని ఖాన్ అభిప్రాయపడ్డారు.




