పేదల కన్నీళ్లు తుడిచేద్దాం – రిపబ్లిక వేడుకల్లో గవర్నర్ నరసింహన్

రాష్ట్ర సమగ్రాభివృద్ధి శాంతియుత వాతావరణంతోనే సాధ్యమని గుర్తించిన తమ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని సమర్థవంతంగా అణచివేసిందని రాష్ట్ర గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ అన్నారు. ఃపేదవాని కంట కన్నీటిఃని తుడచివేసేందుకు స్వార్థం, సంకుచితత్వాన్ని పక్కన బెట్టి సమిష్టి కృషితో ఃఉజ్వల భారతాన్నిః నిర్మిద్దామని పిలుపునిచ్చారు. 63 వ రిపబ్లిక్ వేడుకల సందర్భంగా గురువారం సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో గవర్నర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి 40 నిమిషాల పాటు ప్రసంగించారు.
ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా ఈ వేడుకలను జరుపుకుంటున్నామని, ఈ సందర్భంగా వారిని స్మరించుకోవడం అందరి విధి అనీ, ఆ మహనీయులు ఆశించిన ఃభారత జాతి వికాసానికి, సమానత్వానికి, సమైక్యతఃకు పునరంకితమవుదామని పిలుపునిచ్చారు. ఈ లక్ష్యసాధనలో తమ ప్రభుత్వం ఎన్నో ప్రజోపయోగ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోందని చెప్పారు. అభివృద్ధి పథకాలను పారదర్శకంగా ప్రజల్లోకి తీసుకుపోవడం, అవినీతికి అతీతంగా పాలన అందించడం తమ ప్రభుత్వ కర్తవ్యమని నొక్కి చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో ఏర్పడిన అననుకూల వాతావరణం వల్ల రాష్ట్రంలో కరవు పరిస్థితులు ఏర్పడ్డాయని, 876 మండలాలను ప్రభుత్వం కరవు మండలాలుగా ప్రభుత్వం గుర్తించిందని పేర్కొన్నారు. కరవులో ఉన్న రైతులను ఆదుకునేందుకు, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని వివరించారు. ప్రతికూల పరిస్థితుల్లో సైతం ధైర్యంగా ఉన్న రైతులను కొనియాడక తప్పదన్నారు. ఇబ్బందుల్లో ఉన్న రైతాంగాన్ని ఆదుకునేందుకు 2011 -12 లో రూ. 37 వేల కోట్ల రుణాలను అందజేశామని, పావలావడ్డీ కింద రూ. 75 కోట్లు వెచ్చించినట్లు తెలియజేశారు. సన్నకారు రైతులకు రూ. 231 కోట్లతో 17.09 లక్షల క్వింటాళ్ల విత్తనాలను 50 శాతం సబ్సిడీపై అందించామని, అంతేగాక భూహక్కులకు సంబంధించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను నివారించేందుకు ఈ నెల 18 న ఃరెవెన్యూ సదస్సులుః ప్రారంభించిందని, మార్చి 17 వరకు నెలరోజుల పాటు ఈ సదస్సులు జరుగుతాయని గవర్నర్ అన్నారు. ఈ సదస్సుల్లో 60 వేలకు పైగా వివాదాలను పరిష్కరించాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కౌలు రైతుల హక్కుల పరిరక్షణకు ఎపి కౌలు రైతులు (సాగుదారులు) బిల్లు -2011 తీసుకువచ్చామని, 2011 -12 లో 1.8 లక్షల మంది కౌలుదారులకు రూ. 380 కోట్ల రుణం అందించామన్నారు. అంతేగాక రూ. లక్ష వరకు రైతులకు వడ్డీ లేని రుణాన్ని అందిస్తున్నామని, దీనివల్ల 95 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థ (పిడిఎస్) ద్వారా 2.25 కోట్ల కుటుంబాలకు రూపాయికే కిలోబియ్యం పంపిణీ చేస్తున్నామని, దీనివల్ల 7.5 కోట్ల మందికి ప్రయోజనం కలుగుతుందన్నారు. గుడ్ల ఉత్పత్తిలో దేశంలోనే మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని, పాల ఉత్పత్తిలో 2 వ స్థానంలో ఉందనీ..,. పాడి ఉత్పత్తిని గణనీయంగా పెంచేందుకు రూ. 6 వేల కోట్లతో ఃస్టేట్ మిల్క్ మిషన్ః కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. జలయజ్ఞం పథకం కింద నిర్మాణంలో ఉన్న 49 ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో సత్వరం పూర్తి చేసేందుకు లక్ష్యంగా తీసుకున్నామని తెలిపారు.
ఎస్సి, ఎస్టి సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతోందని, ఇప్పటి వరకు 7 లక్షల ఎకరాల భూమిని ఈ వర్గాల కోసం పంపిణీ చేశామని,ఇందిర జలప్రభ కింద రూ. 1838 కోట్ల వ్యయంతో 10 లక్షల ఎకరాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (ఎంజిఎన్ఆర్ఇజిఎస్) పథకం కింద రూ. 17,747 కోట్లు వినియోగించామని, 2011 -12 లో రూ. 3,138 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. రూ. 737 కోట్ల వ్యయంతో దళిత వాడల్లో రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణం చేపట్టామని పేర్కొన్నారు.
యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో రాజీవ్ యువకిరణాలు (ఆర్వైకె) అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించామని, ఈ పథకం ద్వారా వచ్చే మూడేళ్లలో 15 లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించనున్నామని చెప్పారు. సత్వరం రుణాలు తీసుకునేందుకు శ్రీనిధి బ్యాంకును ప్రారంభించామన్నారు. మహిళలకు పాలనలో భాగస్వామ్యం కల్పించేందుకు స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నామని, ఇదొక మైలురాయిగా గవర్నర్ అభివర్ణించారు.
రాష్ట్రంలో ఉన్న 72,407 ఆవాసాలలో 45,785 అవాసాలకు పూర్తిగా తాగునీటి సౌకర్యం కల్పించామని, అన్ని గ్రామాలలో ప్రజల జీవన విధానాలు మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విద్యుత్ రంగానికి ప్రభుత్వం పెద్దగా ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రైతుల అభివృద్ధి కోసం 29.84 లక్షల పంప్ సెట్లకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 15,768 మెగావాట్ల విద్యుదుత్పాదన జరుగుతోందని, రాష్ట్రావసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుదుత్పాదనకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. చిన్నతరహా పరిశ్రమల ద్వారా 28.26 మంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించామన్నారు. పెట్టుబడులను ఆకర్శించేవిధంగా ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ ( 2010 -15) ని రూపొందించామన్నారు. పరిశ్రమలను ప్రోత్సహించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నామని, ఈ నెలలో జరిగిన 18 వ భాగస్వామ్య సదస్సులో రూ. 6.48 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, వాటి ద్వారా 6.78 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించవచ్చన్నారు. చేనేత పరిశ్రమకు కూడా పెద్దపీట వేస్తున్నామని, ఈ వర్గాల అభ్యున్నతికి బడ్జెట్లో రూ. 312 కోట్లు కేటాయించామన్నారు. రాష్ట్రానికి 75 ప్రత్యేక ఆర్థిక మండళ్లు మంజూరయ్యాయని, 603 కిలోమీటర్లను కోస్టల్ కారిడార్గా ప్రభుత్వం ప్రకటించిందని వెల్లడించారు. శిశు మరణాల రేటును 49 నుంచి 46 కి తగ్గించామని, ఎంఎంఆర్ రేటు కూడా తగ్గిందన్నారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే 155 మంది స్పెషలిస్టులు, 846వ మంది ఎంబిబిఎస్ డాక్టర్లు, 2346 మంది నర్సుల పోస్టులను భర్తీ చేశామని, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. విద్యారంగం విషయానికి వస్తే, బడుగువర్గాల బాలికలకు నాణ్యమైన విద్యను అందించేందుకు 743 కస్తూర్బా కేంద్రాలు ప్రారంభించామని, రాజీవ్ విద్యామిషన్ (ఎస్ఎస్ఎ) పథకం ద్వారా ప్రాథమిక విద్యను పటిష్టం చేస్తున్నామన్నారు. 20,599 అదనపు తరగతి గదుల నిర్మాణం, కేంద్ర ప్రభుత్వ సహకారంతో రూ. 1234.26 కోట్లతో మధ్యాహ్న భోజన పథకాన్ని విజయవంతంగా నడుపుతున్నామన్నారు. రూ. 2211 కోట్ల వ్యయంతో 737 మోడల్ స్కూల్స్ను వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రారంభిస్తున్నామని తెలిపారు. 27 లక్షల మంది ఎస్సి, ఎస్టి, బిసి, ఇబిసి విద్యార్థులకు ఉపకారవేతనాలు, ఫీజులు రీయింబర్స్మెంట్ చేస్తున్నామని, అందుకోసం రూ. 4 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు.
గిరిజనుల అభ్యున్నతి కోసం ప్రత్యేకంగా ఃగిరిజన సాధికారత విధానాన్నిః ప్రకటించామన్నారు. వారి హక్కుల పరిరక్షణలో భాగంగా 1.67 భూమి టైటిల్స్ పంపిణీ చేశామని పేర్కొన్నారు. జెఎన్ఎన్యుఆర్ఎం ద్వారా పట్టణాభివృద్ధి కోసం కేంద్రం రాష్ట్రానికి 252 ప్రాజెక్టులకు రూ. 12,230 కోట్లు మంజూరూ చేసిందని వెల్లడించారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణాలలో ఈ పథకం కింద 1.10 ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు. ప్రపంచ బ్యాంకు సహకారంతో రూ. 1,670 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, 13 వ ఆర్థిక కమిషన్ ద్వారా 1919.20 కోట్లతో వచ్చే ఐదేళ్లలో పట్టణాభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. వంద రోజుల్లో హైదరాబాద్ నగర అభివృద్ధి కార్యాచరణ ప్రణాళికను విజయవంతంగా అమలు చేశామని, అందుకోసం రూ.700 కోట్లు ఖర్చు చేశామన్నారు. దీని కోసం జిహెచ్ఎంసి, హెచ్ఎండిఎ, సిపిడిసిఎల్, ఎపి ట్రాన్స్కో, వాటర్ బోర్డు, ఎపిఎస్ఆర్టిసి, ఆర్అండ్బి, ట్రాఫిక్ పోలీస్ సహకారం తీసుకుంటున్నామన్నారు. ఫేజ్ 2 కింద మరొక సారి 100 రోజుల కార్యాచరణను ప్రారంభించామన్నారు. ఔటర్ రింగ్రోడ్డు (ఓఆర్ఆర్)ను రూ. 6,786 కోట్లతో చేపట్టామన్నారు. రూ. 14 వేల కోట్లతో రెండోదశ మల్టీమోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టం (ఎంఎంటిఎస్) పనులు త్వరలో ప్రారంభించనున్నామని గవర్నర్ వెల్లడించారు. ఐటి ఎగుమతుల్లో దేశంలో నాల్గవ స్థానంలో ఉన్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాల అమలు కోసం ఃగ్రీన్ ఛానల్ స్కీంఃను ప్రారంభించామన్నారు. మొదటి విడత రచ్చబండలో రూ. 1767.37 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు.




