ప్రధాని దగ్గర పెద్దన్నలు పేద అరుపులు – సాంకేతి విషయాలు తెలియవు ప్రధాని సమాధానం

రాష్ర్ట నాయకులు అఖిల పక్షంగా వెళ్ళి కేంద్రం మెడలు వంచి బాబ్లీపై రాష్ర్టానికి జరుగుతున్న అన్యాయన్ని ఆపుతారని అనుకున్న రాష్ర్ట ప్రజలకు మరోసారి అవమానం ఎదురైంది.. అఖిల పక్షంగా వెళ్ళిన రాష్ర్ట పెద్దన్నలు ప్రధాని ముందు పేద అరుపులు అరవడానికే సరిపోయింది.. అయితే పేద అరుపులు విన్న ప్రధాని చాలా రిలాక్స్గా నాకు సాంకేతిక సమస్యలు తెలియవు తెలుసుకుంటానని తెలపడం అత్యంత హాస్యా స్పదం. రెండు రాష్ర్టాల మధ్య ఇంత పెద్ద ఎత్తున జల వివాదం తలెత్తి ఆంధ్ర ప్రదేశ్ రాష్ర్ట ప్రదాన ప్రతి పక్ష నేత మహారాష్ర్ట అరెస్టు, లాఠీ చార్జి జరిగిన తరువాత కూడా ఇంకా ప్రధాని సాంకేతిక సమస్యలు తెలియవని కుంటి సాకులతో సమాధానం ఇవ్వడం ఎంతో హాస్యస్పాదం. దీన్ని బట్టి కేంద్రం ఆంధ్ర ప్రదేశ్పై ప్రభుత్వానికి ఎంత చిత్తశుధ్ది వుందనేది ఇట్టే అర్థం మవుతుంది.. అయితే మన పెద్దన్నలు ఈ విషయాన్ని ఎక్కడ కనపడకుండా మీడియా ముందు చంకలు గుద్దుకున్నారు. వారి మాటల్లో.. “ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ బాబ్లీ సమస్యను సావధానంగా విన్నారు. సమస్య పరిష్కారానికి ఆయన చిత్తశుద్ధితో కృషి చేస్తారనే విశ్వాసం నాకుంది” – ముఖ్యమంత్రి రోశయ్య
బాబ్లీపై కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. ప్రధాని నిర్దిష్టమైన హామీ ఇవ్వలేదు. కార్యాచరణ ప్రకటించలేదు. – చంద్రబాబు, తెలుగుదేశం
బాబ్లీ సమస్యను ప్రధాని సీరియస్గా తీసుకున్నారు. ఆయనతో సమావేశం సంతృప్తికరంగా జరిగింది. – చిరంజీవి, ప్రజారాజ్యం
బాబ్లీని రాజకీయంగానే పరిష్కరించాలని ప్రధానిని కోరాం. ప్రధాని స్పందించిన తీరు అసంతృప్తి కలిగించింది. – నారాయణ, సీపీఐ
కృష్ణా, గోదావరి జలాల వినియోగంపై చట్టబద్ధ సంస్థ ఏర్పాటు చేయాలని కోరాం. దీనిపై ప్రధాని సానుకూలంగా స్పందించారు. – వినోద్ కుమార్, టీఆర్ఎస్
ప్రధానికి సమస్య తీవ్రత అర్థమైంది. సమాఖ్య వ్యవస్థలో ఏ ప్రధానీ ఒక్క రోజులో సమస్యను పరిష్కరించలేరు. – జయప్రకాశ్ నారాయణ్, లోక్సత్తా
బాబ్లీ ప్రాజెక్టుపై కేంద్రం ముందు అఖిలపక్షం ఒకే మాట వినిపించింది. సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ అమర్చిన బాబ్లీ గేట్లను బద్దలు కొట్టాలని కోరింది. మహారాష్ట్ర అక్రమ ప్రాజెక్టులు అడ్డుకోవాలని మొరపెట్టుకుంది. దిగువ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రధాని మన్మోహన్ దృష్టికి తెచ్చింది.
సమస్య పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని, వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవాలని విన్నవించింది. బాబ్లీపై ముఖ్యమంత్రి రోశయ్య నేతృత్వంలో అన్ని రాజకీయ పార్టీల నేతలు సోమవారం ప్రధాని మన్మోహన్ను కలిశారు. గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న బాబ్లీ, 13 ఇతర ప్రాజెక్టులను నిలిపివేయకపోతే… ఉత్తర తెలంగాణలో లక్షలాది ఎకరాలు ఎడారిగా మారతాయని తెలిపారు.
మహారాష్ట్ర అక్రమాలను వివరిస్తూ 14 పేజీల వినతి పత్రాన్ని ప్రధానికి సమర్పించారు. “సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ ప్రాజెక్టుకు గేట్లు అమర్చింది. ఎలాంటిఅనుమతులు లేకుండానే గోదావరి 13 ఇతర ప్రాజెక్టులు నిర్మిస్తోంది.
ఇలాంటి అక్రమాలు అడ్డుకోవాలన్నా, భవిష్యత్తులో నీటి యుద్ధాలు జరగకుండా ఉండాలన్నా ఒక బలమైన రాజ్యాంగబద్ధమైన నియంత్రణ సంస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాలి” అని వినతిపత్రంలో కోరారు. కృష్ణా, గోదావరి నదులకు అత్యంత దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్ జల ప్రయోజనాలను కాపాడేందుకు వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవాలని ప్రధానిని కోరారు.
ముఖ్యమంత్రితోపాటు తొమ్మిది పార్టీల నేతలు మహారాష్ట్ర వైఖరిని ముక్తకంఠంతో ఖండించారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ రాజ్యాంగానికి అతీతమైనట్లుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఈ పరిస్థితుల్లో తామేమీ చేయలేమంటూ కేంద్ర జలవనరుల మంత్రి పవన్ కుమార్ బన్సల్ వ్యాఖ్యానించడం సరి కాదని రోశయ్య ప్రధానికి ఫిర్యాదు చేశారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటి నిల్వ పరిధిలోనే బాబ్లీ ప్రాజెక్టు నిర్మిస్తున్న విషయాన్ని నేతలు ప్రధాని దృష్టికి తెచ్చారు. అయితే… ప్రధానమంత్రి నుంచి ఈ విషయంలో నిర్దిష్టమైన హామీ ఏమీ లభించలేదు. ఈ విషయంలో సాంకేతికాంశాలపై కేంద్ర జల సంఘం, జల మంత్రిత్వ శాఖ అధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేస్తానన్నారు.
“సమాఖ్య వ్యవస్థలో చర్చల ద్వారా పరిష్కారం సాధ్యమే. నన్ను ఆలోచించుకోనివ్వండి” అని కోరారు. ప్రధాని హామీ పట్ల ముఖ్యమంత్రితోపాటు మరికొందరు ప్రతిపక్ష నేతలు విశ్వాసం ప్రకటించారు. అయితే… సమస్య పరిష్కారానికి నిర్ణీత కాలపరిమితిని చెప్పకపోవడంపై టీడీపీ అధినేత చంద్రబాబుతీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో కూడా ఇలాంటి హామీలు ఇచ్చి నెరవేర్చలేదని ఆయన అన్నారు.
ప్రధాని నిర్దిష్టమైన హామీ ఇవ్వనప్పటికీ ఆయన స మస్యను సానుకూలంగా విన్నారని, పరిష్కారం కోసం వేచి చూడడం మంచిదని ఇతర పార్టీ నేతలు చెప్పారు. ప్రధాని నివాసంలో సుమారు 45 నిమిషాలపాటు ఈ సమావేశం జరిగింది. ప్రధానితో భేటీ తర్వాత నేతలు విలేఖరులతో మాట్లాడారు. తా ము చెప్పి విషయాలు ప్రధాని సావధానంగా విన్నారని దాదా పు అందరు నేతలు చెప్పారు.




