బయ్యారం భూములు ఎవడబ్బ సొమ్ము – వైఎస్ అల్లుడికి ఎలా దానం చేస్తారు – చంద్రబాబు

రాష్ట్రంలో వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు రాష్ట్రాన్ని అవినీతిమయం చేశారని, ప్రజలను మభ్యపెట్టి వేలాదికోట్ల రూపాయిల భూములు, ఖనిజ సంపదను తమ కుటుంబ సభ్యులకు ధారాదత్తం చేశారని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తీవ్రస్థాయిలో ఆరోపించారు. వై.ఎస్. బతికుండగా తన అల్లుడికి 1.46 లక్షల ఎకరాల బయ్యారం భూములను ఎవడబ్బసొమ్మని దానం చేశారని, గాలి సోదరులకు ఓబులాపురం గనులను కట్టబెట్టారని, ఇలా రాష్ట్రాన్ని వైఎస్ కుటుంబసభ్యులు దోపిడీ చేశారని చంద్రబాబు ఆరోపించారు. మూడురోజుల పాటు జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబుకు మంగళవారం ఉదయం జిల్లాలోని ఎచ్చర్ల నియోజకవర్గం పైడిభీమవరం జాతీయ రహదారిపై జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పైడిభీమవరంలో చంద్రబాబు మాట్లాడుతూ, గత ఆరు సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని భ్రష్ఠుపట్టించిందని ఆగ్రహించారు.
ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెట్టి వై.ఎస్. ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ నిలుపుకోలేదన్నారు. వై.ఎస్.కుటుంబం అభివృద్ధి చెందిందని, రాష్ట్రం మాత్రం వెనుకబడిపోయిందని దుయ్యబట్టారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వేయించిన రోడ్లను పాడుచేసే విధంగా ఓదార్పు యాత్రతో వై.ఎస్.విగ్రహాలను జగన్ ఏర్పాటు చేస్తున్నారని, భారీగా డబ్బులు ఖర్చుచేసి జనాన్ని తరలించుకుంటూ ఓదార్పు యాత్ర చేస్తున్నారన్నారు. వైఎస్ ప్రభుత్వ హయాంలో అవినీతి పెరిగిపోతుంటే, రోశయ్య పరిపాలన ప్రజలకు రోత పుట్టిస్తోందన్నారు. పరిపాలన పూర్తిగా స్తంభించిపోయిందన్నారు. చివరికి రోశయ్య తిరుపతి వచ్చి అక్కడనుంచి హైదరాబాద్ వెళ్లేందుకు కూడా డబ్బులులేవనే రీతిలో ముఖ్యమంత్రికి
టిక్కెట్ కూడా తీయడంలేదని, ముఖ్యమంత్రి పరిస్థితి ఈ విధంగా ఉంటే సామాన్యుని పరిస్థితి ఏవిధంగా ఉంటుందో ప్రజలు అర్ధం చేసుకోవాలన్నారు. ముఖ్యమంత్రికి వారంరోజుల పాటు జ్వరం వస్తేగాని రాష్ట్రంలో ప్రజలు విషజ్వరాల బారిన పడుతూ పడుతున్న ఇబ్బందులు అర్ధంకాలేదని విమర్శించారు. రాష్ట్రాన్ని ప్రభుత్వం రోగాలబారిన పడవేసిందని, పేదప్రజలకు వైద్య సహాయం అందించడంలో పూర్తిగా విఫలమైందన్నారు.
రాష్ట్ర బడ్జెట్ 40 వేల కోట్ల నుంచి 1.05 లక్షల కోట్లకు పెరిగినా, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెరిగినా రాష్ట్రంలో జరిగిన అభివృధ్ధి ఏమీ లేదని, చివరికి విద్యార్ధులకు ఫీజుల రీయంబర్స్మెంట్కు కూడా నిధులు లేవని ముఖ్యమంత్రి చేతులెత్తేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. ఒరిస్సాలోను, కాంగ్రేసేతర రాష్ట్రాలలో పర్యటిస్తూ సమస్యలపై ప్రజలతో పోరాటం సాగిస్తానంటున్న రాహుల్గాంధీ ఆంధ్రప్రదేశ్లో పర్యటించి, ఇక్కడ ప్రజల సమస్యలపైన, అవినీతిపైన పోరాడేందుకు ఎందుకు రావడంలేదని ప్రశ్నించారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యారంగ అభివృధ్ధికి, సాంకేతిక రంగాన్ని అభివృధ్ధి చేసేందుకు తీసుకున్న చర్యల కారణంగానే ఇప్పుడు లక్షలాది మంది విద్యార్ధులు ఉన్నత విద్య అభ్యసించి విదేశాలలో ఉద్యోగాలు చేస్తూ తమ ప్రతిభను చాటుతున్నారన్నారు. సెల్ఫోన్లు భారీసంఖ్యలో వినిమయంలోకి రావడం తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలేనని పేర్కొన్నారు. టెలికంరంగంలో త్రిజి స్పెక్ట్రమ్ వినియోగంలో కేంద్రప్రభుత్వానికి లక్ష కోట్ల రూపాయిల ఆదాయం సమకూరిందని, అయితే కాంగ్రెస్, డిఎంకె నాయకులు అందులో 50 వేలకోట్ల రూపాయిలు స్వాహా చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు చేస్తున్న అవినీతి చర్యలవల్ల ప్రపంచస్థాయిలో దేశపరువు మంటగలుస్తోందని విమర్శించారు. ఐపిఎల్లో వేల కోట్ల రూపాయిల అవినీతికి పాల్పడిన కాంగ్రెస్ నాయకులు, ఇప్పుడు దేశంలో నిర్వహించనున్న కామన్వెల్త్ క్రీడల పోటీల నిర్వహణలో కూడా భారీ అవినీతికి పాల్పడినట్లు తేలడంతో ప్రపంచదేశాలలో భారత్ తలదించుకునే పరిస్థితికి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. కొవ్వాడ మత్స్యలేశంలో అణువిద్యుత్ ప్రాజక్టు ఏర్పాటును వ్యతిరేకిస్తూ మత్స్యకారసంఘాలు ఆ గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబునాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పరిశ్రల ఏర్పాటుకు వ్యతిరేకం కాదని, అయితే కాలుష్యాన్ని వెదజల్లుతూ, ప్రజల ప్రాణాలను, భూములను హరించివేసే పరిశ్రమల ఏర్పాటును మాత్రం తాము అడ్డుకుంటాన్నారు. అణువిద్యుత్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మత్స్యకారులు చేపడుతున్న పోరాటంలో దేశం పార్టీ పూర్తిస్థాయిలో పాల్గొంటుందన్నారు. మత్స్యకారుల జీవన పరిస్థితులను మెరుగుపరచి, వారికి ఎటువంటి ఇబ్బందులు లేని విధంగా పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్నారు.
రాష్ట్రప్రభుత్వం పూర్తిగా వెనుగబడినతరగతుల ప్రజల వ్యతిరేకప్రభుత్వమని స్పష్టమవుతోందన్నారు. విద్యార్థులకు ఉపకార వేతనాలుగాని, ఫీజుల రీయంబర్స్మెంట్కు గాని ప్రభుత్వం చర్యలు తేసుకోకపోవడంవల్ల విద్యార్ధులు ఇబ్బందులు పడుతున్నారని చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేస్తూ, అంబేద్కర్ యూనివర్శిటీ జంక్షన్లో విద్యార్ధులనుద్దేశించి మాట్లాడారు. విద్యార్ధుల సమస్యలను వారినే అడిగి తెలుసుకుని, విద్యార్ధుల ఉద్యమాలకు టిడిపి పూర్తి మద్దతు పలుకుతోందని, ఈనెల 9వ తేదీన విద్యారంగ సమస్యలపై శ్రీకాకుళం జిల్లాలో చేపడుతున్న మహాధర్నాలో తాను పాల్గొంటున్నానని, విద్యార్ధులంతా ఈ పోరాటంలోపాల్గొనాలన్నారు. విద్యార్ధుల ఫీజులను రీయెంబర్స్మెంట్ చేయాలని కోరుతూ తమ పార్టీ శాసనసభ్యులు ధర్నాచేస్తే పోలీసులు అక్రమంగా వారిని అరెస్ట్ చేశారని, వారికి ఫీజులు చెల్లించాలని తాను ముఖ్యమంత్రిని కోరితే డబ్బులు లేవని చేతులెత్తేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. తమ పార్టీ పేదలకోసం ఆవిర్భవించిందని, పేదలకోసం సంక్షేమ పధకాలు అమలు చేయడం లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేసిందని, పేదరిక రహిత రాష్ట్రంగా మనరాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే తన జీవితాశయమని, తాను చనిపోయేలోగా పేదరిక నిర్మూలనకోసం అవసరమైన చర్యలు చేపడతానని తెలిపారు. చంద్రబాబు వెంట మాజీ కేంద్రమంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు, మాజీ మంత్రులు కిమిడి కళావెంకటరావు, తమ్మినేని సీతారామ్, గౌతు శివాజీ, ప్రతిభాభారతి, పార్టీ నాయకులు కొండపల్లి అప్పలనాయుడు, నాయని సూర్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.




