బెంగాల్‌లో రైలు ప్రమాదం – 67 మంది మృతి – 150 మందికి పైగా గాయాలు

train pramadam
పశ్చిమ బెంగాల్‌లో జార్ఖండ్ రాష్ట్ర సరిహద్దుకు దగ్గర్లో ఉన్న సైంధియా రైల్వే స్టేషన్ వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 67 మందికి పైగా చనిపోగా, మరో 150 మంది దాకా గాయపడ్డారు. బీర్భమ్ జిల్లా సైంధియా రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న వనాంచల్ ఎక్స్‌ప్రెస్‌ను వేగంగా వచ్చిన ఉత్తరబంగ ఎక్స్‌ప్రెస్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ‘మానవ తప్పిదం’ ఈ ప్రమాదానికి కారణమై ఉండవచ్చని ప్రమాదంపై దర్యాప్తు జరుపుతున్న వర్గాలు ప్రాథమికంగా అభిప్రాయ పడుతున్నాయి. స్టేషన్ సమీపించినప్పటికీ ఉత్తరబంగ ఎక్స్‌ప్రెస్ డ్రైవర్ వేగం తగ్గించలేదని, అదే వేగంతో నాలుగో ప్లాట్‌ఫామ్‌నుంచి బయల్దేరడానికి సిద్ధంగా ఉన్న వనాంచల్ ఎక్స్‌ప్రెస్‌ను వెనకవైపునుంచి వేగంగా ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. స్టేషన్ సమీపంలోని కీలకమైన సిగ్నల్‌ను ఉత్తర బంగ ఎక్స్‌ప్రెస్ డ్రైవర్ గమనించలేదని తెలుస్తోంది. రైలును ఆపాలంటూ తాము అరిచినప్పటికీ లాభం లేకపోయిందని, డ్రైవర్ చాలా వేగంగా వస్తుండడంతో హ్యాండ్ బ్రేక్ వేయడానికి కూడా సమయం లేకపోయిందని వారు చెప్పారు. మృతి చెందిన వారిలో రెండు రైళ్ల డ్రైవర్లు, వనాంచల్ ఎక్స్‌ప్రెస్ గార్డు కూడా ఉన్నారు.
ఉత్తరబంగ ఎక్స్‌ప్రెస్ ఎంత తీవ్రంగా ఢీకొట్టిందంటే రెండు అన్ రిజర్వ్‌డ్ బోగీలతో ససా వనాంచల్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన మూడు బోగీలు తునాతునకలై పోగా, ఉత్తరబంగ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన రెండు బోగీలు పైకెగిరి పాదచారులకోసం ఏర్పాటు చేసిన బ్రిడ్జిపైన పడ్డాయి. ఒక బోగీలో కొంతభాగమైతే విడిపోయి బ్రిడ్జిని ఢీకొట్టిన తర్వాత రైలు పట్టాలకు పక్కనే ఉన్న రోడ్డుపై పడిపోయింది. సహాయ కార్యక్రమాల్లో పాలు పంచుకునేందుకు సైన్యాన్ని, బిఎస్‌ఎఫ్ జవాన్లను రంగంలోకి దింపినట్లు చెప్పిన రైల్వే అడిషనల్ డిజిపిడిటిపి మిత్రా చెప్తూ, మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చని అన్నారు. గ్యాస్ కట్టర్లు ఉపయోగించి బోగీల్లో చిక్కుకుపోయిన 32 మృత దేహాలను వెలికి తీసారు. దగ్గర్లో ఉన్న గ్రామాల ప్రజలు ముందుగా ప్రయాణికులను కాపాడడానికి ప్రయత్నించారు. ప్రమాదం జరిగినప్పుడు రెండు రైళ్లలోని చాలామంది ప్రయాణికులు గాఢనిద్రలో ఉన్నారు. సురి జిల్లా ఆస్పత్రి, సైంధియా ఆస్పత్రుల్లో చేర్చిన క్షతగాత్రుల్లో 14 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, బుర్ద్వాన్ మెడికల్ కాలేజి ఆస్పత్రినుంచి 150 బాటిళ్ల రక్తాన్ని తెప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్థానికులు సైతం పెద్ద సంఖ్యలో రక్తదానం చేయడానికి ముందుకు వచ్చారు.
ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన మమత
కాగా, ప్రమాద స్థలాన్ని సందర్శించిన రైల్వే మంత్రి మమతా బెనర్జీ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ప్రమాదం వెనుక కుట్ర ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తం చేసారు. ‘మా మనస్సుల్లో కొన్ని అనుమానాలున్నాయి. సమాచారం కోసం అనే్వషిస్తున్నాం, ముందు ప్రమాదం వివరాలు తెలియనివ్వండి’ అని ఆమె అన్నారు. పశ్చిమ బెంగాల్‌లో రెండు నెలల్లో రెండు ఘోరప్రమాదాలు జరగడం తమకు ఎంతో బాధకలిగిస్తోందని ఆమె అన్నారు. మృతుల కుటుంబాలకు తలా 5 లక్షలు, గాయపడిన వారికి 25 వేల రూపాయల ఎక్స్‌గ్రేషియాను ఆమె ప్రకటించారు. మమత వెంట స్థానిక ఎంపి శతాబ్ది రాయ్ కూడా ఉన్నారు. కాగా, తూర్పు రైల్వే జనరల్ మేనేజర్ విజయ్ నారాయణ్ త్రిపాఠీ, రైల్వే సేఫ్టీ చీఫ్ కమిషనర్ ఆర్‌పి యాదవ్, ఇతర ఉన్నతాధికారులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణాలపై విచారణ జరుపుతున్నారు. కాగా, ప్రయాణికులకు సంబంధించి తాజా సమాచారాన్ని తెలియజేయడానికి హౌరా, సీల్డా రైల్వే స్టేషన్లలో రెండు ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసారు. ప్రమాదం కారణంగా హౌరా వెళ్లాల్సిన కాంచన్‌జంగ ఎక్స్‌ప్రెస్, సీల్డా వెళ్లే డార్జిలింగ్ మెయిల్ సహా కొన్ని రైళ్లను దారి మళ్లించగా, మరి కొన్ని రైళ్లను రద్దు చేసారు.

Leave a Reply