మళ్లీ రగిలిన రీయింబర్స్మెంట్ – నాంపల్లి పోలీస్ స్టేషన్ వద్ద చంద్రబాబు ధర్నా

ఫీజు రీయింబర్స్మెంట్ వ్యవహారం మరోసారి ముందుకొచ్చింది. ఇంత వరకు విద్యార్థి సంఘాలు, సంక్షేమ సంఘాలు ఆందోళనలు సాగిస్తుండగా, సోమవారం తెలుగుదేశం పార్టీ సచివాలయంలో ముఖ్యమంత్రి కార్యాలయం ఎదుట ధర్నాకు దిగింది. దాంతో 25 మందికి పైగా టిడిపి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. రీయింబర్స్మెంట్ విషయంలో విద్యార్థులు ఎదుర్కుంటున్న ఇబ్బందులను వినడానికి కూడా ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదని టిడిపి నేతలు ఆరోపించారు. తమకు అపాయింట్మెంట్ ఇవ్వడానికి సిఎం నిరాకరించారని, వినతి పత్రం తీసుకోవడానికి మంత్రులు అంగీకరించలేదని చెప్పారు. టిడిపి నేతలను బలప్రయోగంతో తరలించేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. అరెస్ట్ చేసిన నాయకులను నాంపల్లి పోలీస్స్టేషన్కు తరలించారు. దీంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వ వైఖరిపై తనదైన శైలిలో నిప్పులు చెరిగారు. అక్కడ ధర్నా చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం నష్టనివారణ చర్యలు చేపట్టింది. మంత్రులు బొత్స సత్యనారాయణ, బాలరాజు, పిల్లి సుభాష్ చంద్రబోస్ విలేకరుల సమావేశం నిర్వహించారు. విద్యార్థులతో టిడిపి రాజకీయం చేస్తోందని ఆరోపించారు. బకాయిల మొత్తాన్ని ఈ నెల 15వ తేదీలోగా చెల్లిస్తామని ప్రకటించారు. మరోవైపు ముఖ్యమంత్రి కె రోశయ్య రీయింబర్స్మెంట్ విషయమై చర్చించేందుకు రమ్మంటూ టిడిపికి ఆహ్వానం పంపారు. క్యాంపు ఆఫీసులో జరిగిన చర్చల్లో చంద్రబాబుతో పాటు కడియం శ్రీహరి, నామా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అయితే, చర్చలు విఫలమయ్యాయి. సర్కార్ మొండివైఖరి అవలంబిస్తోందని చర్చల అనంతరం చంద్రబాబు విమర్శించారు. ముఖ్యమంత్రి వితండవాదం చేస్తున్నారన్నారు. ప్రభుత్వానికి ఆదాయం బాగా పెరిగినా మీనమేషాలు లెక్కిస్తోందని విమర్శించారు. తమతోపాటు కలిసి వచ్చే పార్టీలు, విద్యార్థి సంఘా లతో కలిసి ఉద్యమిస్తామని తెలిపారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 8వ తేదీన మోటారుసైకిళ్ల ర్యాలీని, 9న నిరసన ప్రదర్శనలు చేపట్టాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు.
కాగా ఫీజు రీయింబర్స్మెంట్ కోసం రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు నిర్వహించాలని ఎస్ఎఫ్ఐ పిలుపునిచ్చింది. సోమవారం ముగిసిన ఆ సంఘ రాష్ట్ర కమిటీ సమావేశాల్లో ఈ మేరకు తీర్మానం చేశారు. ఫీజుల కోసం యాజమాన్యాలు వేధిస్తే విదార్థులు అక్కడికక్కడే ఆందోళనలు చేపట్టాలని ఎస్ఎఫ్ఐ పిలుపునిచ్చింది.
పోలీసులతో వాగ్వాదం
అంతకుముందు సచివాలయంలోని సిఎం కార్యాలయం ముందు టిడిపి నేతలకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేయడానికి ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘర్షణలో ఒకరిద్దరు టిడిపి నేతలతో పాటు పోలీసులకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. టిడిపి నాయకులను అరెస్ట్ చేసి మూడు వ్యాన్లలో నాంపల్లి పోలీస్స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా టిడిపి నేత గాలి ముద్దు కృష్ణమ నాయుడు మాట్లాడుతూ బోధనా ఫీజులపై చర్చిండానికి తాము ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ముందుగానే కోరినా, అవకాశం ఇవ్వలేదన్నారు. సిఎం కార్యాలయంలోకి ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను సైతం అనుమతించకపోవడం దారుణమన్నారు. అనంతరం ఎమ్మెల్యే కెఇ ప్రభాకర్ మాట్లాడుతుండగానే పోలీసులు రంగ ప్రవేశం చేసి అడ్డుకున్నారు. ఎంపిలు నామా నాగేశ్వరరావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యేలు రేవంత్రెడ్డి, మండవ వెంకటేశ్వరరావు, ధూళిపాల నరేంద్ర, రావుల చంద్రశేఖరరెడ్డి, జోగు రామన్న, ఎమ్మెల్సీ మసాల పద్మజతో సహా ధర్నాలో పాల్గొన్న నేతలను పోలీసులు అరెస్టు చేశారు.
టిడిపి లబ్ది పొందాలని యత్నిస్తోంది : మంత్రులు
విద్యార్థులతో రాజకీయాలను చేస్తూ టిడిపి లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తోందని మంత్రులు విమర్శించారు. పిల్లి సుభాష్చంద్రబోస్, బొత్స సత్యనారాయణ, బాలరాజు తదితరులు టిడిపి నేతల అరెస్ట్ అనంతరం సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మూడు రోజల క్రితమే ముఖ్యమంత్రి అప్పాయింట్మెంట్ ఇస్తే టిడిపి నేతలు రాలేదని చెప్పారు. సోమవారం సిఎంకు అనారోగ్యంగా ఉండటంతో ఆయన సచివాలయానికి రాలేదని, దీనిని రాద్దాంతంచేస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి కార్యాలయం వద్దకు వచ్చిన తనను వినతిపత్రం తీసుకోవాలని టిడిపి నేతలు డిమాండ్ చేశారని, ఇదేం పద్దతని మంత్రి సుభాష్చంద్రబోస్ ప్రశ్నించారు. టిడిపి నేతలకు రాజకీయాలు చేయాలనుకుంటే ఎన్నో అంశాలున్నాయని, విద్యార్థులను ఉపయోగించుకోవడం మంచిదికాదని చెప్పారు. మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ తమహయంలో 300 కోట్ల రూపాయలు కూడా రీయింబర్స్మెంట్గా ఇవ్వని తెలుగుదేశం పార్టీకి ఈ విషయమై మాట్లాడే హక్కు ఎక్కడుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా 389.20 కోట్ల రూపాయలు మాత్రమే బకాయిలు చెల్లించాల్సిఉందని, దీనిని కూడా ఈ నెల 15వ తేదిలోగా విడుదల చేస్తామని చెప్పారు. రీయింబర్స్మెంట్ విషయమై హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వ సుప్రీంకోర్టులో సవాల్ చేసిందని, రెండు మూడు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తుందని భావిస్తున్నామని చెప్పారు. విద్యార్థులను యాజమాన్యాలు వేధిస్తే ఫిర్యాదు చేసేందుకు టోల్ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.




