మా నాన్న చనిపోతే… పండగ చేసుకున్నారు

అందరికీ కొండంత అండగా ఉండే నాన్నపోతే కొంతమంది ఆయన వ్యతిరేకులు సంబర పడ్డారని స్వర్గీయ వైఎస్ రాజశేఖర్రెడ్డి తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కాంగ్రెస్లో ఆయన వ్యతిరేకులపై గళమెత్తారు. తూర్పుగోదావరి జిల్లాలో 14వ రోజు ఓదార్పు యాత్ర కోనసీమలో ముమ్మిడివరం నియోజకవర్గంలో సాగుతున్నది. గత మూడు రోజులుగా ఆయన అస్వస్థతలో ఉన్నా యాత్రకు విరామమివ్వాలని సూచించినా జగన్ మాత్రం ఓదార్పు యాత్రనే కొనసాగిస్తున్నారు. ఓప్రక్క వర్షం, మరోప్రక్క అభిమానుల హోరు ఆ పై జ్వరం ఇవన్నీ జగన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆయనతోపాటు ఆయన వెన్నంటి ఉన్న వారి పరిస్థితి సైతం అదేవిధంగా ఉంది. అయినా జగన్ పర్యటనకుదించడంలేదు. ఆదివారం రాత్రి ముమ్మిడివరంలో ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇంట్లో విరామం తీసుకున్న జగన్కు కాకినాడ నుంచి వెళ్ళిన వైద్యులు చికిత్సలు చేశారు. అభిమానుల ఆలింగనలు ముఖ్యంగా కరచాలనంతో చేయి గీరుకు పోవడంతో చేతికి కట్టుకట్టే పరిస్థితి ఎదురైంది. అదే పరిస్థితిలో ఆయన సోమ వారం యాత్ర మొదలుపెట్టారు. ఆదివారం రాత్రి అనారోగ్యంతో కొన్ని ప్రాంతా లకు వెళ్ళలేకపోయారు. ఆ ప్రాంతాలన్నీ సోమవారం తిరగడం మొదలు పెట్టారు. జిల్లాలో 12వ తేదీన అడుగుపెట్టిన ఆయన ఎటువంటి ఆవేశకావేశా లకు లోనుకావడంలేదు. ఆయన సన్నిహితుడు రాంబాబును సస్పెండ్ చేసిన సమయంలో సైతం ఆవేదన వ్యక్తం చేశారనే గాని ఆవేశ పడలేదు. ఇక యాత్ర సాగినంత కాలం ఇలా మౌన రాగంతోనే వెళుతుందని భావించారు. అధిష్టానం ఏం చేసినా ఆయన పెదవి విప్పడంలేదు. అయితే ఎందుకో ఆయనకు పల్లం కుర్రు అనే గ్రామంలో కాంగ్రెస్ పెద్దలపై చిర్రెత్తుకొచ్చింది. నాన్నపోతే నాకు అండాదండా లేకుండా పోతుందని నా ప్రత్యర్థులు సంబరాలు జరుపుకున్నారు. పండుగ చేసుకున్నారని జగన్ ధ్వజమెత్తారు. ఓదార్పులో నాకు ఇంత అండ దండలు లభించడం చూసి వారు గుండెలు బాదుకుంటున్నారని జగన్ తిరిగి గళమెత్తారు. ఆకస్మికంగా ఇలా కాంగ్రెస్లో ఆయన వ్యతిరేకులపై గళం విప్ప డంలో ఆంతర్యం ఏమిటో అంటూ ఆయన అనుచరులు మల్లగుల్లాలు పడుతు న్నారు. ఇప్పటికే యాత్ర ఈ నెల 28వ తేదీన ముగించాలని భావించారు. అయితే మరో రోజు 29 వరకు యాత్రను పొడిగించారు. ఆ రోజు కాకినాడలో భారీ జనం మధ్య జగన్ ఓదార్పు యాత్రకు ముగింపివ్వాలని ఆయన సన్నిహితులు కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి వ్యూహంతో ఉన్నారు. ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జగన్ను అభిమానించే ఎమ్మెల్యేలను కాకినాడకు రప్పించే అవకాశలున్నట్లు తెలుస్తున్నది. అవసరమైతే 30వ తేదీన కూడా జగన్ కాకినాడలోనే బసచేసి కోర్ కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తారని తెలుస్తుంది. మొత్తం యాత్రలో కీలక పాత్ర పోషిస్తున్న మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దీనిపై కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తుంది. సుమారు 25 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు చివరి రోజు కాకినాడ చేరుకుంటారని తెలుస్తుంది.




