ముసలోడికి బుద్ధుందా – రోశయ్య గోచీ ఊడాలి – నాగం మండిపాటు

‘బుద్ధుందా ముసలోడికి..? రోశయ్య గోచీ ఊడాలి. బాబ్లీ ప్రాజెక్టు తెలుగుదేశం హయాంలోనే ప్రారంభమైందని రోశయ్య చెప్పడం నీతి మాలిన చర్య. అన్నం తినేవాడెవడూ అలా చెప్పడు. ఆయనకు బుద్ధి మందగించిందో.. మతి భ్రమించిందో అర్థం కావడం లేదు. ఆయన సంగతి అసెంబ్లీలో తేలుస్తాం. పరిస్థితులు ఇలాగే కొనసాగితే రోశయ్య గోచీ ఉడడం ఖాయం. ఆయన్ని ముఖ్యమంత్రి పదవి నుంచి అగౌరవంగా సాగనంపే పరిస్థితి వస్తుంది’ అని టీడీపీ నేత నాగం జనార్దన్ రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. బుధవారం ఆయన ఇక్కడి ఎన్టీఆర్ భవన్లో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.
‘బాబ్లీ పనులు ప్రారంభమయ్యాయని తొలిసారి శాసనసభలో మేం చెప్పినప్పుడు బఫూన్ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ‘అది తాగునీటి కోసం కడుతున్న చెక్డాం’ అంటూ కొట్టిపారేశారు. కావాలంటే దాన్ని అసెంబ్లీ రికార్డుల్లో రోశయ్య చూసుకోవచ్చు’ అని నాగం హితవు పలికారు. మహారాష్ట్ర నిర్మిస్తున్న అక్రమ పాజెక్టులకు సంబంధించి నూరు శాతం బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని విరుచుకుపడ్డారు. వాటిని ఎలా అడ్డుకోవాలన్న ప్రయత్నాలు చేయాల్సింది పోయి తమ మీదే రోశయ్య వ్యంగ్యాస్త్రలను సంధించడం దౌర్భాగ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. రోశయ్య వ్యంగ్యాస్త్రలు పుండు మీద కారం చల్లినట్లుగా ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కంటే అప్పటి సలహాదారునితోనే ప్రస్తుత ముఖ్యమంత్రి రోశయ్య విపరీతంగా దోచుకుంటున్నాడని దుయ్యబట్టారు. రోశయ్య సంగతి అసెంబ్లీలో తేలుస్తామని నాగం వ్యాఖ్యానించారు. ‘అప్పట్లో బాబ్లీకి సంబంధించిన ఫైళ్లు ఏమైనా మాకు సర్క్యులేట్ చేశారా? లేక మా దగ్గర అనుమతులు తీసుకున్నారా?’ అని నాగం అన్నారు.
ఇప్పటికీ సిగ్గు లేకుండా మహారాష్ట్ర సర్కారుకు మద్దతిస్తున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వంపై నాగం దుమ్మెత్తిపోశారు. మహారాష్ట్రలో రాష్ట్ర ప్రజాప్రతినిధులపై జరిగిన లాఠీచార్జిని బషీర్బాగ్ సంఘటనతో పోల్చడమేమిటని విరుచుకుపడ్డారు. కరీంనగర్లో కాంగ్రెస్ కార్యాలయంపై రెండు రాళ్లు విసిరారంటూ తమ వాళ్లపై థర్డ్డిగ్రీని ప్రయోగించారని, పరిస్థితులు ఇలాగే కొనసాగితే రోశయ్య గోచీ ఊడుతుందని జనార్దన్రెడ్డి అన్నారు.




