రాజ్యసభ నుంచి ఆర్జేడీ, ఎస్పీ సభ్యుల వాకౌట్
రాజ్యసభ నుంచి ఆర్జేడీ, ఎస్పీ సభ్యులు వాకౌట్ చేశారు. నిన్న సభ నుంచి తమను గెంటివేసి మహిళా బిల్లును ఆమోదించడానికి నిరసనగా సమాజ్వాదీ, ఆర్జేడీ సభ్యులంతా వాకౌట్ చేశారు. అలాగే మహిళా బిల్లుపై నిరసన తెలిపిన ఏడుగురు సభ్యులపై సస్పెన్షన్ వేటు వేయడాన్ని ఆయా పార్టీల సభ్యులు తీవ్రంగా ఖండించారు. ఉదయం ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభం కాగానే సమాజ్వాదీ పార్టీ సభ్యుడు రామ్గోపాల్ యాదవ్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. దీనికి ఆర్జెడి సభ్యులతో పాటు సిపిఎం నేత సీతారాం ఏచూరి కూడా మద్దతు తెలిపారు. సమాజ్వాదీ, ఆర్జేడీ సభ్యులు తమ అభిప్రాయాలు చెప్పకుండా సభ నుంచి పంపించివేసినందుకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. అయితే ప్రశ్నోత్తరాల అనంతరం ఈ అంశంపై చర్చకు అనుమతి ఇస్తానని సభాపతి హమీద్ అన్సారీ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా ఆర్జేడీ, ఎస్పీ సభ్యులు తమ పట్టువీడలేదు. ఏడుగురి సభ్యులపై సస్పెన్షన్ వేటు ఎత్తివేస్తే తప్ప సభలో అడుగుపెట్టబోమంటూ ఆర్జేడీ, సమాజ్వాదీ సభ్యులు వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. వీరికి జనతాదళ్ సభ్యులు సంఘీభావం తెలిపారు.




