రైతులకు పంటరుణాలు రూ.601 కోట్లు పంపిణీ

జిల్లాలోని రైతులకు పంట రుణాల కింద ఇప్పటివరకు రూ.601 కోట్లు పంపిణీ చేయడమైందని, ఈనెలాఖరులోపు నిర్ధేశిత లక్ష్యంతో 50శాతం (రూ.800 కోట్లు) పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ డా.బి.జనార్ధన్రెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో పంట రుణాల పంపిణీపై బ్యాంక్ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతిరోజూ బ్రాంచి వారీగా ఎంతశాతం పంటరుణాలు పంపిణీ చేసిన ప్రక్రియను సమీక్షించుకుని బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్లు తగు రీతిలో ఆదేశాలు ఇవ్వాలన్నారు. కొన్ని బ్యాంక్ బ్రాంచ్ల నందు ఇప్పటివరకు రుణాల పంపిణీ, గ్రామాల వారి వివరాలను ప్రతి ఒక్కరూ తెలుసుకునే రీతిలో ప్రదర్శించలేదన్నారు. అందుకు సత్వరమే చర్యలు చేపట్టాలన్నారు. పంట రుణాలకై వచ్చిన రైతులకు టోకన్లను జారీ చేసి క్రమపద్ధతిలో పంపిణీ చేసి మిగిలిన రైతులకు కేటాయించిన సమయంలో బ్యాంకులకు రావాల్సిందిగా సూచించాలన్నారు.
అందుకు బ్యాంక్ అధికారులు సమస్యలను వివరించి రైతులకు సర్ధిచెప్పాలన్నారు. ఎటువంటి తప్పుడు ధృవీకరణ పత్రాలతో లోపభూయిష్టమైన సమాచారంను నమోదు చేసి పంట రుణం మంజూరుకై ఎవరు వచ్చినా తక్షణమే సంబంధిత బ్యాంక్ మేనేజర్ స్పందించి అలాంటివారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలన్నారు. ప్రతి బ్యాంక్ మేనేజర్ కనీసం ఒక్కకేసునైనా నమోదు చేయాలన్నారు. ఎన్నో ఒత్తిడులు, ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న భావనను విడనాడాలన్నారు. పంటరుణాల మంజూరుకై సంబంధిత రెవెన్యూ అధికారులు తగిన సమాచారం ఎప్పటికపుడు బ్యాంక్ అధికారులకు అందిచాలన్నారు. ఈ కార్యక్రమంలో జెసి అనితారామచంద్రన్, ఎల్డిఎం రాఘవేంద్రరావు, పెనుకొండ ఆర్డీఓ ఈశ్వర్, సిండికేట్ బ్యాంక్ సిఎం రవిశంకర్, ఎస్బిఐ సిఎం భాస్కర్రెడ్డి, ఆంధ్రాబ్యాంక్ సిఎం సోమరాజు, కులకర్ణి తదితరులు పొల్గొన్నారు.




