విగ్రహాల భద్రతకు ప్రత్యేక చట్టం

దోషులపై కఠిన చర్యలు
అమలాపురంలో మంత్రుల బృందం హామీలు
అంబేద్కర్ సహా జాతీయ నాయకుల విగ్రహాల భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురానుందని డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. అంబేద్కర్ విగ్రహాల ధ్వంసం నేపథ్యంలో శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా అమలాపురం, ధవళేశ్వరంలో మంత్రుల బృందం పర్యటించింది. అనంతరం అమలాపురం ఆర్డిఓ కార్యాలయంలో మంత్రులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అంబేద్కర్ అందించిన రాజ్యాంగ స్ఫూర్తితోనే పరిపాలన సాగుతోందని, అటువంటి మహనీయుల విగ్రహాలు ధ్వంసం చేయడం దేశద్రోహంగా పరిగణించాలని అన్నారు. విగ్రహాల భద్రత, దోషులను శిక్షించే విషయమై ఈ నెల 30న కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని సమాజం నుంచి వెలివేయాలని అన్నారు. అసెంబ్లీ ఆవరణలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుపై సిఎం, స్పీకర్లతో చర్చించామన్నారు. మరో మంత్రి సి.రామచంద్రయ్య మాట్లాడుతూ విగ్రహాల ధ్వంసం జాతికే సిగ్గు చేటని, ఇటువంటి అనాగరిక చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రభుత్వ విఫ్ కొండ్రు మురళీమోహన్ మాట్లాడుతూ దుండగుల చర్య అనైతికమని, ప్రభుత్వం వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తుందని తెలిపారు.
తొలుత మంత్రుల బృందం ధవళేశ్వరం, అమలాపురం మండలం చిందాడగరువు, చిట్టిగరువు, బండివారి పేట, నల్లవంతెన ప్రాంతాల్లో ధ్వంసమైన అంబేద్కర్ విగ్రహాలను పరిశీలించింది. మంత్రులు స్థానికులతో మాట్లాడారు. ఈ పర్యటనలో జిల్లా మంత్రులు పినిపే విశ్వరూప్, తోట నరసింహం, ఎంఎల్ఎలు రాపాక వరప్రసాదరావు, నల్లమిల్లి శేషారెడ్డి, వంగా గీత, ఎంఎల్సి కందుల దుర్గేష్, బలసాలి ఇందిర, యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కొత్తూరి శ్రీనివాస్ పాల్గొన్నారు.




