వైభవంగా రజనీకాంత్ కుమార్తె వివాహం

దక్షిణాది సూపర్స్టార్ రజనీకాంత్ చిన్న కుమార్తె సౌందర్య వివాహం శుక్రవారం నగరానికి చెందిన వ్యాపారవేత్త అశ్విన్తో అంగరంగ వైభవంగా జరిగింది. చెన్నైలోని రాణి మెయమ్మ హాల్లో పెళ్లి వేడుక బ్రాహ్మణ పద్దతిలో జరిగింది. సినిమా పరిశ్రమ నుంచి ప్రముఖులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు వేడుకకు హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, కమల్ హాసన్, బాలీవుడ్ నుంచి శ్రీదేవి, బోనీకపూర్ జంట, ఐశ్వర్యారాయ్ బచ్చన్తో సహా ఇతర ప్రముఖులు వివాహానికి వచ్చారు. కొత్త జంటకు కేంద్ర హోంమంత్రి పి.చిదంబరం కూడా ఆశిస్సులు అందజేశారు. కానీ న్యూఢిల్లిలో అత్యవసర సమావేశం ఉండడంతో త్వరగా ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి కూడా హాజరయ్యారు. అలాగే అధికార పార్టీ డీఎంకే పార్టీకి చెందిన సభ్యులూ పెళ్లి వేడుకలో కనిపించారు. ఏఐఏడీఎంకే నాయకురాలు జయలలిత ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. అసెంబ్లి ఎన్నికలకు సంబంధించిన పనుల నిమిత్తం ఆమె కొడనాడ్ హిల్స్టేషన్కు వెళ్లారు. రజనీకాంత్ తన అభిమానులకు సందేశంలో ‘అందరినీ పిలవాలని ఉన్నా స్థలం, ఇతర సమస్యల వల్ల పిలవలేకపోతున్నాను. కానీ నా కుమార్తెకు మీ ఆశిస్సులను కోరుకుంటున్నాను’ అని అన్నారు.




