హాని తలపెట్టం – ఆయనను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారు – ఏఐసీసీ వర్గాలు

కడప ఎంపీ వైఎస్ జగన్మోహనరెడ్డి విషయంలో ఓర్పుతో వ్యవహరించాలని పార్టీ భావిస్తోందని, ఆయనకు ఎటువంటి హాని తలపెట్టే ఆలోచన తమకు లేదని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. దివంగత ముఖ్యమంత్రి, జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మికంగా మరణించడం ఆయనకు ఉద్వేగభరితమైన విషయమేనని, ఈ విషయాన్ని పార్టీ గుర్తించిందని కాంగ్రెస్లోని అత్యున్నత వర్గాలు పీటీఐ ప్రతినిధికి వివరించాయి. “ఆయన వ్యవహారశైలి సాధారణంగా ఉండడం లేదు. తన తండ్రి మరణం ఆయనకు ఉద్వేగాన్ని కలిగించే అంశమే. వైఎస్ మరణం జగన్కే కాదు. పార్టీకి కూడా నష్టమే. ఓదార్పు యాత్రను పార్టీ తరఫున నిర్వహిస్తామని చెప్పినా ఆయన యాత్ర కొనసాగిస్తున్నారు. కొంతమంది వ్యక్తులు ఆయనను తప్పుదారి పట్టిస్తున్నారు.
అయితే, ఆయనకు హాని తలపెట్టాలని, ఆయనను బాధ పెట్టాలన్న ఉద్దేశం మాకు లేదు. ఈ విషయంలో పార్టీ ఓర్పుతో వ్యవహరిస్తుంది” అని ఆ వర్గాలు స్పష్టం చేశాయి. పార్టీ అధిష్ఠానం మాటను ధిక్కరించి జగన్ ప్రకాశం జిల్లాలో ఓదార్పు యాత్రను చేపట్టిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.




