రంగా రెడ్డి
మరో పర్యాయం తూర్పు తడిసి ముద్దయ్యింది. ఒకప్రక్క గోదావరి వరద ఉధృతి, మరో ప్రక్క అధిక వర్షాలతో జిల్లా అతలా కుతలం అవుతున్నది. ముఖ్యంగా కోనసీమ నీటి ముంపులో వుంది. గోదావరి కాచ్మెంట్ ఏరియాలోను, ఏజెన్సీలోను భారీగా వర్షాలు పడడంతో గోదావరి ఉప్పొంగుతుంది. ఆదివారం అర్థరాత్రికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేసే అవకాశముంది. ఇప్పటికి 9 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులు తున్నారు. మరోపక్క కోనసీమ వర్షపు నీటి ముంపులో వుంది. శుక్రవారం రాత్రి నుండి శనివారం తెల్లవారుజాము వరకు కురిసిన సుమారు 20 సెం.మీ.ల వర్షపాతంతో కోనసీమ తడిసి ముద్దయ్యింది.
ఇంత భారీగా కురి సిన వర్షపాతం వల్ల కోనసీమలో పంట పొలాలన్నీ ముంపులో వున్నాయి. సుమారు 50 వేల ఎకరాలలో వరిపంట పూర్తిగా నీటముంపులో వుంది. గోదావరి నిండుగా పారడం, డ్రైన్లు అన్నీ బిగబట్టడంతో పంట పొలాలలో నీరు ఎగదన్నడంతో ఖరీఫ్ ఉక్కిరిబిక్కిరవు తుంది. పరిస్థితి ఇదే విధంగా రెండు, మూడు రోజులపాటు కొనసాగితే ఖరీఫ్పై ఆశ వదులుకోవలస్సిందేనన్న భయంతో కోనసీమ రైతాంగం వుంది. ఏజెన్సీలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఇప్పటికే సుబ్బారెడ్డి సాగర్కు గండి పడడం, ఆనక పూడ్చివేత జరిగింది. ఏలేరు ఆయకట్టుతో పాటు విశాఖ జలాలకు నీరందించే ఏలేరు ప్రాజెక్టు గరిష్ట స్థాయికి చేరుకుంది. అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రానున్న రెండు, మూడు రోజులలో కూడా అల్పపీడనం ప్రభావం వల్ల వర్షాలు కురిస్తే అటు డెల్టాలోను, ఇటు ఏలేరు రిజర్వాయర్కు ముప్పు పొంచివుం దం టున్నారు.
వశ్చిమంలోనూ అదే పరిస్థితి
ఏలూరు,మేజర్న్యూస్ ప్రతినిధి : పశ్చిమ గోదావరి జిల్లాను వరదలు వణికిస్తున్నాయి. గత వారం రోజులుగా జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, డ్రైన్లు పొంగిపొర్లడంతో లక్షా 50 వేల ఎకరాలు నీటి మునిగాయి. గత నాలుగు రోజులుగా జిల్లాలోని ప్రధాన వాగులకు వస్తున్న వరద నీరు తగ్గకపోవడంతో పరిస్థితి మరింతగా జఠిలమవుతుందని ఆం దోళన చెందుతున్నారు.ఇప్పటికే జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.
మరింతగా వస్తున్న తమ్మిలేరు, రామిలేరు, కొవ్వాడ, ఎర్రకాలువ, గొంతేరు డ్రైన్, యనమదుర్రు డ్రైన్లు, మొయ్యేరు లాంటి ప్రధాన డ్రైన్ల ద్వారా వస్తున్న వరద నీటితో కొల్లేరు నీటిమట్టం గణనీయంగా పెరుగుతున్నది. ఇప్పటికే అనేక కొల్లేటి గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. దీనికి తోడు గోదావరికి కూడా భారీ ఎత్తున వరద రావడంతో ఏటిగట్టు పరివాహక ప్రాంత ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు.రానున్న రెండు రోజులలో గోదావరి నీటి మట్టం మరింత పెరిగే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించడంతో ఏటిగట్టు ప్రజలు దిక్కుతోచని స్ధితిలో ఉన్నారు. జిల్లాలోని మెట్ట ప్రాంతం, పల్లపు ప్రాంతం అనే బేధం లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ వరద పరిస్ధితి ఒకేలా ఉండడం, గతంలో ఎన్నడూ లేదని అధికారులు చెబుతున్నారు.

ఏపీపీఎస్సీ ఉద్యోగ నియామకాలలో తెలంగాణా ప్రాంతం వారికి 42 శాతం వాటా ఇచ్చేవరకు నియామకపు ప్రక్రియను నిలిపివేయాలంటూ తెలంగాణావాదులు డిమాండ్ చేసినా ప్రభుత్వం గతంలో ప్రకటించిన మాదిరిగానే ఆదివారం గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించింది. దీంతో టిఆర్ఎస్ పన్నిన వ్యూహం పూర్తిగా విఫలమైంది. వారి శక్తి సామర్థ్యాలు ఏమేరకు ఉన్నాయో తేట తెల్లమైపోయాయి. తెలంగాణా జేఏసీ, ఓయూ, కేయూ విద్యార్థి జేఏసీ, తెలంగాణా రాష్ట్ర సమితితోపాటు, ప్రజాప్రతినిధులు, మంత్రులు పరీక్షలను నిర్వహించవద్దంటూ ప్రభుత్వంపై ఎంత ఒత్తిడి తెచ్చినా ఫలితం లేకుండాపోయింది. దీంతో ఆదివారం పరీక్షా కేంద్రాల వద్దే అడ్డుకోవాలని టిఆర్ఎస్ నిర్ణయించారు. ఈ మేరకు పరీక్ష ప్రారంభమైన వెంటనే ప్రశ్నాపత్రాన్ని బయటకు తీసుకువచ్చి లీక్ చేయడం ద్వారా న్యాయపరంగా దీన్ని అడ్డుకోవాలని టిఆర్ఎస్ వ్యూహాం రచించింది. ఇందుకు అనుగుణంగా ఆదివారం ఉదయం 10.30 గంటలకు ప్రశ్నాపత్రం ఇవ్వగానే పది నిమిషాల్లోనే ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని బీఈడీ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రం నుండి పేపర్లను బయటకు తీసుకువచ్చి మీడియా ముందు విద్యార్థులు ప్రదర్శించారు. దీంతో పరీక్షా పేపర్ లీకైందనే కారణంగా పరీక్షను రద్దు చేస్తారని తెలంగాణావాదులు ఊహిస్తున్నా ప్రభుత్వం మాత్రం పరీక్షను నిర్వహించి జవాబుపత్రాలను భద్రపరిచారు. ఇప్పటికే రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ అరవింద్రావు ఒక ప్రకటన చేశారు. ఏదైన ఒక పరీక్షా కేంద్రం వద్ద ఏదైనా అనివార్య సంఘటన జరిగితే ఆ కేంద్రంలో మాత్రమే తిరిగి పరీక్ష నిర్వహిస్తామని, వారం రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని కూడా డీజీపీ ప్రకటించారు. దీంతో ఈ పరీక్షను పూర్తిగా రద్దు చేస్తారా లేక పేపర్ లీకైన పరీక్షా కేంద్రంలో మాత్రమే తిరిగి పరీక్ష నిర్వహిస్తారా అనేది అనుమానాస్పదంగా మారింది. తెలంగాణా జేఏసీ, తెరాస మాత్రం పరీక్షా పేపర్ రాష్ట్రంలో ఎక్కడా లీకైనా ఆ పరీక్షను రద్దుచేసే సంప్రదాయం ఉందని అందుకు అనుగుణంగా వ్యూహాత్మకంగా పరీక్ష ప్రారంభించిన పది నిమిషాలలోనే పేపర్ లీక్ చేయడంలో విజయవంతమయ్యామనే విశ్వాసంతో ఉంది. ప్రభుత్వ స్పందన మాత్రం ఇంతవరకు స్పష్టంకాలేదు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వం పరీక్షను పూర్తిస్థాయిలో రద్దు చేయకూడదనే నిర్ణయానికి వస్తే న్యాయపోరాటానికి సిద్ధం కావాలని తెలంగాణావాదులు ఇప్పటికే ఓ సూత్రప్రాయమైన నిర్ణయానికి వచ్చారు. సోమవారం వరకు ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూసి మంగళవారం టిఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి అన్ని జేఏసీల నాయకులను పిలిచి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించింది.
ఇప్పటికే హైకోర్టులో ఏపీపీఎస్సీ పరీక్షను రద్దు చేయాలంటూ మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే కొమ్మిరెడ్డి రాములు కుమారుడు, న్యాయవాది కృష్ణ విజయ్ ఆజాద్ పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ గోపాల్రెడ్డి, ఎలాంగోలతో కూడిన ధర్మాసనం సోమవారం దీనిపై విచారణ జరపనుంది. ప్రశ్నాపత్రాల లీక్కు సంబంధించిన మీడియా క్లిప్పింగ్లను ఈ సందర్భంగా ధర్మాసనం ముందు ఉంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం కూడా అన్ని వైపులా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు అడ్వకేట్ జనరల్ తదితర న్యాయ నిపుణులతో సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను వాయిదా వేయాలని కోరేందుకు గవర్నర్ నరసింహన్ వద్దకు వెళ్లిన టీఆర్ఎస్ నేతలకు వింత అనుభవం ఎదురైంది. “నేనేం చేయగలను? ఏ నిర్ణయమైనా ప్రభుత్వమే తీసుకోవాలి’ అని గవర్నర్ వారితో అన్నారు. అంతేకాదు.. ‘రాష్ట్ర వాతావరణం చల్లగా ఉంది, ఎందుకు వేడెక్కిస్తారు’ అని కూడా గవర్నర్ తమతో అన్నట్లు టీఆర్ఎస్ నేతలు తెలిపారు. ఎమ్మెల్యేలు టి.హరీశ్రావు, కొప్పుల ఈశ్వర్, కె.తారక రామారావు, పార్టీ నేత నాయిని నర్సింహారెడ్డి శనివారం ఇక్కడ రాజ్భవన్లో గవర్నర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారి మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇవీ ఆ వివరాలు… టీఆర్ఎస్ బృందం: గ్రూప్-1 ప్రిలిమ్స్ వాయిదా వేయించండి. ఈ డిమాండ్కు అన్ని పార్టీలు, విద్యార్థి సంఘాలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా మద్దతు ఇస్తున్నారు. తెలంగాణ వాటా తేల్చకుండా పరీక్ష నిర్వహిస్తుండటంపై విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
గవర్నర్: రాష్ట్రం ఇప్పుడిప్పుడే ప్రశాంతంగా ఉంటోంది. దాన్ని చెడగొట్టొద్దు. మీరు చెబితే విద్యార్థులు ఊరుకుంటారు. ఆందోళన విరమిస్తారు.
టీఆర్ఎస్ బృందం: ఈ ఉద్యమం స్పాంటేనియస్గా వచ్చింది. తేలిగ్గా పోయేటట్లు కనిపించటంలేదు. ఆదివారం ఏం జరుగుతుందో ఊహించలేం. మీరే జోక్యం చేసుకొని పరీక్ష వాయిదా వేయించాలి.
గవర్నర్: నేనేం చేయగలుగుతాను. ఏ నిర్ణయమైనా ప్రభుత్వమే తీసుకోవాలి.
టీఆర్ఎస్ బృందం: పది రోజుల క్రితమే ఈ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లాం. తర్వాత ఆయన మమ్మల్ని పిలిచి మాట్లాడుతారని భావించాం. కానీ, ఎలాంటి స్పందన లేదు. చివరి ప్రయత్నంగా మీ వద్దకు వచ్చాం. పరీక్ష వాయిదా వేయాలని మీరు ప్రభుత్వానికి సలహా ఇవ్వచ్చు కదా..గవర్నర్: ప్రభుత్వంతో మాట్లాడి చూస్తాను. గవర్నర్తో భేటీ అనంతరం టీఆర్ఎస్ నేతలు విలేఖరులతో మాట్లాడారు. రోశయ్య ఒక ప్రాంతానికి ముఖ్యమంత్రిలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గ్రూప్-1లో తెలంగాణ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. తెలంగాణ వాటా తేల్చేవరకు ఏపీపీఎస్సీలో ఎలాంటి నియామకాలు జరపద్దని ఎమ్మెల్సీ, టీవీఎస్ కార్యదర్శి కె.దిలీప్కుమార్ డిమాండ్ చేశారు. ఏపీపీఎస్సీ చైర్మన్ వెంకట్రామి రెడ్డిని వెంటనే మార్చాలని, లేకపోతే కమిషన్ జరిపే నియామకాలపై విద్యార్థులకు నమ్మకం ఉండదని పేర్కొన్నారు. ఆదివారం విద్యార్థులు తలపెట్టిన బంద్కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు ఇన్విజిలేటర్లు హాజరు కావద్దని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ వైస్ చైర్మన్ బెల్లయ్య నాయక్ కోరారు. విద్యార్థులు పరీక్ష హాల్లోకి వెళ్లి ప్రశ్నాపత్రాలను చించివేసి బయటికి రావాలని పిలుపునిచ్చారు.

ప్రజాహృదయనేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి ప్రధమ వర్ధంతి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా గురువారం ఘనంగా జరిగాయి. ఊరూరా, వాడ, వాడలా కాంగ్రెస్ కార్యకర్తలు, వైఎస్ అభిమానులు, కుల, మతాలకు అతీతంగా ప్రజలు ఆయనను స్మరిస్తూ వర్ధంతి కార్యక్రమాలు జరుపుకున్నారు. అనేక గ్రామాలు, పట్టణాలలో రాజకీయాలకు అతీతంగా కూడా నేతలు వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొనటం విశేషం. వైఎస్ ఘాట్ ఉన్న ఇడుపులపాయ, వైఎస్ స్మృతివనం ప్రాంతం జనసంద్రంగా మారాయి. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన లక్షలాది మంది జనం జననేతకు కన్నీటి నివాళులు అర్పించారు. వైఎస్ఆర్ అమర్ రహే…, బడుగు జనబాంధవా నీకు మరణం లేదు.., మా గుండెల్లో ఉన్నావు…, జోహార్ వైఎస్ఆర్…, వంటి నినాదాల మధ్య తమ అభిమాన నేత చిత్ర పటాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. మహిళలు, వృద్దులు కన్నీటితో జోహార్లు పలికారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న ఎడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) నిర్వహించాయి. రాష్ట్రానికి వైఎస్ చేసిన సేవలను స్మరించుకున్నాయి. దివంగత నేత వైఎస్ సతీమణి వై.ఎస్. విజయారాజశేఖర్రెడ్డి, ఆయన కుమారుడు, కడప ఎంపి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డితోపాటు కుటుంబ సభ్యులు ఇడుపులపాయలోని వైఎస్ సమాధిపై పుష్పగుచ్ఛం ఉంచి కన్నీటి పర్యంతమయ్యారు. ఇంటిపెద్దను తలుచుకుని మౌనముద్రలో ఉండిపోయారు.ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వై.ఎస్.వివేకానందరెడ్డి, వైఎస్ సోదరి విమలమ్మ, కూతురు షర్మిల, అల్లుడు బ్రదర్ అనిల్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఉదయమే వారు వైఎస్ ఘాట్కు చేరుకుని శ్రద్ధాంజలి ఘటించారు. తదుపరి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆ తర్వాత వైఎస్ సన్నిహిత మిత్రుడు కెవిపి రామచంద్రారావు అయన సతీమణి నివాళులు అర్పించారు. కెవిపి సతీమణి బోరున విలపించారు. ఇదిలా ఉండగా, వైఎస్ స్మృతివనం నల్లమలలోని పావురాలగుట్ట వద్ద 20 అడుగుల కాంస్య విగ్రహాన్ని శాసనమండలి ఛైర్మన్ ఎ. చక్రపాణి, రాష్ట్ర మంత్రులు డి. మాణిక్య వరప్రసాద్, శిల్పామోహన్ రెడ్డి, వట్టి వసంతకుమార్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు. పలువురు ఎమ్మెల్యేలు, నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దివంగత నేత వర్ధంతి కార్యక్రమాన్ని అధికారిక కార్యక్రమంగా నిర్వహించింది. ముఖ్యమంత్రి డాక్టర్ కొణిజేటి రోశయ్య తన నివాసంలో వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ ఎన్. కిరణ్కుమార్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు పి. సబితా ఇంద్రారెడ్డి, దానం నాగేందర్, ముఖేష్ గౌడ్, మేయర్ బండ కార్తీకారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాష్ట్రానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. సంక్షేమ పథకాలు అమలు చేసి వైఎస్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని వారన్నారు. వైఎస్ జ్ఞాపకార్థం బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు వద్ద రూ. 20 కోట్లతో స్మారక వనం ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రులు తెలిపారు. శాసనసభ లాబీలో నిర్వహించిన కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ ఎన్. కిరణ్కుమార్ రెడ్డి, శాసనమండలి ఛైర్మన్ చక్రపాణి మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, సబితా ఇంద్రారెడ్డి, దానం నాగేందర్, మాజీ మంత్రులు జేసీ దివాకరరెడ్డి, జానారెడ్డి పాల్గొన్నారు. సిఎల్పి కార్యాలయంలో వైఎస్ చిత్రపటానికి మాజీ మంత్రి జేసీ దివాకరరెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నగరంలో వాడవాడలో వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. సినీపరిశ్రమ సైతం వైఎస్కు శ్రద్ధాంజలి ఘటించింది. సినీహీరో శ్రీహరి, భైరవచిత్ర నిర్మాత నట్టికుమార్లు పేద కళాకారులకు వస్త్రలు పంపిణీచేశారు. ఎపి ఫిల్మ్ వర్కర్స్ కో ఆపరేటివ్ సౌసైటీ అధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సినీనటుడు డాక్టర్ రాజశేఖర్, జీవిత పాల్గొన్నారు. న్యూఢిల్లీలోని ఆంధ్రాభవన్లో జరిగిన కార్యక్రమంలో పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్, రాష్ట్ర మంత్రి జె. గీతారెడ్డి, రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు, ఎపి జి.వి. హర్షకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను ఆవిష్కరించారు.
కడప జిల్లాలో జరిగిన వర్ధంతి కార్యక్రమంలో కేంద్ర మంత్రి సాయిప్రతాప్, రాష్ట్ర మంత్రి మహ్మద్ అహ్మదుల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఇడుపులపాయలో వైఎస్ సమాధిపై పుష్పగుచ్చం ఉంచి మంత్రులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ స్మారక పార్కు పైలాన్ను ఆవిష్కరించారు. మాజీమంత్రి కొండా సురేఖ దంపతులు, అంబటి రాంబాబు తదితరులు కూడా వైఎస్ సమాధిపై పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో వైఎస్ విగ్రహాలను ఆవిష్కరించారు.
చిత్తూరు జిల్లాలో కూడా వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. జిల్లాలో జరిగిన పలు కార్యక్రమాల్లో మంత్రి గల్లా అరుణ, ఎంపి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. తిరుపతి పట్టణంలో జరిగిన వైఎస్ సంస్మరణ సభ జనసంద్రంగా మారింది. టిటిడి మాజీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి అధ్వర్యంలో జరిగిన ఈ సుదర్శన మహాయాగంలో వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు. సంప్రదాయబద్ధంగా 56 మంది రుత్వికులతో ఈ యాగం నిర్వహించారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు యాగాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేద పండితుల నడుమ సుదర్శనయాగం ప్రారంభమైంది. యాగంతో పాటు గణపతిపూజ, నవగ్రహపూజ, వివిధ పూజలు నిర్వహించి రాజ్యాధికార యాగాన్ని నిర్వహించారు. అనంతరం యాగ ఫలాన్ని కరుణాకరరెడ్డి, అంబటిరాంబాబు స్వీకరించారు. ఈ సందర్భంగా కరుణాకరరెడ్డి మాట్లాడుతూ, దివంగత నేత వైఎస్కు ప్రాణంగా ఉన్న తాను ఆయన సంస్మరణ సభ నిర్వహించడం బాధగా ఉందని కన్నీటిపర్యంతమయ్యారు. వైఎస్ చనిపోయిన తర్వాత 500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని, తాను మాత్రం ప్రాణాలతో ఉండటం సిగ్గు చేటన్నారు.
విశాఖపట్టణం జిల్లా కేంద్రంలో పోస్టల్శాఖ వైఎస్. రాజశేఖరరెడ్డి స్మారకార్థం రూ. 5 పోస్టల్ స్టాంపును విడుదల చేసింది. విశాఖకు చెందిన దుర్గాప్రసాద్ రూపొందించిన ఈ స్టాంప్ను తపాలాశాఖ విశాఖపోస్ట్ మాస్టర్ జనరల్ శారద సంపత్ అధికారికంగా విడుదల చేశారు. జిల్లాలో జరిగిన కార్యక్రమాలలో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విజయనగరం జిల్లాలో జరిగిన వర్ధంతి కార్యక్రమాలలో మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, ఎపి బొత్స ఝాన్సీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
మహబూబ్నగర్ జిల్లాలోని గద్వాలలో రాష్ట్ర చిన్నతరహా పరిశ్రమలశాఖ మంత్రి డి.కె. అరుణ కొత్తగా ఏర్పాటుచేసిన వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులు అర్పించారు. ఆయన చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడమే ఆయనకు నిజమైన నివాళిగా పేర్కొన్నారు. పౌరసరఫరాలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా వైఎస్ వర్ధంతి కార్యక్రమాలలో పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లాలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి,ఎమ్మెల్యేలు, మెదక్ జిల్లాలో మంత్రులు సునీతాలక్ష్మారెడ్డి, దామోదర రాజనరసింహ, చిత్తూరు జిల్లాలో మంత్రి గల్లా అరుణ, నల్గొండ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అనంతపురం జిల్లాలో మంత్రి ఎన్. రఘువీరారెడ్డి, ప్రభుత్వ విప్ డాక్డర్ శైలజానాథ్ పాల్గొన్నారు. వారు ఇడుపులపాయకు కూడా వెళ్లి వైఎస్ సమాధిని సందర్శించి నివాళులు అర్పించారు. ఖమ్మం జిల్లాలో మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, తూర్పుగోదావరి జిల్లాలో మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, పినిపె విశ్వరూప్, శ్రీకాకుళం జిల్లాలో మంత్రి ధర్మానప్రసాదరావు, విజయనగరం జిల్లాలో మంత్రి శతృచర్ల విజయరామరాజు, గుంటూరు జిల్లాలో మంత్రులు గాదె వెంకటరెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, పార్థసారథి, నిజామాబాద్ జిల్లాలో మంత్రి సుదర్శనరెడ్డి పాల్గొన్నారు.

ఎస్సీల వర్గీకరణ కోరుతూ ప్రధానమంత్రి మన్మోహన్సింగ్కు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు వినతిపత్రం ఇచ్చినందుకు నిరసనగా తెలంగాణ ఉద్యమ జెఎసి ఆధ్వర్యంలో గురువారం తెలంగాణ భవన్ను ముట్టడించారు. తెలంగాణ ఉద్యమ జెఎసి చైర్మన్ దేవని సతీష్మాదిగ, వైస్ చైర్మన్ జి.చెన్నయ్య నేతృత్వంతో వందలాదిమంది కార్యకర్తలు ఒక దశలో తెలంగాణ భవన్లోకి చొచ్చుకుని వెళ్లేందుకు ప్రయత్నించారు. కెసిఆర్ డౌన్డౌన్
అంటూ నినాదాలు చేస్తూ అక్కడే దాదాపు రెండు గంటల పాటు ధర్నా చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దశలో పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ సందర్భంగా జెఎసి నేతలు సతీష్మాదిగ, జెన్నయ్య మాట్టాడుతూ గతంలో ఎస్సీల ఉమ్మడి రిజర్వేషన్ వర్గీకరణ కారణంగా తెలంగాణలోని మాదిగలకు తీరని అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. సీమాంధ్ర ప్రాంతంలోని మాల మాదిగలు అంగ్లేయుల పరిపాలనలో క్రైస్తవ విద్యా సంస్థల ద్వారా ఉన్నత విద్యను అభ్యసించి ఎస్సీ రిజర్వేషన్ ఉద్యోగాలనన్నింటినీ దోచుకున్నారని విమర్శించారు. రాష్ట్రంలో జోన్ల విధానం అమలులోకి వచ్చిన తరువాత తెలంగాణ ఎస్సీలకు అరకొరగా ఉద్యోగాలు వచ్చాయనీ, 1956లో తెలంగాణలో ఉద్యోగం చేయడానికి సీమాంధ్ర నుంచి వచ్చిన ఎస్సీలు ఇక్కడే స్థిరపడి వారి కొడుకులు, మనుమలు స్థానిక పత్రాలు పొంది ఇక్కడి ఎస్సీలను అన్యాయానికి గురి చేస్తున్నారన్నారు. నిజానికి తెలంగాణలోని మాలలు మాదిగల అవకాశాలను దోచుకోలేదనీ, వీరిద్దరి అవకాశాలను సీమాంద్ర మాలమాదిగలు దోచుకున్నారని ఆరోపించారు. ఈ కారణంగా తెలంగాణలోని మాలమాదిగల మధ్య విభేదాలు సృష్టించవద్దనీ, వర్గీకరణ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కంటే ముందు వద్దని వారు కెసిఆర్కు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ సాధన కోసం తీవ్రంగా ఉద్యమించాలని, ఇందుకోసం తాము కూడా మద్దతిస్తామని వారు కెసిఆర్కు స్పష్టం చేశారు.

‘మేం చెప్పిందే ప్రభుత్వం వింటుంది. కమిటీకి చట్టబద్ధత ఉంది. నిర్ణీత గడువులోపే అందరికీ ఆమోదయోగ్యమైన నివేదిక ఇస్తాం’ అని జస్టిస్ శ్రీ కృష్ణ స్పష్టం చేశారు. శ్రీ కృష్ణకమిటీ చైర్మన్, కార్యదర్శి వీకే దుగ్గల్, మరో ఇద్దరు సభ్యులు వరంగల్ జిల్లా ముచ్చర్ల గ్రామస్తుల అభిప్రాయలను మంగళవారం సేకరించారు. అందరికీ ఆమోదయోగ్యమైన నివేదికనే అందిస్తాం అని శ్రీకృష్ణ (తెలుగులో) ప్రకటించారు. హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తే ఎట్టిపరిస్థితులలో ఊరుకోమని, ఇప్పటికే తెలంగాణ ప్రాంత విద్యార్థులు, యువకులు ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు తీసుకున్నారని వారు తెలిపారు. మాకు కావలసింది రాష్ట్ర ఏర్పాటే తప్ప కమిటీలు కాదు. సాంకేతికంగా కమిటీని మేం బహిష్కరిస్తున్నాం. కానీ మా వాదనను బలంగా వినిపించేందుకు మీ ముందుకు వచ్చాం అని స్థానికుడు పృథ్వీరాజ్ కుండబద్దలు కొట్టారు.
మాకెప్పుడు విముక్తి: విద్యార్థిని స్రవంతి
“సర్.. మా తల్లిదండ్రులు మమ్మల్ని అప్పుచేసి చదివించారు. కానీ మేం ఏం చదువుకొని ఏం లాభం? మా ఉద్యోగాలన్నీ ఎక్కడికి పోతున్నయి? ఆంధ్రా ప్రాంత ప్రజలు అందలం ఎక్కుతుంటే ఇక్కడ మేం అగాధంలోకి పోతున్నం. మాకెప్పుడు సార్ విముక్తి. మా తెలంగాణకు ఎప్పుడు విముక్తి. ప్లీజ్ సర్. మా తెలంగాణ మాకు ఇప్పించండి అంటూ” జస్టిస్ శ్రీకృష్ణతో ముచ్చర్ల గ్రామ విద్యార్థి గుడికందుల స్రవంతి తనగోడును వెళ్లబోసుకున్నారు.
మహాభారత యుద్ధమే …
కరీంనగర్: జిల్లాలోని నుస్తులాపూర్లో కమిటి ఆభిప్రాయ సేకరణ చేస్తున్న సమయంలో కొంతసేపు గందరగోళానికి దారి తీసింది. ఈ సందర్భంగా జస్టిస్ శ్రీకృష్ణ మాట్లాడుతూ ప్రజలు శాంతియుతంగా ఉండకపోతే మహాభారత యుద్ధం ఏర్పడుతుందన్నారు. ఇదే విషయాన్ని ఆయన విలేకరుల సమావేశంలో ప్రస్తావిస్తూ తాను ఆ కామెంట్ను ఆ సమావేశంలో గొడవ గురించి మాట్లాడిందే తప్ప తెలంగాణ గురించి కాదన్నా రు.అంతకుముందు స మావేశంలో కమిటీకి తెలుగు అర్థం కాదేమోన న్న భావనతో జడ్పీటీసీ సత్యనారాయణ అభ్యంతరాలు వ్యక్తం చేయడంపై వికె దుగ్గల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిటీ దృష్టికి వచ్చే అంశాలన్నీ ప్రభుత్వపరంగా రికార్డు అవుతాయని, తమకూ తెలుగు తెలుసునని, ఏ అంశాన్ని విస్మరించమన్నారు. జిల్లాలో మంగళవారం కమిటీ బెజ్జంకి మండలం తోటపల్లి, తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామాల్లో పర్యటించింది. అనంతరం జిల్లా కేంద్రంలో వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, సంఘాల ప్రతినిధులతో సమావేశమైంది. జిల్లాపరిషత్ ఎదుట బీజేపీ నేతలు శ్రీకృష్ణ కమిటీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేసి నిరసన తెలుపగా జిల్లా అధ్యక్షుడు అర్జున్రావు సహా పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. తెలంగాణ ఏర్పాటుతోనే ఈ ప్రాంత ప్రజలకు భవిష్యత్ అని జిల్లా ప్రజలు కమిటీకి తేల్చిచెప్పారు. తిమ్మాపూర్ మండలం తోటపల్లి వద్ద జరిగిన సమావేశంలో కాంగ్రెస్ శాసనసభ్యుడు ఆరెపల్లి మోహన్ తెలంగాణకు జరుగుతున్న వివక్షపై ఏకరువు పెట్టారు. ఎమ్మెల్సీ భానుప్రసాదరావు మాట్లాడుతూ బ్రిటీష్ కాలంలో ప్రతిపాదించిన ఇచ్చంపల్లి ప్రాజెక్టు చేపడితే జిల్లా రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉండేదని, దానికి బదులు దేవాదులను ప్రతిపాదించినా అదీ కార్యరూపం దాల్చలేదని వివరించారు. తెలంగాణకు అనుకూలంగా నివేదిక ఇస్తే జస్టిస్ శ్రీకృష్ణ ఫొటోలను తమ ఇళ్ళల్లో పెట్టుకొని పూజ చేస్తామని గ్రామస్తులు అన్నారు.

రెండు లక్షల మంది అభ్యర్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్-1 ప్రాథమిక పరీక్షలను ఎట్టి పరిస్థితుల్లో కూడా వాయిదా వేసే ప్రసక్తే ఉండకూడదని సంకల్పించింది. ఇక్కడ అధిక మంది అభ్యర్థుల ప్రయోజనాలే తమకు ముఖ్యమంటుంది. చిన్న చిన్న విషయాలకే పరీక్షలను వాయిదా వేయాల్సిన అవసరం లేదని కృత నిశ్చయం తో రోశయ్య సర్కారు ఉంది. ఆ మేరకు సెప్టెంబర్ 5నే యథావిధిగా పరీ క్షలు నిర్వహించాలని ఎపిపిఎస్సికి సర్కారు ఆదేశాలుజారీ చేసింది. గ్రూప్-1 ప్రాథ మిక పరీక్షల నిర్వహణను తమ భుజాల పైకి ఎత్తుకున్న ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య తెలంగాణ ప్రాంతం నుంచి ఎంత వ్యతిరేకత వచ్చిన చలించడం లేదు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ఎపిపిఎస్సి సభ్యులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి, ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల ప్రకా రం పరీక్షలను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ విషయాన్ని మీడియాకు తెలియజేశారు.
పరీక్షలు వాయిదా వేయాల్సిందే..
ఒక పక్క ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కొనసాగుతుంది. మరో పక్క గ్రూప్-1 పోస్టులలో తెలంగాణ వాటా తేల్చాలని తెలంగాణ అభ్యర్థులు పట్టుబ డుతున్నారు. లేదంటే పరీక్షలు అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఎపిపిఎస్సి సభ్యుల సమావేశంలో గ్రూప్-1 పరీక్షల వాయిదాకు తెలం గాణ సభ్యులు గట్టిగా పట్టుబట్టినప్పటికీ ఎపిపిఎస్సి ఛైర్మన్ దాన్ని అడ్డుకో గలిగారు. సీమాంధ్ర విద్యార్థులకు అన్యాయం జరుగుతుందన్న ఉద్ధేశంతో ఆ పరీక్షలు సకాలంలోనే నిర్వహించలని ఎపిపిఎస్సి బోర్డు సభ్యులు సమా వేశంలో వాదించినట్లు తెలిసింది. గ్రూప్-1 పోస్టులలో ప్రాంతాల వారీగా పోస్టులు కేటాయించడం సాధ్యమయ్యేది కాదని ఎపిపిఎస్సి చెప్పుతోంది.
గతానుభవాలను దృష్టిలో ఉంచుకొని జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జనం కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు సమన్వయంతో ముందుకెళ్లాలని కలెక్టర్ ఎం.దానకిశోర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో వినాయకచవితి ఉత్సవాలు, నిమజ్జన ఏర్పాట్లపై భాగ్యనగర్ ఉత్సవ సమితి, మండపాల కమిటీలతో కలెక్టర్ సమీక్షించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 20 చెరువుల్లో నిమజ్జన కార్యక్రమం నిర్వహిస్తున్నమని చెరువుల వద్ద ఏర్పాట్లను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మూడు రోజుల్లో అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు చెరువులను సందర్శించాలని ఈ బృందంలో రెవెన్యూ, పోలీసు, మున్సిపల్, ఇరిగేషన్, హెచ్ఎండీఏ, ఆర్అండ్బీ, విద్యుత్ శాఖ అధికారులు తప్పనిసరిగా ఉండాలన్నారు. సరూర్నగర్, సఫిల్గూడ చెరువుల వద్ద జాలితో కూడిన బారికేడ్లను, వాచ్టవర్లను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వర్షాలతో దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆర్అండ్బీ, మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఉత్సవాలను విజయవంతం చేసేందుకు ప్రత్యేక అధికారులను నియమిస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఘట్కేసర్, మేడ్చేల్, శామీర్పేట్, శంషాబాద్, ఇబ్రహీంపట్నం చెరువుల వద్ద కూడా నిమజ్జనానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. వికారాబాద్ డివిజన్కు సంబంధించిన ఏర్పాట్లపై సమావేశాన్ని వికారాబాద్లో నిర్వహించాలని సబ్కలెక్టర్ ముత్యాలరాజుకు కలెక్టర్ సూచించారు.
ప్రతి చెరువుకో సమన్వయ కమిటీ
నిమజ్జనం సాఫీగా జరిగేందుకు ప్రతి చెరువుకు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయాలని ఆల్వాల్ డీసీపీ శివప్రసాద్ సూచించారు.ప్రమాదాలు జరుగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు జిల్లా కలెక్టర్ను కోరారు. సమావేశంలో డీఆర్ఓ రవీందర్రెడ్డి, ఆర్డీఓలు రాజేందర్, రత్నకుమార్, డిప్యూటీ మున్సిపల్ కమిషనర్లు, తహశీ ల్దార్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
తన తండ్రి మరణ ద్రువీకరణ పత్రం కోసం 3 నెలలుగా తహశీల్దార్ కార్యాల యం చుట్టు తిరుగుతున్నా పట్టించుకోవడం లేదనే ఆవేదనతో ఓ యువకుడు ఒంటిపై కిరోసిన్ పోసుకొని ప్రజాదర్భార్లో ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. దోమ మండలం పాలేపల్లి గ్రామానికి చెందిన జనుపల హన్మారెడ్డి 2003 జనవరి 16వ తేదీన మృతి చెందాడు. అయితే హన్మారెడ్డి మృతి చెందకంటే ముందే దోమ ఎస్బీహెచ్ బ్యాంక్లో లక్షా 50 వేల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు. అయితే హన్మారెడ్డి కుటుంబీకులు ఆ డబ్బులు తీసుకోవడం కోసం బ్యాంక్కు వెళితే అధికారలు తహశీల్దార్ నుంచి మరణ ««ద్రువీ కరణ పత్రం తీసుకరావాలని సూచించారు. దీంతో హన్మారెడ్డి కుమారుడు రాంరెడ్డి గత జూన్ 14న దోమ తహశీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు కోసం వెళ్ళగా,మరణ «ద్రువీకరణ పత్రం కావాలంటే అడ్వకేట్తో ఆఫిడవిట్తో పాటు ఎస్టీవో లో చాలన్ కట్టాలని దోమ తహసీల్దార్ విఠల్ సూచించాడు. మరుసటి రోజునే రాంరెడ్డి చాలన్ కట్టడంతో పాటు ఆఫిిడవిట్ కూడా తీసుకొని వచ్చాడు.అయితే తమ దగ్గర 2003కు సంబంధించిన మరణ, జనన «ద్రువీకరణకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేవని సాకుతో గత మూడు నెలలుగా కార్యాలయం చుట్టూ రాంరెడ్డిని తిప్పించుకుంటున్నారు. దీంతో మనస్తాపం చెందిన రాంరెడ్డి సోమవారం మండల పరిషత్లో జరుగుతున్న ప్రజాదర్భార్ సమావేశంలోకి వెళ్లి తనను ఇంకా ఎన్నాళ్లు తిప్పుకుంటారని తహశీల్దార్ను ప్రశ్నించి తనతో తీసుకొచ్చిన కిరోసిన్ను ఒంటిపై పోసుకొని నిప్పంటించుకోవడానికి ప్రయత్నిస్తుండగా పక్కనే ఉన్న వారు అడ్డుకున్నారు. దీంతో ప్రమాదం తప్పింది. కాగా రాంరెడ్డి జూన్ 15న దరఖాస్తు చేసుకున్నప్పటికీ రెవెన్యూ అ«ధికారులు ఆగస్టు 15న ఇచ్చినట్లు మార్చడం గమనార్హం.
తెలంగాణ రాష్ట్ర సాధనకోసం యువత ఆత్మహత్యలు చేసుకోరాదని తెలంగాణ రాష్ట్ర సమితి పొలిట్బ్యూరో సభ్యులు, జిల్లా అధ్యక్షులు ఎ. చంద్రశేఖర్ అన్నారు. సోమవారం చేవెళ్లలో నియోజక వర్గ టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, టీడీపీలకు చెందిన మహేశ్వర్రెడ్డి, గోపాల్రెడ్డి, గోవర్ధన్రెడ్డి, మహేందర్యాదవ్, రాజశేఖర్, శేఖర్, సత్తిరెడ్డి, మహేందర్, గోపాల్, ప్రేమ్కుమార్, రవీందర్రెడ్డిలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కాగా సెప్టెంబర్ 9న చేవెళ్ల, వికారాబాద్లకు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కేసీఆర్ రానున్నట్లు తెలిపారు.