విశాఖపట్నం

రాష్ట్రంలో భానుడు ఉగ్రరూపం దాల్చాడు. రాష్ట్రం నిప్పుల కొలిమిగా మారింది. ప్రచండబానుడిదాటికి ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు. మంగళవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడదెబ్బతో 10మంది మృతిచెందారు. ఉదయం ఏడు గంటలనుంచే వేసవి ప్రతాపం చూపుతోంది. ఇళ్లలో విద్యుత్ వాడకం కూడా భారీగా పెరుగుతోంది. పలు జిల్లాల్లో విద్యుత్ కోతలు కూడా మళ్లీ మొదలయ్యాయి. బుధవారం హైదరాబాద్లోనూ అనధికారికంగా 3 గంటల విద్యుత్ కోత విధించారు. రాష్టవ్య్రాప్తంగా బుధవారం ఉష్ణోగ్రతలు తీవ్రరూపం దాల్చాయి. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు హడలిపోతున్నారు. ఈ సమయంలో ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటాయి.
తెలంగాణతోపాటు రాయలసీమ జిల్లాల్లోనూ 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలో సాధారణం కంటే 3 డిగ్రీలు, కోస్తోంధ్ర, రాయలసీమలో 1 నుంచి 3 డిగ్రీలు అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదువుతన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బుధవారం రెంటచింతలలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్లో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వ్యవసా య రంగానికి ప్రాణధారమైన నైరుతి రుతుపవనాలు జూన్ 1 కల్లా కేరళ తీరాన్ని తాకుతాయని భారత వాతావరణ విభాగం ప్రకటించిన విషయం తెలిసిందే. రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకేవరకు ఇదే పరిస్థితి రాష్ట్రంలో నెలకొంటుందని అధికారులు చెబుతున్నారు. ఈసారి సాధారణ తేదీ కన్నా కొంత ఆలస్యంగా దక్షిణ అండమాన్ సముద్రంలో రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు.

ఒకేరోజు ఏడుగురిని హత్య చేసి నరహంతకునిగా మారిన మాజీ సైనికోద్యోగి మెట్ట శంకర్రావుకు సోమవారం శ్రీకాకుళం అదనపు సెషన్సు కోర్టు న్యాయమూర్తి కెవి రమణాజీ ఉరి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. 2010 డిసెంబర్ 1న జిల్లాలోని జలుమూరు మండలం నగరికటకం పంచాయతీ మెట్టపేట గ్రామానికి చెందిన మాజీ సైనికోద్యోగి శంకర్రావు, పేగుబంధమని కూడా చూడకుండా తొమ్మిదేళ్ళ కుమార్తె మానస, ఆరేళ్ళ కుమారుడు దివాకర్లను అతికిరాతకంగా తలలు నరికి హతమార్చాడు. పిల్లల తలలను శ్రీముఖలింగం క్షేత్రానికి స్వాగత ఆలయమైన సోమేశ్వర ఆలయ గర్భగుడిలో భద్రపరిచాడు. అక్కడనుంచి స్వగ్రామమైన మెట్టపేట చేరుకుని పైల లక్ష్మణరావు (55), వెంకట్రావు (50), మెట్ట ఎర్రయ్య (70), ఊట పార్వతి (60), బొడ్డేపల్లి దమయంతి (55)లను అతిదారుణంగా హత్య చేసి గ్రామంలో భయబ్రాంతులు సృష్టించాడు. అంతేకాకుండా పలు ఇళ్ళపై బాంబులతో దాడి చేసి మారణాయుధాలతో నరరూప రాక్షసుడిగా వీరంగం చేశాడు. గతంలో భార్య కూన విజయలక్ష్మి కూడా శంకర్రావు వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడింది. అప్పట్లో బంధువుల ఫిర్యాదు మేరకు శంకర్రావుకు ఐదేళ్ళు జైలు శిక్ష పడింది. విడుదలైన తరువాత గ్రామానికి చెందిన కొంతమంది వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారన్న అక్కసుతో ఒకేరోజు ఐదుగురిని హతమార్చాడు. ఈ ఘటన ప్రజలనే కాకుండా పోలీసులనూ భయభ్రాంతులకు గురిచేసింది. గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణకు డిఐజి సౌమ్యమిశ్రా, అప్పటి ఎస్పీతోపాటు పలువురు పోలీసు ఉన్నతాధికార్లు మెట్టపేటను సందర్శించి బాధిత కుటుంబాల్లో ఆత్మస్థయిర్యాన్ని నింపేందుకు కృషి చేశారు. ఈ విషయాన్ని నగరికటకం వీఆర్వో జలుమూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసును దర్యాప్తుచేసి కోర్టులో దాఖలు చేశారు. కేసు విచారించిన న్యాయమూర్తి బాంబులు వేసి భయభ్రాంతులకు గురిచేసిన నేరానికి పదేళ్ళు, హత్య చేస్తానని బెదిరించిన నేరానికి అయిదేళ్ళు జైలుశిక్ష, క్రూరంగా, పాశవికంగా, భయానకంగా ఇద్దరు పిల్లలు సహా ఏడుగురిని హత్య చేసిన నేరానికి హత్య కేసుల్లోనే అత్యంత హేయమైన హత్య పేర్కొంటూ ఉరిశిక్ష విధిస్తూ సోమవారం తీర్పు చెప్పారు.

దేశంలోని ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలు రూ. లక్షా 50 వేల కోట్ల నష్టాల్లో ఉన్నాయని కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల శాఖ మంత్రి ఎస్.జైపాల్రెడ్డి తెలియచేశారు. సుమారు 2,200 కోట్లతో విశాఖ రిఫైనరీలో ఏర్పాటు చేసిన క్లీన్ ఫ్యూయల్స్ ప్రాజెక్ట్ను సోమవారం ఆయన జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో జైపాల్రెడ్డి మాట్లాడుతూ పెట్రోలియం శాఖ మంత్రిగా ఉన్నందుకు తను ఆనందపడాలో? బాధపడాలో అర్థం కావడం లేదని అన్నారు. క్రూడ్ ఆయిల్ ధరలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ఇరాన్లో ఉద్రిక్తత ఏర్పడినా, అరబ్ దేశాల్లో తిరుగుబాటు వచ్చినా క్రూడ్ ఆయిల్ ధర పెరుగుతోందని అన్నారు. యూరప్ ఖండంలో రాజకీయ, ఆర్థిక సంఖోభం వచ్చినా డాలర్ రేట్లలో మా ర్పులు చోటు చేసుకుంటున్నాయని అ న్నారు. ఈ రెండు నష్టాలనూ చమురు సంస్థలు ఎదుర్కోవలసి వస్తోందని ఆయన చెప్పారు. ఇటువంటి పరిస్థితుల్లో పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచాల్సి వస్తోందని జైపాల్రెడ్డి చెప్పారు. తనకు వ్యక్తిగతంగా పెట్రో ధరలు పెంచాలన్న ఉద్దేశం లేకపోయినా గణితవాదం నుంచి తప్పించుకోలేం కదా! అని ఆయన అన్నారు. ఎప్పుడు పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచాలన్నా ఎన్నికలు అడ్డు వస్తుంటాయి. ఎన్నికల్లేని సంవత్సరమే లేదు. ఆర్థిక భారాన్ని మోస్తున్నా, నిగ్రహంతో ఉండి, వీలైనంత వరకూ ధరలు పెంచకుండా చూస్తున్నామని జైపాల్రెడ్డి వివరించారు. రేట్లు పెరిగినప్పుడల్లా, ప్రభుత్వ కంపెనీలను ప్రైవేటుపరం చేయమని ఉచిత సలహాలు వస్తున్నాయని, నష్టాల్లో ఉన్న కంపెనీలను వారెందుకు తీసుకుంటారని మంత్రి ప్రశ్నించారు.
త్వరలో యూరో-4 పెట్రోలు
వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు యూరో-4 పెట్రోలును దేశంలోని 13 నగరాల్లో వినియోగిస్తున్నామని మంత్రి జైపాల్రెడ్డి తెలియచేశారు. యూరో-3 పెట్రోలను యూరో-4 పెట్రోలుగా మార్చనున్నామని, ఇందుకు 40 వేల కోట్ల రూపాయలు ఖరవుతుందని ఆయన చెప్పారు. త్వరలోనే విశాఖ నగరంలో కూడా యూరో-4 పెట్రోలను అందుబాటులోకి తీసుకురానున్నామని ఆయన చెప్పారు. అలాగే యూరో-4 డీజిల్ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు.
కేంద్ర మానవవరుల అభివృద్ధి శాఖ మంత్రి డి.పురంధ్రీశ్వరి మాట్లాడుతూ ప్రపంచంలో ఆయిల్ ఉత్పత్తి రంగంలో హెచ్పిసిఎల్ నాలుగో స్థానంలో ఉందని అన్నారు. క్రూడ్ ఆయిల్ను దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో మన దేశం ఐదో స్థానంలో ఉందని అన్నారు. అలాగే పెట్రోలు ఎగుమతిలో మన దేశం ఆరో స్థానంలో ఉందని పేర్కొన్నారు. ఆయిల్ రంగంలో మరిన్ని అద్భుతాలు సాధించి, ప్రపంచంలోనే భారత దేశం ఒక సూపర్ శక్తిగా ఆవిర్భవించబోతోందని ఆయన చెప్పారు. హెచ్పిసిఎల్ విడుదల చేస్తున్న కాలుష్యకారకాల్లోని ప్రమాదాన్ని తగ్గించడానికి అనేక చర్యలు తీసుకుంటున్నారని ఆమె అన్నారు. వాహనాల సంఖ్య పెరిగిపోవడం వలన కూడా కాలుష్యం పెరుగుతోందని ఆమె అన్నారు.
రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ కొరతను నివారించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జైపాల్రెడ్డిని కోరారు. రాష్ట్రాన్ని ఆదుకోవలసిన సమయం వచ్చిందని చెప్పారు. రాష్ట్ర పెట్టుబడులు, వౌలిక, సహజవాయువుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ హెచ్పిసిఎల్ గ్రీన్బెల్ట్ను అభివృద్ధి చేయాలని కోరారు. కాలుష్య రహిత నగరంలో తీర్చి దిద్దేందుకు పరిశ్రమలు కదలి రావాలని ఆయన కోరారు.
రాజ్యసభ సభ్యులు సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ యూరో-3, యూరో-4 పెట్రోలు వాడకం వలన కాలుష్యానికి తెరపడబోతోందని అన్నారు. భవిష్యత్లో హెచ్పిసిఎల్ కాలుష్య నివారణ సంస్థగా మారుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ మాట్లాడుతూ హెచ్పిసిఎల్లో కాంట్రాక్ట్ కింద పనిచేసేందుకు ఈ ప్రాంతంలో నివసించే వారికే ముందుగా ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. గ్రీనరీ అభివృద్ధికి హెచ్పిసిఎల్ యాజమాన్యం చర్యలు తీసుకోవాలని సూచించారు. (చిత్రం) విశాఖలోని హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ మరో మైలు రాయి దాటింది. విశాఖ రిఫైనరీలోని క్లీన్ ఫ్యూయల్ ప్రాజెక్ట్ను సోమవారం జాతికి అంకితం చేస్తున్న కేంద్ర మంత్రి జైపాల్రెడ్డి.

భారత నౌకాదళానికి చెందిన ఓ మానవ రహిత గ్లాడర్ గురువారం సాయంత్రం ఓ కొండను ఢీకొంది. ఈ ఘటనలో ఈ గ్లాడర్ మొత్తం కాలి బూడిదైంది. దీనికి సబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఐఎన్ 901 మానవ రహిత గ్లాడర్ గత కొన్ని రోజులుగా గాజువాక సమీపంలోని గణేష్ నగర వద్ద ఉన్న కొండ చుట్టుపక్కల ప్రాంతాల్లో చక్కర్లు కొడుతోంది. సమాచార వ్యవస్థ కోసం నౌకాదళం ఈ విమానాన్ని వినియోగిస్తోంది. దీని ద్వారా వివిధ ప్రాంతాల్లో ఫొటోలు తీసి ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటుంటారు.
పూర్తిగా రిమోట్ సహాయంతో నడిచే ఈ గ్లాడర్ విశాఖలోని ఐఎన్ఎస్ డేగా ఎయిర్ స్టేషన్ నుంచి గురువారం మధ్యాహ్నం బయల్దేరింది. కొండ చుట్టుపక్కల కొంతసేపు చక్కరు కొట్టిన గ్లాడర్ అకస్మాత్తుగా నేలకు అతి చేరువగా వచ్చేసింది. కొండ దిగువ భాగంలో ఉన్న ఇళ్ళకు అతి చేరువుగా వెళుతూ కొండను ఢీకొంది. పెద్ద శబ్దంతో గ్లాడర్ పేలిపోయింది. దీని శకలాలు చాలా దూరం ఎగిరిపడి, పెద్ద మంటలు చెలరేగాయి. దీంతో కొండవాలు ప్రాంతంలో ఉన్న జనం భయంతో ఇళ్ళ నుంచి పరుగులు తీశారు. గ్లాడర్ మొత్తం కాలి బూడిదైంది. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం సంభవించకపోయినా, కోట్ల రూపాయల విలువైన గ్లాడర్ దగ్ధమైంది. అలాగే కొండ అంచును తగిలి గ్లాడర్ పేలిపోయింది. అదే ఇళ్ళ మధ్య ఈ ప్రమాదం జరిగి ఉంటే, భారీ ప్రాణ నష్టం వాటిల్లి ఉండేది. సంఘటనా స్థలానికి చేరుకోడానికి నేవీ అధికారులకు చాలా కష్టసాధ్యమైంది. హెలికాప్టర్ల ద్వారా సిబ్బందిని ఘటనా స్థలానికి చేరువలో దించినా, కొండపైకి వెళ్లడానికి చాలా అవస్థలుపడాల్సి వచ్చింది. దీనిపై స్పందించిన నేవీ అధికారులు ఘటనకు సంబంధించి దర్యాప్తు జరుపుతున్నామని చెప్పారు. (చిత్రం) కొండపై లభ్యమైన గ్లాడర్ శకలం

వైభవ్ జ్యుయలరీ అధినేత గ్రంధి మనోజ్ కుమార్ అలియాస్ మనోజ్ హత్యకు గురయ్యారు. ఈనెల 7న ఉదయం అదృశ్యమైన మనోజ్ చివరకు బెంగుళూరుకు 300 కిలోమీటర్ల దూరంలోని హాసన్ జిల్లా అటవీ ప్రాంతంలో మృతదేహమై కనిపించారు. విశాఖ నగరంలో సంచలనం సృష్టించిన ఈ హత్యకు సంబంధించి ఆయన స్నేహితుడు కంకటాల మల్లిక్ గురువారం సాయంత్రం అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. వైభవ్ జ్యుయలరీకి చెందిన మరో ఐదు శాఖలను తెరిచేందుకు మనోజ్ ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. సినీ నటుడు కమల్హాసన్ కుమార్తె శృతిహాసన్తో ఈనెల 17న ముంబయిలో ఓ యాడ్ ఫిల్మ్ తీయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకు కావల్సిన బంగారు ఆభరణాలను కొనుగోలు చేసేందుకు ఈనెల 2న మనోజ్ విశాఖ నుంచి బయల్దేరి రాజస్థాన్లోని జైపూర్ వెళ్లారు. అక్కడ అతి ఖరీదైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేసి, తనతోపాటు హైదరాబాద్కు తీసుకువచ్చారు. అక్కడి నుంచి 6న బయల్దేరి బెంగుళూరు వెళ్లారు. బెంగుళూరులో ఐటిసి కాంటినెంటల్ హోటల్లో దిగారు. ఆయన ఎప్పుడు బెంగుళూరు వెళ్లినా, కార్ జోన్ కంపెనీకి చెందిన క్యాబ్నే అద్దెకు తీసుకుంటారు. ఎప్పటిలాగే అదే కంపెనీకి చెందిన ఇన్నోవా కారులో బెంగుళూరులో జరుగుతున్న బంగారు ఆభరణాల ఎగ్జిబిషన్కు మనోజ్ వెళ్లారు. అక్కడ కూడా కొన్ని బంగారు ఆభరణాలను కొనుగోలు చేశారు. మార్గమధ్యంలో కొంతమంది బంగారు వర్తకులను కూడా ఆయన కలిశారు. ఇదే సమయంలో కొనుగోలు చేసిన ఆభరణాలను తన వెంట తీసుకువెళ్లకుండా, కారులోనే ఉంచారు. బ్యాగ్లో విలువైన పత్రాలు ఉన్నాయని వాటిని జాగ్రత్తగా చూడమని కారు డ్రైవర్ రవికుమార్కు చెప్పారు. ఆయన కారు దిగి వెళ్లగానే రవికుమార్ బ్యాగ్ తెరిచి చూడగా అందులో విలువైన ఆభరణాలు, వజ్రాలు కనిపించాయి. వీటిని దొంగిలించాలన్న దుర్బుద్ధి ఆయనలో కలిగింది. ఈ సమాచారాన్ని మరో ఇద్దరు కారు డ్రైవర్లకు తెలియచేశాడు రవికుమార్. వీరంతా ఓ పథకాన్ని రచించారు. మనోజ్ అదే కారులో రాత్రి పది గంటల వరకూ బెంగుళూరులో తిరిగారు. రాత్రి హోటల్కు చేరుకున్న మనోజ్, కారు డ్రైవర్ రవికుమార్ను మర్నాడు తెల్లవారుజాము నాలుగు గంటలకు రమ్మనమని చెప్పారు. ఏడవ తేదీ ఉదయం 7.10 గంటలకు బెంగుళూరు నుంచి స్పైస్ జెట్ విమానంలో బయల్దేరి ముంబయి వెళ్లాల్సి ఉంది. సాధారణంగా ఆయన తెల్లవారుజామునే బయటకు వచ్చి నగరంలో మార్కెట్ను పరిశీస్తుంటారు. జ్యుయలరీ షాప్ ఏర్పాటు చేసేందుకు అనువైన ప్రదేశాలను పరిశీలించడం ఆయనకు అలవాటు. కారులో కొంతదూరం ప్రయాణించిన తరువాత లైట్లు పనిచేయడం లేదని డ్రైవర్ రవికుమార్ కారును ఆపాడు. కొద్దిసేపటికే మరో ఇద్దరు డ్రైవర్లు శివకుమార్, కృష్ణగౌడ్ ఆ కారులో ఎక్కారు. వెంటనే రవికుమార్ కారు ముందుకుపోనిచ్చాడు. కారులో ఎక్కిన కృష్ణగౌడ్, శివకుమార్ మనోజ్కు కత్తి చూపి బెదిరించారు. ఆ తరువాత ఆయన నోట్లో గుడ్డలు కుక్కారు. మెడకు ఉరేసి హతమార్చారు.
కొద్దిసేపటికి మనోజ్ మృతదేహాన్ని వేరే కారులోకి మార్చారు. ఎవ్వరికి అనుమానం రాకుండా ముందు కారును రవికుమార్ ఎయిర్పోర్టుకు తీసుకువెళ్లాడు. ఆ తరువాత ఈ ముగ్గురు డ్రైవర్లు కలిసి కారును బెంగుళూరుకు శివార్లకు తీసుకువెళ్లారు. పగలంతా అక్కడే ఉంచి, ఏడో తేదీ రాత్రి తుమ్కూరు అటవీ ప్రాంతంలోని ఘాట్ రోడ్డుకు తీసుకువెళ్లి మనోజ్ శవాన్ని లోయలో పడేశారు. అప్పటికి మనోజ్ తన వెంట మూడు బ్యాగ్లతో బంగారాన్ని తీసుకువెళుతున్నారు. దీని విలువ సుమారు ఆరు కోట్ల రూపాయలు ఉంటుంది. ఈ బంగారాన్నంతా చేజిక్కించుకున్న కృష్ణగౌడ ఘటనా స్థలానికి రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ గ్రామంలో తన బంధువుల ఇంటికి చేర్చాడు. విశాఖ నుంచి మనోజ్ మిత్రుడు మల్లిక్, తదితరులు బెంగుళూరు చేరుకుని కర్ణాటక డిజిపిని కలిశారు. వెంటనే 80 మంది పోలీసులతో పలు బృందాలను ఏర్పాటు చేసి బెంగుళూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. కారు డ్రైవర్ రవికుమార్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఆయన ఇచ్చిన సమాచారం మేరకు తుమ్కూరు అటవీ ప్రాంతానికి పోలీసులు చేరుకుని గురువారం మధ్యాహ్నానికి మనోజ్ మృతదేహాన్ని గుర్తించారు.
రవికుమార్తోపాటు, ఈ హత్యకు పాల్పడిన శివకుమార్, కృష్ణగౌడను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి మొత్తం బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మనోజ్ మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించి, శుక్రవారం మధ్యాహ్నానికి విశాఖ తీసుకువస్తున్నారు. ఆయన అంత్యక్రియలు విశాఖ, లేదా ఏలూరులో జరపవచ్చని మల్లిక్ వివరించారు. మనోజ్ మృతికి సంతాపంగా శుక్రవారం విశాఖలోని నగల, వస్త్ర దుకాణాలను మూసివేయాలని వ్యాపార సంఘాలు నిర్ణయించాయి.

విశ్వసనీయత.. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ లోపల, బయట జరుగుతున్న చర్చ ఇది. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు అందరి నోటా విశ్వసనీయత అన్న పదం ప్రముఖంగా వినిపిస్తోంది. రానున్న పెద్దల సభ ఎన్నికల్లో పార్టీ అధినేత చంద్ర బాబునాయుడు ఎవరికి టికెట్లు ఇస్తారన్న అంశం పార్టీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఈసారి ఎన్నికల్లో నమ్ముకున్న వారికి టిక్కెట్లు ఇస్తారా? లేక మునుపటి మాదిరిగా వ్యాపారస్తులను తీసుకువచ్చి అందలం ఎక్కిస్తారా? ఒకటి ఓసీ, మరొ కటి బీసీకి ఇస్తున్నప్పటికీ, గతంలో మాదిరిగా గళమెత్తలేని బీసీ నాయకులకు ఇస్తా రా? లేక బలమైన బీసీ నేతకు అవకాశం ఇస్తారా? వంటి ప్రశ్నలు చర్చనీయ మయ్యాయి. ఇప్పటికే కాంగ్రెస్, టీఆర్ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు వీలున్న ప్రతి సందర్భంలోనూ చంద్రబా బునాయుడుకు విశ్వసనీయత లేదని, ఆయన నమ్ముకుంటే మునిగిపోతారని ప్రచారం చేస్తున్నారు.
వైఎస్ కులాలు, వర్గాల కోణం చూడకుండా నమ్ముకున్న వారికి న్యాయం చేస్తారన్న ముద్ర ఇంకా ఉంది. గతంలో గౌరు వెంకటరెడ్డి జైల్లో ఉంటే ఎవరేమనుకున్నా ఎవరికీ భయపడకుండా వెళ్లి ఆయనను కలిసిన వైనాన్ని గుర్తు చేస్తున్నారు. తనను నమ్ముకున్న వారికి పదవులిచ్చారు. టీడీపీలో పదవులకు సంబంధించి ఎలాంటి సందర్భం వచ్చినా ప్రతిసారీ బాబును వైఎస్తో పోల్చిచూస్తున్నారు. క్యాడర్లో నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తోంది. అటు పార్టీలో కూడా అంతర్గతంగా ఇలాంటి చర్చనే జరుగుతోంది. పార్టీని నమ్ముకుని పనిచేసే వారిని కాకుండా, వ్యాపారస్తులను తీసుకువస్తున్నారన్న విమర్శలు ఇంకా కొనసాగుతున్నాయి. గతంలో సుజన చౌదరికి టికెట్ ఇచ్చినప్పటి నుంచి మొదలయిన ఈ విమర్శ ఇప్పటికీ కొనసాగుతోంది. ఆయన ఇటీవల పార్లమెంటు సెంట్రల్ హాల్లో జగన్తో ముచ్చటించారన్న వార్తలు చూసిన శ్రేణుల్లో.. వ్యాపారవర్గాలకు టికెట్లు ఇస్తే వారికి పార్టీ పట్ల చిత్తశుద్ధి, అంకితభావం ఎందుకు ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమయింది.
ఇక బీసీ అయినప్పటికీ మహిళ కోటాలో రాజ్యసభ స్థానం సంపాదించిన గుండు సుధారాణికి ఆ సీటు ఎందుకు ఇచ్చారో ఇప్పటికీ అర్ధం కావడం లేదంటున్నారు. పార్టీలో ఆమె పాత్ర అత్యంత స్వల్పమేనని, చివరకు సొంత పార్టీ ఎమ్మెల్యేలకు సైతం ఎంపీ నిధులు ఇవ్వడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ను ఎదుర్కోవడంలో ఆమె దారుణంగా విఫలమయ్యారంటున్నారు. అదే ఆమె స్థానంలో అప్పుడే దేవేందర్ గౌడ్కో, తలసాని శ్రీనివాసయాదవ్కో, గరికపాటి మోహన్రావుకో, అరవిందకుమార్ గౌడ్కో ఇచ్చి ఉంటే పరిస్థితి వేరేవిధంగా ఉండేదని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కులం కోటాను భర్తీ చేయాలి కాబట్టి, ఎవరో ఒకరికి ఇచ్చే పద్ధతి కాకుండా వారి వల్ల పార్టీకి ఏ మేరకు లాభమో చూడాలని వివరిస్తున్నారు. రాజ్యసభ ఎంపీల వల్ల పార్టీకి ఏ మాత్రం లాభం ఉండటం లేదని, ఎవరి వ్యక్తిగత అజెండాలతో వారు పనిచేస్తున్నారన్న విమర్శలున్నాయి.
ఇదిలాఉండగా, చంద్రబాబునాయుడు ఇమేజ్ను దెబ్బతీసేందుకు విశ్వసనీయత కేంద్రంగా జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఏమేరకు తొలగించుకుంటారన్న అంశంపై పార్టీ వర్గాలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాయి. అధికారం ఉన్నప్పుడు ఎలాంటి పదవులు ఆశించకుండా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పార్టీ కోసం నిరంతరం పనిచేసే నాయకులను ఈసారి అందలం ఎక్కించకపోతే విశ్వసనీయతకు సంబంధించిన విమర్శలు నిజమయ్యే ప్రమాదం ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. పార్టీ కోసం పనిచేసే మీకే అవకాశాలు రాకపోతే ఇక మాకేమి న్యాయం చేస్తారన్న ప్రశ్నలు గత కొద్దికాలం నుంచి క్షేత్రస్థాయి శ్రేణుల నుంచి వినిపిస్తున్నాయి. జిల్లాలకు ఇన్చార్జులుగా వెళుతున్న నాయకులు కష్టపడి పనిచేస్తే పదవులు వాటంతట అవే వస్తాయని కార్యకర్తలకు చెబుతున్నారు. అయితే, పార్టీ కార్యక్రమాలను భుజాన వేసుకునే మీకే న్యాయం చేయకపోతే, ఇక మాకేమి న్యాయం చేస్తారన్న ప్రశ్నలు ద్వితీయ శ్రేణి నేతలను నుంచి చాలాకాలం నుంచి వినిపిస్తున్నాయి.
వైఎస్ మాదిరిగా నమ్ముకున్న వారికి న్యాయం చేస్తారన్న ఇమేజ్ సంపాదించుకోవలసిన అవసరం ఉందంటున్నారు. అలాగని వైఎస్ మాదిరిగా అవినీతిపరులను అందలం ఎక్కించకుండా ఎవరైతే కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచారో వారిని గుర్తించాలని సూచిస్తున్నారు. అందులోనూ స్థానిక సంస్థల ఎన్నికల ముందు జరిగే రాజ్యసభ ఎన్నికల్లో, పార్టీకి పనిచేసే వారికే పదవులు వస్తాయన్న సంకేతాలు ఇవ్వకపోతే, శ్రేణుల్లో ఉత్సాహం నింపడం కష్టమంటున్నారు. పార్టీ కమర్షియల్ దారిలో వెళుతోందన్న విమర్శలకు తెరదించవలసిన సమయం కూడా ఇదేనంటున్నారు. బీసీలకు సీటు విషయంలో కూడా ఇప్పటివరకూ అనుసరిస్తోన్న పద్ధతికి తెరదించాలంటున్నారు. బలమైన బీసీకి ఇవ్వకుండా నోరు లేని బీసీలకు ఇస్తున్నారన్న విమర్శలకూ తెరదించాలని స్పష్టం చేస్తున్నారు.
పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, అధికారపార్టీ ఒత్తిళ్లు, బెదరింపులకు లొంగకుండా పనిచేసినవారిని, అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి పదవులు ఆశించకుండా, సొంత నిధులు ఖర్చు చేసుకుంటూ, ప్రతిపక్షంలోకి వచ్చిన నాటి నుంచి అధినేతను, పార్టీని అంటిపెట్టుకుని ఉన్న వారికి అవకాశం ఇవ్వడం ద్వారా విశ్వసనీయతలేదంటూ తమ అధినేతపై వస్తున్న విమర్శలకు శాశ్వతంగా తెరదించుకోవచ్చని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇదే సమయంలో అనుభవానికీ పట్టం కట్టాలంటున్నారు. ప్రస్తుతం రాజ్యసభలో మైసూరారెడ్డి తర్వాత ఆ స్థాయిలో మాట్లాడగలిగే విషయ పరి జ్ఞానం ఉన్న ఎంపీలెవరూ లేరు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ తెలిసిన వారూ ఎవ రూ లేరు. ఈ నేపథ్యంలో అనుభవంతో పాటు అవగాహన ఉన్న నేతకు అ వకాశం ఇవ్వడం ద్వారా, పార్టీ ఇమేజ్ కూడా పెంచాలన్న సూచన వ్యక్త మవుతోంది.

డీఎస్స-12 నోటిఫికేషన్ విడుదల
మే 2,3,4 తేదీల్లో రాత పరీక్షలు
అప్రెంటీస్ విధానం రద్దు
‘ఇంటర్’ నిబంధన తొలగింపు
‘ఓపెన్ డిగ్రీ’ వారికీ అర్హత
ఎస్ఏ పోస్టులకు సబ్జెక్టు నిబంధనల సడలింపు
80 మార్కులకే డీఎస్సీ
20 మార్కులకు టెట్ వెయిటేజి
మరో 7100 పోస్టులకు రెండు రోజుల్లో నోటిఫికేషన్
హైదరాబాద్, జనవరి 30 : లక్షలాది మంది ఉపాధ్యాయ అభ్యర్థులకు శుభవార్త. కొద్ది రో జులుగా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తోన్న ‘డీఎస్సీ -2012 నోటిఫికేషన్’ సో మవారం విడుదలైంది. మొత్తం 21,343 ఉపాధ్యాయ ఉద్యోగాలను ఇందులో నోటిఫై చేశారు. ఉపాధ్యాయ అభ్యర్థులు దశాబ్దకాలంగా చేస్తోన్న ‘అప్రెంటిస్’ రద్దు డిమాండ్ కూడా నెరవేరుతోంది. వివాదాస్పదంగా మారిన ‘ఇంటర్లో సంబంధిత సబ్జెక్టులు తప్పనిసరి’ అనే నిబంధనను తొలగించారు.
నోటిఫై చేసిన మొత్తం పోస్టుల్లో.. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 5,703, ఎస్జీటీ పోస్టులు 11, 602 పోస్టులు, లాంగ్వేజ్ పండిట్లు 2000, పీఈటీలు 365, మునిసిపల్ పాఠశాలల్లో 1,673 పోస్టులు ఉన్నాయి. ఫిబ్రవరి 16 నుంచి మార్చి 17వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. సచివాలయంలో సోమవారం సాయంత్రం 3 గంటలకు మాధ్యమిక విద్యాశాఖ మంత్రి కె.పార్థసారథి ఈ డీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేశారు. డీఎస్సీకి విద్యార్హతల నిబంధనల్లో కొన్నింటిని సడలించారు.
స్కూల్ అసిస్టెంట్స్ (మేథ్స్, ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్, సోషల్ స్టడీస్) పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ఇంటర్ స్థాయిలో కూడా మేథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్, హిస్టరీ, జాగ్రఫీ సబ్జెక్టులు చదివి ఉండాలన్న నిబంధనలను తొలగించారు. అంటే.. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఇంటర్ చదివి ఉండాలన్న నిబంధన లేదు.
ఫలితంగా ఓపెన్ యూనివర్సిటీ ద్వారా నేరుగా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు కూడా అర్హత లభిస్తుంది. స్కూల్ అసిస్టెంట్స్ (జీవశాస్త్రం) పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు జీ.వో.నెం.4లో పేర్కొన్న సబ్జెక్టులతో పాటు సెరికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, పౌల్ట్రీ సబ్జెక్టుల అభ్యర్థులకు కూడా అర్హత కల్పించారు. టీచర్లకు అప్రెంటిస్ విధానాన్ని ఈ డీఎస్సీ నుంచి రద్దు చేశారు. అభ్యర్థులు ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు నమూనా, యూజర్ గైడ్ కోసం జ్ట్టిఞ://్చఞఛీటఛి.ఛిజజ.జౌఠి.జీn వెబ్సైట్ను చూసుకోవాలి.
డీఎస్సీ 80 మార్కులకే..
టెట్కు వెయిటేజీ ఇవ్వనున్న కారణంగా 80 మార్కులకే డీఎస్సీ పరీక్షను నిర్వహించనున్నారు. మిగతా 20 మార్కులకు టెట్ మార్కులను వెయిటేజీగా జమ చేస్తారు. ఒక్కో ప్రశ్నకు అర మార్కు చొప్పున 80 మార్కులకు 160 డీఎస్సీ పరీక్ష ఉంటుంది. ఎస్జీటీ పరీక్షలో జనరల్ నాలెడ్జ్కు 10 మార్కులు, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ 10, ఇంగ్లీష్ 9, ఇండియన్ లాంగ్వేజ్ 9, మాథ్స్ 9, సైన్స్ 9, సోషల్ స్టడీస్ 9, టీచింగ్ మెథడ్ 15 మార్కులు ఉంటాయి. స్కూల్ అసిస్టెంట్ పరీక్ష ల్లో.. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 10, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ 10, సబ్జెక్ట్ కంటెం ట్ 44, టీచింగ్ మెథడాలజీ 16 మార్కులు ఉంటాయి. పీ ఈటీలకు టెట్ ఉండకపోవ డం వల్ల పూర్తిగా 100 మా ర్కులకు పరీక్ష ఉంటుంది.

ఎక్సైజ్ అధికారుల ఇళ్లలో సోదాలు
ప్రకాశం, గుంటూరు, శ్రీకాకుళం, విశాఖ, వరంగల్ జిల్లాల్లో మద్యం సిండికేట్లపై అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) శుక్రవారం దాడులు నిర్వహించింది. మద్యం వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాలతోపాటు కొందరు ఎక్సైజ్ అధికారుల ఇళ్లలోనూ సోదాలు చేశారు. నెల్లూరు, కర్నూలు, ఒంగోలుకు చెందిన ఎసిబి అధికారులు బృందాలుగా ఏర్పడి ఒంగోలు, శింగరాయకొండలలో మద్యం సిండికేట్లపై దాడులు నిర్వహించారు. ఒంగోలులోని మద్యం సిండికేట్ నిర్వాహకుడు అబ్బూరి వెంకట్రావు ఇంటిపై అధికారులు దాడి చేశారు. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. శింగరాయకొండలోని ఎక్సైజ్ సిఐ గురవయ్య ఇంట్లో తెల్లవారుజామున అధికారులు తనిఖీ నిర్వహించారు. సిండికేట్లకే వడ్డీ నిమిత్తం ఆయన సుమారు రూ.20 లక్షలు ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు. నెలనెలా టార్గెట్ల చెల్లింపునకు ఎక్సైజ్ అధికారులే వ్యాపారులకు వడ్డీలకు ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఈ దాడుల్లో దొరికిన పత్రాల్లో లంచాల భాగోతం వెలుగుచూసింది. ఉదయం నుంచీ సాయంత్రం వరకూ దాడులు కొనసాగాయి. గుంటూరులోని లక్ష్మీపురంలో నివాసముంటున్న మద్యం వ్యాపారుల గృహాలపైనా అధికారులు దాడులు నిర్వహించారు. విజయవాడ ఎసిబి డిఎస్పి విష్ణు, గుంటూరు సిఐ శ్రీనివాసరెడ్డి, మల్లిఖార్జునరావుల నేతృత్వంలో సుబ్బారెడ్డి, నల్లబోతు శ్రీనివాసరావులకు చెందిన ఇళ్లల్లో సోదాలు చేసి, మద్యం వ్యాపారాలకు సంబంధించిన కీలక దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు.
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన ఎస్.శ్రీనివాసులరెడ్డి సిండికేట్లలో కానిస్టేబుల్ నాగేశ్వర్ పేరు మీద రూ.42లక్షలు పెట్టుబడి పెట్టినట్లు రికార్డులు దొరికాయి. శ్రీనివాసుల రెడ్డి ఒకప్పుడు మాజీ ఎమ్మెల్యే ఎన్.ప్రసన్నకుమార్రెడ్డి అనుచరుడు. ఇదే క్రమంలో తెనాలిలోనూ మద్యం సిండికేట్ల గృహాలపై ఎసిబి అధికారులు దాడులు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఓరుగంటి ఈశ్వర్, శ్రీకాకుళం పట్టణంలోని ఎపిహెచ్బి కాలనీలో నివాసముంటున్న సర్కిల్ హెడ్కానిస్టేబుల్ మెండ అప్పన్న, విశాఖపట్టణంలో ఉన్న శ్రీకాకుళం ఎక్సైజ్ సిఐ రామకృష్ణ నివాసాల్లో ఎసిబి అధికారులు శుక్రవారం సోదాలు చేపట్టారు. ఎసిబి రాజమండ్రి రేంజ్ డిఎస్పీ నాగేశ్వరరావు ఆధ్వర్యాన ఈశ్వర్ ఇంట్లో సోదాలు
ప్రారంభించారు. విశాఖపట్నంలో జనప్రియ, గణేష్ మద్యం సిండికేట్లపై దాడులు చేశారు. సిండికేట్ కార్యాలయాలతోపాటు ఆయా సిండికేట్ల యాజమాన్య ప్రతినిధులు ప్రసాద్, పుష్కరగణేష్ ఇళ్లపై కూడా దాడులు చేశారు. ఎక్సైజ్ టాస్క్పోర్స్ సిఐ కామేశ్వరరావు ఇంటిపై కూడా దాడిచేశారు. గతంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్గా పనిచేసిన హనుమంతరావు ఇంటిలో రాజమండ్రి ఎసిబి అధికారులు సోదాలు చేశారు. అందరిపై కేసులు నమోదుచేశారు. విశాఖలో జరిగిన దాడుల్లో డిఎస్పి రామకృష్ణప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.
వరంగల్ జిల్లాలో మద్యం వ్యాపారులు, ఎక్సైజ్ అధికారుల ఇళ్లపై ఎసిబి అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. హన్మకొండలోని మద్యం వ్యాపారి మోహన్రెడ్డి ఇంటిపై దాడులు నిర్వహించిన అధికారులు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వరంగల్లోని రైల్వే గేట్ ప్రాంతానికి చెందిన వీరాచందర్ ఇంట్లోనూ సోదాలు చేశారు. వీరితో పాటు హన్మకొండలోని సహకార్నగర్లో ఉన్న ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ సిఐ కరమ్చంద్ ఇంటిపైనా ఎసిబి అధికారులు దాడులు నిర్వహించారు. వీరి వద్ద నుండి రూ.10లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఒక్కసారిగా అధికారులు దాడులు నిర్వహిస్తుండడంతో సమాచారం తెలుసుకున్న పలువురు మద్యం వ్యాపారులు ఉడాయించినట్లు సమాచారం. దాడులపై ఎసిబి అధికారులు ఎలాంటి వివరాలూ వెల్లడించడం లేదు.

చిరంజీవే తన ప్రాణమని, జీవిత కాలంపాటు ఆయన తోటే కలిసి ప్రయాణం చేస్తానని రాష్ట్ర మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, ఓడ రేవుల శాఖ ల మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. నమ్ముకున్న వారికి ద్రోహం చెెయరనేదానికి తన పదవే ఒక ఉదాహరణని అన్నారు. చిరంజీవి మానవ సంబంధాలు కలిగిన వ్యక్తని, తనను కుటుంబ సభ్యుడిలా, సోదరుడిలా ఆదరిస్తున్నారని అన్నారు. మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించి మొదటిసారిగా విశాఖ వచ్చిన గంటాకు అపూర్వ స్వాగతం లభించింది. వేలాది మంది కాంగ్రెస్ శ్రేణులు, నాయకులు, ఎమ్మెల్యేలు, పెద్ద ఎత్తున తరలి వచ్చి ఘనస్వాగతం పలికారు. వేలాది కారులతో భారీ ర్యాలీగా నగరంలో పర్యటించారు. సంపత్ వినాయక ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేసి అనంతరం ఎల్ఐసి జంక్షన్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళర్పించారు. అక్కడ నుంచి నేరుగా అనకాపల్లి చేరుకున్నారు. అంతకు ముందు విమానాశ్రయం వద్ద జరిగిన బహిరంగసభలో ప్రజలనుద్దేశించి మంత్రి గంటా ప్రసంగించారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య సమన్వయకర్తలా ఉంటానని జిల్లా సర్వతో ముఖాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతామన్నారు. ఎమ్మెల్యేలు, జిల్లాకు చెందిన మంత్రితో కలిసి టీమ్వర్క్ చేస్తామన్నారు. ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి తనపై ఉంచిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తామన్నారు. అందరి మన్ననలూ పొందే విధంగా తన వ్యవహారశైలి ఉంటుందన్నారు. రాష్ట్రానికి ఇంధనం వంటి శాఖను తనకు అప్పగిం చారని, ఆ శాఖకు తగిన న్యాయం చేస్తానని అన్నారు. గంటాకు స్వాగతం పలికేందుకు జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది తరలి వచ్చారు. వేలాది వాహనాలు విమానాశ్రయానికి చేరుకోవడంతో కోలా హలంగా మారింది. ఈ సందర్భంగా విమానా శ్రయం వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అడుగడుగునా అభిమానులు పూల మాలలతోనూ, కాంగ్రెస్ కండువాలతోనూ ముంచెత్తారు. గంటాపై పూలజల్లు కురిపించారు. మంత్రి గంటా ప్రత్యేక విమానంలో విమానాశ్రయానికి శుక్రవారం ఉదయం చేరుకున్నారు. ఆయనకు కలెక్టర్ లవ్ అగర్వాల్, పోలీస్ కమిషనర్ జె.పూర్ణచంద్రరావు, పలువురు ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. అనంతరం జిల్లాకు చెందిన ఉన్నతాధికారులను గంటాకు కలెక్టర్ పరిచయం చేశారు. విప్ కోండ్రు మురళి, మేయర్ పులుసు జనార్దనరావు, ఎమ్మెల్యేలు కన్నబాబు, ద్రోణంరాజు శ్రీనివాస్, పంచకర్ల రమేష్బాబు, చింతలపూడి వెంకటరామయ్య, ముత్తంశెట్టి శ్రీనివాస్, మళ్ల విజయప్రసాద్, తైనాల విజయకుమార్, మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావు పాల్గొన్నారు.

పార్టీ కార్యకర్తలు, అభిమానులు తాను తెలుగుదేశం పార్టీలోకి రావాలని కోరుకుంటున్నారని, వారి అభీష్టం మేరకు త్వరలోనే రాజకీయ రంగప్రవేశం చేస్తానని ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ స్పష్టం చేశారు. ఆదివారం విశాఖ పర్యటన సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆదేశిస్తే రాష్ట్రంలో ఎక్కడనుంచైనా పోటీ చేస్తానని, చిరుపైన కూడా పోటీకి సిద్ధమన్నారు. ఇటీవల మా కుటుంబంలో విబేధాలున్నట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం కాదన్నారు. పార్టీ అధిష్టానం ఆదేశాలే శిరోధార్యమని అన్నారు. అభిమానులు, కార్యకర్తలు వేర్వేరు కాదని, వారంతా అంకితభావంతో పార్టీ పురోభివృద్ధికి శ్రమిస్తున్నవారేనని అన్నారు. వారికి సరైన గుర్తింపునివ్వాల్సిన గురుతర బాధ్యత తనపై ఉందని, పార్టీలో ఇకపై ఎటువంటి పొరపాట్లూ చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటానని, కార్యకర్తలకు తగిన గుర్తింపునివ్వటం ద్వారా వారికి న్యాయం చేస్తానని అన్నారు.
విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనుల జీవితాలతో ఆడుకుందామనుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ స్పష్టం చేశారు. తాను రాజకీయాల్లోకి రావాలని అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారని, వారి అభీష్టం మేరకు త్వరలోనే తాను క్రీయాశీలక రాజకీయాల్లోకి వస్తానన్నారు. పార్టీలో ఇకపై ఎటువంటి పొరపాట్లూ జరగకుండా, అందరికీ న్యాయం జరిగేలా జాగ్రత్త తీసుకుంటానని అన్నారు. విశాఖ జిల్లాలో రెండు రోజుల పర్యటనకు వచ్చిన ఆయన ఆదివారం విశాఖ ఏజెన్సీ ప్రాంతమైన పాడేరు, మైదాన ప్రాంతమైన మాడుగల నియోజవర్గ కేంద్రాల్లో పర్యటించారు. పాడేరు జంక్షన్లోనూ, మాడుగుల జంక్షన్లోనూ ఏర్పాటు చేసిన దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అస్తవ్యస్తంగా తయారైందని, అన్నింటా కల్తీయేనని, కల్తీసారా తాగి అనేకమంది చనిపోతే ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్లుగా కూడా లేదని విమర్శించారు. ఎంతసేపూ పదవులను కాపాడుకోవటానికే తప్ప ప్రజాసంక్షేమం ఏ కోశానా లేని పాలకులకు తగిన బుద్ధి చెప్పే సమయం త్వరలోనే ఆసన్నమవుతుందన్నారు. మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలే అవినీతిని పెంచి పోషిస్తున్నారని, మద్యం సిండి’కేట్లు’గా మారుతున్నారన్నారు. మద్యాన్ని ఎమ్మార్పీకే విక్రయించాలని తెలుగుదేశం పార్టీ శతవిధాల పోరాటం సాగిస్తున్నా అధికారుల, అధికార పార్టీ ప్రతినిధుల అండ చూసుకుని మద్యం వ్యాపారులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, ఇది ఎంతో కాలం సాగదని అన్నారు. అంతకు ముందు పాడేరు గెస్ట్హౌస్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బాక్సైట్ తవ్వకాల ద్వారా బహుళజాతి కంపెనీలను ప్రోత్సహిస్తూ గిరిజనుల జీవితాలతో ఆడుకోవాలని ప్రభుత్వం చూస్తోందని, బాక్సైట్ తవ్వకాలను తెలుగుదేశం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని, అప్పుడు బాక్సైట్ తవ్వకాలకు గల అన్ని అనుమతులూ రద్దు చేస్తామని అన్నారు. తాను ఎన్టీయార్ నటవారసుడినే తప్ప రాజకీయ వారసుడిని కాదని, పార్టీ పురోభివృద్ధి కోసం అంకితభావం గల కార్యకర్తగా సేవ చేసేందుకే రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నానని, ముఖ్యమంత్రిని కావాలన్న ఆశ లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సినిమారంగం, రాజకీయరంగం రెండూ తనకు ప్రధానమేనని అన్నారు. అవకాశం వస్తే మీ సోదరి పురంధేశ్వరిపై పోటీ చేస్తారా అన్న ప్రశ్నకు సమాధానాన్ని దాటవేశారు. ఎప్పుడు రాజకీయరంగ ప్రవేశం చేస్తారన్న ప్రశ్నకు ఇంకా ముహూర్తం నిర్ణయించలేదని, త్వరలోనే చెబుతానని అన్నారు. పార్లమెంటులో ఎన్టీయార్ విగ్రహం ఏర్పాటుపై వివాదం గురించి ప్రశ్నించగా, పెద్దగా వివాదమంటూ ఏమీ లేదని, విగ్రహం ఏర్పాటుకు తనవంతు కృషి చేస్తానని బాలకృష్ణ చెప్పారు. ఆయా సభల్లో మాజీ మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, మణికుమారి, ఆర్ ఎస్డిపి అప్పలనర్సింహరాజు, మాజీ ఎంపీ పప్పల చలపతిరావు, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, సివేరి సోమ, కెఎస్ఎన్ఎస్ రాజు, గవిరెడ్డి రామానాయుడు, తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు శోభా హైమవతి తదితరులు పాల్గొన్నారు.