కర్నూలు
ఆళ్ళగడ్డ అసెంబ్లి స్థానానికి జూన్ 12న ఎన్నిక ఉండటంతో మొదటి రోజు శుక్రవారం ఆళ్ళగడ్డ తెలుగుదేశం అభ్యర్థిగా ఇరిగెల రాంపుల్లారెడ్డి రెండు సెట్ల నామినేషన్ పత్రాలను ఆళ్ళగడ్డ ఎన్నికల రీటర్నింగ్ అధికారి శంకర్కు మధ్యాహ్నం 12.30 గంట లకు అందజేశారు. ఆయన అభ్యర్థుత్వాన్ని రత్నమయ్య, దస్తగిరిరెడ్డిలు బలపరచారు. ఆళ్లగడ్డ పట్టణంలోని తెదేపా కార్యాలయం నుండి అభ్యర్థి రాంపుల్లారెడ్డిలతోపాటు మాజీ మంత్రి ఫరూక్, జిల్లా టీడీపీ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, శ్రీశైలం టీడీపీ ఇన్చార్జీ నాయకులు శిల్పా చక్రపాణిరెడ్డి ,ఇరిగెల సోదరులు రామచంద్రారెడ్డి, ప్రతాప రెడ్డి, విశ్వనాధ్రెడ్డి,గంధం భాస్కర్రెడ్డి, జున్ను ప్రసాద్రెడ్డి, రత్నమయ్య, మీరాన్ సాహెబ్ నాయకులతో కలసి తహశీల్దార్ కార్యాలయానికి చేరుకొని నామినేషన్ పత్రాలను ఆర్వోకు అందజేశారు. ఎటువంటి హంగు, ఆర్బాటం లేకుండా సాధా సీదాగా నామినేషన్ వేయడం జరిగింది. ఎన్నికల నియమావళి కఠినంగా ఉండటం వల్ల పోలీసు అధికారులు అభ్యర్థితోపాటు మరో నలుగురిని మాత్రమే కార్యాలయంలోకి అనుమతించారు. మిగిలిన వారిని వంద మీటర్ల దూరంలో వాహనాలను నాయకులను ఆపేశారు. నామినేషన్ సందర్భంగా ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా ఆళ్ళగడ్డ డిఎస్పీ ఆధ్వర్యంలో సిఐ సుధాకర్రెడ్డి, టౌన్ ఎస్సై రమేష్ బాబులు శాంతి భద్రతలను పర్యవేక్షించారు.
జిల్లాలో ఉప ఎన్నికలు జరుగనున్న అసెంబ్లిd నియోజకవర్గాలపై రాష్ట్ర ఎన్నికల కమీషన్ ప్రత్యేక నిఘా పెంచింది. ఎన్నికల నామినేషన్ రోజు నుంచి భారీగా మద్యంతో పాటు, డబ్బు, ఇతర వస్తువులను అక్రమంగా రవాణా చేసే అవకాశం ఉండడంతో ఇప్పటి నుంచే అన్ని మార్గాలలో గట్టి బంధోబస్తు ఏర్పాటు చేశారు. కొంత మంది ఆర్టీసీ బస్సులలోను , ప్రైవేటు వాహానాలు, లారీలు, ఆటోలలో ప్రయాణిస్తూ ఓటర్లను మభ్య పెట్టేందుకు గాను రాజకీయ పార్టీలు వివిధ రూపాలలో యత్నించే అవకాశాలుండడంతో ఆయా పద్దతులపై ఎన్నికల కమీషన్ దృష్టిసారించి, వాటిని నివారించే చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా కలెక్టరేట్లో ప్రత్యేక సెల్ను కూడా ఏర్పాటు చేశారు. మద్యం, డబ్బు, ఇతర వస్తువులను రవాణాకు సంబంధించిన సమాచారం తెలిసిన వారు కలెక్టరేట్లోని 08518-277162 ఫోన్ నంబర్కు తెలియజేయాల్సిందిగా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రాంశంకర్ నాయక్ శుక్రవారం సూచించారు. అలాగే నియోజకవర్గ సరిహద్దులో గట్టిపోలీసు బంధోబస్తు ఏర్పాటు చేసి, వాహనాల తనిఖీముమ్మరం చేశారు.
త్వరలో జరుగనున్న ఉపఎన్నికల్లో ఎమ్మిగనూరులో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని, కోట్ల కుటుంబం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికల్లో తమ నమ్మకం వమ్ము కాదని డోన్ మాజీ ఎమ్మెల్యే, కర్నూలు జిల్లా ఎంపి సతీమణి కోట్ల సుజాతమ్మ స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక శిల్పా ఎస్టేట్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు కోట్ల సుజాతమ్మ ఆంధ్రప్రభతో ప్రత్యేకంగా మాట్లాడారు. పట్టణంలో మహిళలతో కలిసి తాను చేపట్టిన గడపగడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో ప్రజల నుండి మంచి ఆదనణ వస్తున్నదని అన్నారు. 1955సంవత్సరంలో తన మామగారైన స్వర్గీయ కోట్ల విజయభాస్కర్రెడ్డికి రాజకీయజన్మనిచ్చిన ఎమ్మిగనూరు ప్రజలంటే తమకు ఎంతో గౌరవం ఉందన్నారు. ఎమ్మిగనూరు ఎన్నికల బరిలో కాంగ్రెస్ పార్టీ మూడవస్థానంలో ఉందన్న విమర్శలను ఆమె తీవ్రస్థాయిలో ఖండించారు. తమ కాంగ్రెస్ పార్టీది ఎప్పుడూ మొదటి స్థానమే అని, గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సాధించిన మెజారిటీ కంటే అత్యధిక మెజారిటీ ఈ ఎన్నకల్లో కాంగ్రెస్ పార్టీ సాధించి విజయశిఖరాన్ని అధిరోహిస్తుందని అన్నారు. కోట్ల కుటుంబానికి ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ ఎన్నికల్లో పార్టీ ఫండ్తమకు అక్కరలేదని, తమ స్వంతడబ్బుతో పార్టీని గెలిపించుకుంటామని కోట్లసుజాతమ్మ స్పష్టం చేశారు. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి వలనే తాము ఇన్నాళ్లు నియోజకవర్గ ప్రజలకు చేరువకాలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కూడా తాము ఎమ్మిగనూరునుండి పోటీచేసే ప్రసక్తే లేదని, శాశ్వతంగా రాజకీయాల్లో అదికూడా కాంగ్రెస్ పార్టీలో ఉండే తమకు తమ గెలుపుకన్నా కాంగ్రెస్ పార్టీ గెలుపుముఖ్యం అని అన్నారు సుజాతమ్మ. బిసిలపై నమ్మకంతో ఎమ్మిగనూరు అసెంబ్లిd టికెట్టు బిసి అభ్యర్థి అయిన రుద్రగౌడ్కు ఇప్పించామని, నియోజకవర్గ పరిధిలోని బిసిలంతా ఏకమై రుద్రగౌడ్ను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఎంతమంది నాయకులు, పార్టీలు బరిలో ఉన్నా ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు తధ్యం అని, ఈ విజయంతో కోట్ల కుటుంబం పేరు రాష్ట్రస్థాయిలోనే కాకుండా డిల్లిd స్థాయిలో చిరస్థాయిగా నిలిచిపోతుందని, ఇందుకు ప్రజలంతా తమ సహాకారాన్ని అందించాలని కోరారు.
ఐదు సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు నివాస గుర్తింపు కార్డు పొందాలని, దీని ద్వారా అన్ని రకాలుగా గుర్తింపు కార్డుగా ఉపయోగించుకోవచ్చని, భారత జనాభా రిజిస్ట్రేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ రాజు తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలోని గూడూరులోని తహాసీల్దారు కార్యాలయంలో సి.బెళగల్, కోడుమూరు, గూడూరు మండలాల కు సంబంధించిన రెవిన్యూ అధికారులతో జనాభా రిజిస్ట్రేషన్ కార్యక్రమంపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అసిస్టెంట్ డైరెక్టర్ రాజుతో పాటు ఇన్చార్జ్ తహాసీల్దారు జయప్రభ, గూడూరు డిప్యూటీ తహాసీల్దారు కుఫ్రా, ఎఎస్వో ఆదినారాయణ, ఇఎస్ఎల్ శ్రీనివాస శర్మతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ డైరెక్టర్ రాజు మాట్లాడుతూ, ఐదు సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని రిజిస్ట్రేషన్ చేసి, రెసిడెన్సీ ఐడెంటీ కార్డు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్డును ప్రతి ఒక్కరు పొందాలన్నారు. ఈ కార్డు ద్వారా దేశ పౌరునిగా గుర్తించడం జరుగుతుంది, ప్రభుత్వ సంక్షేమ పథకాలలో లబ్దిదారులకు గుర్తింపు కార్డుగా ఉపయోపడుతుందని, పాసుపోర్ట్, రేషన్ కార్డు, బ్యాంకు అకౌంట్లు తదితర వాటికే కాకుండా ఇతర అన్ని కార్యక్రమాలకు ఇది గుర్తింపు కార్డుగా ఉపయోగపడుతుందన్నారు. కావున దీనిపై ప్రజల్లో అవగాహన పెంచి, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ కార్డును పొందేలా చూడాలని ఆయన సూచించారు. అలాగే జనాభా రిజిస్ట్రేషన్ తదితర అంశాలపై ఆయన అధికారులకు క్లుప్తంగా వివరించారు.
ఉప ఎన్నికలు జరుగుతున్న ఎమ్మిగనూరు, ఆళ్లగడ్డ అసెంబ్లిd నియోజకవర్గాల సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్పోస్టులలో స్టాటికల్ సర్వే లైన్ టీవ్లుు, వీ డియో సర్వే లైన్లు టీవ్లుు తనిఖీలు ముమ్మరం చేయాలని ఎన్నికల వ్యయ పరిశీలకులు అల్వర్ట్ మనోహర్ తెలిపారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో ఎన్నికల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. జిల్లా కలెక్టర్ రాంశంకర్ నాయక్, జిల్లా ఎస్పీ చంద్రశేఖర్రెడ్డి, జాయింట్ కలెక్టర్ బుద్దప్రకాష్ ఎం.జ్యోతి, డిఆర్వో వేణుగోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నంద్యాల మూడవ పోలీసుస్టేషన్ పరిధిలోని సూలం సుబ్బయ్య పై గల కేసు విచారణకు గాను సూలం సుబ్బయ్యను పోలీసులు హైదరాబాద్ చంచల్గూడ జైలు నుండి నంద్యాల ఫస్ట్ క్లాసు మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరచారు. ఇతను మద్దెల చెరువు సూరి హత్య కేసులో నిందితుడు. ఆళ్ళగడ్డ మండలం నళ్ళగట్ల ప్రాంతానికి చెందిన సూలం సుబ్బయ్య నంద్యాల నూనెపల్లె ప్రాంతం లో నివాసం ఉంటున్న బాష అనే వ్యక్తిని సూలం సుబ్బయ్య తాను నక్సలైట్నని అబద్దమాడి బెదిరించినట్లు గ తంలో పోలీసులు కేసు నమోదు చేసిన విషయం పాఠకులకు విధితమే. ఈ కేసు విచారణకై నిందితున్ని నంద్యాల ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరచగా కేసును ఈ నెల 31వ తేదీకి వాయిదా వేస్తూ ఫస్ట్ క్టాస్ మేజిస్ట్రేట్ తెలియజేశారు.
విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ కార్మికులుగా శాశ్వత ఉద్యోగులకు సమానంగా పని చేస్తున్న కార్మికులకు వారితో పాటు సమాన వేతనం ఇవ్వాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటి ఎంప్లాయిస్ యూనియన్(యుఇఇఇ) డిమాండ్ చేసింది. సమాన వేతనాల కొరకు కొద్ది రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు శుక్రవారం బిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిరసనగా సిఐటియు జిల్లా కార్యాలయం నుండి కొత్తబస్టాండ్ మీదుగా బిక్షాటన చేస్తూ విద్యుత్ భవనం వద్దకు చేరుకున్నారు. అక్కడ ప్రతి విభాగంలో బిక్షాటన చేశారు.
ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికులు శాశ్వత ఉద్యోగులతో సమానంగా పని చేస్తూ ఇప్పటికి సమాన వేతనాలు ఇవ్వకుండా కనీస వేతనాల చట్టం స్కిల్డ్, ఫెమిస్కిల్డ్, ఆన్స్కిల్డ్ పేర్లతో కార్మికులను నిలువుదోపిడి చేస్తుందని ఆరోపించారు. క్లాస్ 7 ప్రకారం డిఎతో కూడిన వేతనాలు చెల్లించాలని, తక్షణమే జీఓ నెం. 11 ప్రకారం డిఎ 9.50 శాతం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదోని, కర్నూలు, డోన్, నంద్యాల డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు భాస్కర్, మల్లికార్జున, శ్రీనివాసులు, ప్రసన్నకుమార్, కర్రెన్న, సునీల్, ప్రభాకర్, దేవన్న, మాబు, హబీబ్బాష తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి , పిసిసి అధ్యక్షులు బొత్స సత్యనారాయణ, కేంద్ర మంత్రి వాయిలార్ రవితోపాటు పలువురు నేతల ప్రసంగాలు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో నిండు ఉత్సాహాన్ని నింపాయి. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని యర్రగుంట్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, పిసిసి అధ్యక్షులు బొత్స సత్యనారాయణ, కేంద్ర మంత్రి వాయిలార్ రవి, కాంగ్రెస్ అభ్యర్థి గంగుల ప్రతాపరెడ్డి, ఇన్చార్జీ నాయకులు గం గుల ప్రభాకర్రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలను వివరించారు. కాంగ్రెస్ వల్లనే ఆళ్ళగడ్డలో అభివృద్ది సాగుతుందని చెప్పారు. గంగుల ప్రతాపరెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించడం కోసమే శోభానాగిరెడ్డి రాజీనామా చేశారని, వీరు ప్రతాపరెడ్డిని గెలిపిస్తే ఆళ్ళగడ్డను అభివృద్ది చేయడం తాను చూసుకుంటానని , ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి కార్యకర్తలకు తెలుపడంతోపాటు బెదిరింపులకు భయపడవద్దని నిర్భయంగా ఓట్లు వేసి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించామని చెప్పిన మాటలు పార్టీ శ్రేణుల్లో నూతనోత్సవాన్ని నింపాయి.
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి తరలి వచ్చిన అశేష జనం
ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని యర్రగుంట్ల గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశానికి అన్ని గ్రామాల నుండి వేలాది మంది ప్రజలు తరలి వచ్చి ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసినందుకు ఆళ్ళగడ్డ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్థి గంగుల ప్రతాపరెడ్డి సోదరుడు గంగుల ప్రభాకర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. సమావేశం ఆలస్యంగా జరి గినా తమ కుటుంబం పై ఉన్న అపార గౌరవంతో సమావేశం ముగిసేంత వరకు ఉన్నందుకు అభినందిం చారు. ప్రతి కార్యకర్త ఈ ఉత్సాహంతో గ్రామాలకు వెళ్ళి కాంగ్రెస్ అభివృద్ది కార్యక్రమాలను వివరించాలని , కాంగ్రెస్ గెలుపుకు ప్రతి ఒక్కరు సైనికుడిగా పని చేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలను, గ్రామ నాయకులను ప్రతాపరెడ్డి కోరారు.
కర్నూలు జిల్లా నంద్యాల రెండవ పోలీసుస్టేషన్ పరిధిలోని ఎస్బిఐ కాలనీలో గురువారం తెల్లవారు జామున ఆళ్ళగడ్డ ఉప ఎన్నికల సందర్భంగా నంద్యాల డిఎస్పీ పులగిల్ల రవీందర్ ఆధ్వర్యంలో తనిఖీ నిర్వహిస్తుండగా మిని లారీలో రూ. 50 లక్షల విలువ చేసే 94 ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. టాటా 407 మిని లారీలో నంబర్ ఎపి 31 యు 1918 సుమారు 94 ఎర్రచందనం దుంగలను ఆళ్లగడ్డ , రుద్రవరం మండలాల నుండి నంద్యాల మీదుగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తుండగా పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఈ దాడిలో నిందితులు పరారీ అయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
అవినీతి కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్లకు ఉప ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని నియోజకవర్గ ఇన్ఛార్జ్ బి.వి మోహన్ రెడ్డి ప్రజలను కోరారు. గురువారం పట్టణంలోని 31 వార్డులో సుడిగాలి పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా బి.వి మాట్లాడుతూ పట్టణంలో అన్నికులాల వారికి, అన్ని వర్గాల వారికి ఇళ్ల పట్టాలు ఇప్పించామని తెలిపారు. తాగునీరు, పట్టణంలో కళ్యాణ మండపం, షాదీఖానాలు కట్టించామని చెప్పారు. కాంగ్రెస్, వైఎస్సార్ పార్టీలు అవినీతిమయంలో కూరుకుపోయాయని వారు విమర్శించారు. ఉప ఎన్నికల్లో తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా సమన్వయ కార్యదర్శి జె.తిరుపాల్ బాబు, రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి తిమ్మయ్య చౌదరి, పట్టణ నాయకులు ఉప్పర ఆంజినేయులు, ముల్లా ఇనాయతుల్లా తదితరులు పాల్గొన్నారు.
100 మంది టిడిపిలోకి చేరిక
గోనెగండ్ల మండలం ఒంటెడుదిన్నె గ్రామానికి చెందిన 100 మంది వైఎస్ఆర్సి నాయకులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బివి మోహన్ రెడ్డి, యువనేత బి.జయనాగేశ్వరరెడ్డి సమక్షంలో గురువారం తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అవినీతి మత్తులో కూరుకుపోయిందని విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారులు, నాయకులు కేవలం పదవి కోసం, డబ్బు కోసం మాత్రమే తప్పా ప్రజల కోసం పని చేయడం లేదన్నారు. కార్యక్రమంలో ఒంటెడుదిన్నె గ్రామ నాయకులు భాస్కర్ రెడ్డి, దేవదాసు, సుదర్శన్, ఎం.లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు.
కారగ్రెస్కు చరమగీతం పాడండి : మాజీ ఎమ్మెల్యే మసాల ఈరన్న
నందవరం: కాంగ్రెస్కు చరమగీతం పాడాలని మాజీ ఎమ్మెల్యే మసాల ఈరన్న ప్రజలను కోరారు. గురువారం ముగతి గ్రామంలో మండల నాయకులు మాధవరావు దేశారు, మాజీ జెడ్పిటిసి మెంబర్ ఈరన్న గౌడ్, టి.సుందరం అధ్యక్షతన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మసాల ఈరన్న మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలను విస్మరించిందని చెప్పారు. ఉపఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని కోరారు. కార్యక్రమంలో మాచాపురం పీరా, శాంతిరాజు, పెద్దయ్య, నరసింహులు, నర్సన్న పాల్గొన్నారు.