శ్రీకాకుళం


శ్రీకాకుళం జిల్లా సోంపేటలో విద్యుత్ ప్రాజెక్టు పనులను నిలిపివేసేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రోశయ్య గురువారంనాడు శాసనమండలిలో హామీ ఇచ్చారు. థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి పర్యావరణ అనుమతులపై అప్పిలేట్ ట్రిబ్యునల్ ఇచ్చిన సూచనలను అమలు చేస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అలాగే సోంపేట ఆందోళన సంఘటనలో మృతి చెందిన రైతు కూలీల కుటుంబాలకు 5 లక్షల రూపాయల పరిహారాన్ని చెల్లిస్తామన్నారు. అలాగే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అయితే ప్రభుత్వ విభాగాలలో గాక ఏదైనా కర్మాగారాలలో ఉద్యోగం కల్పించేలా చూస్తామన్నారు.
ఈ ఘటనలో గాయపడ్డవారికి వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని రోశయ్య వెల్లడించారు. మండలిలో ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టడంతో ప్రభుత్వం దిగివచ్చింది. ఈ మేరకు మధ్యాహ్నం సమయంలో మండలికి హాజరైన ముఖ్యమంత్రి ఈ సంఘటనపై హోం శాఖ తయారు చేసిన వివరణను సభకు చదివి వినిపించారు. ఈ సంఘటనపై మెజిస్టేరియల్ విచారణ చేపడతామన్నారు.
ఈ సంఘటనపై మాట్లాడుతూ ప్రాజెక్టు స్థలంలో అంతమంది పోలీసులు ఎందుకు మోహరించారన్న సందేహం తనలోనూ ఉందని సిఎం పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వచ్చిన కాసేపటి తర్వాత మండలికి హాజరైన హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోంపేట సంఘటనకు సంబంధించిన పూర్వాపరాలను, కారణాలను, ఉద్రిక్తతకు దారితీసిన పరిస్ధితులను సభకు వివరించారు. మూడు వేల మంది పోలీసులను తాము అక్కడికి పంపలేదని, అయితే పక్క జిల్లాల నుంచి పోలీసుల సహాయం తీసుకున్నది వాస్తవమేనన్నారు. మొత్తం దాదాపు మూడొందల మంది పోలీసులు ఉండి ఉంటారన్నారు. సభకు తెలియజేయకుండా వాస్తవాలను దాచి ఉంచాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ప్రభుత్వ ప్రకటన, వివరణ సంతృప్తిగా లేవన్న ప్రతిపక్షాలు.. వాకౌట్…
ముఖ్యమంత్రి చేసిన ప్రకటనతో తాము సంతృప్తి చెందడం లేదని ప్రతిపక్షాల సభ్యులు పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు కనీసం 10 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలలో ఒకరికి జూనియర్ అసిస్టెంట్ స్థాయి ప్రభుత్వోద్యోగం కల్పించాలని కోరారు. అంతేగాక ఈ సంఘటనకు బాధ్యులైన కలెక్టర్, ఎస్పీలను విచారణ పరిధిలోకి తీసుకురావాలన్నారు.
పవర్ ప్లాంట్ పనులు ఆపేస్తాం
మెజిస్టీరియల్ విచారణ వేయడం సరికాదన్నారు. తాము జ్యుడీషియల్ విచారణను కోరుతున్నామని, అంతకన్నా పై స్థాయి విచారణను చేపట్టి కలెక్టర్, ఎస్పీలను విచారించాలన్నారు. సోంపేటలో నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నదని బుధవారం నాటి సంఘటనలో పోలీసులతోపాటు వాళ్లు కూడా పాల్గొన్నారని ప్రతిపక్ష సభ్యులు దాడి వీరభద్రరావు, చెరుపల్లి సీతారాములు, పువ్వాడ నాగేశ్వర్రావు తదితరులు ఆరోపించారు.
అసలు ఆ కంపెనీకి ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఎలా ఇచ్చారో వివరణ ఇవ్వాలన్నారు. హోం మంత్రి వివరణపై ప్రతిపక్షాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాయి. వాస్తవాలను తెలుసుకోవాలని, కేవలం పోలీసు అధికారులు ఇచ్చే రిపోర్టుల ఆధారంగానే మాట్లాడడం సరికాదని పేర్కొన్నాయి. వాస్తవాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. ఈ మేరకు సోంపేట సంఘటనపై ప్రభుత్వ వివరణతోపాటు తాము కోరిన మేరకు 10 లక్షల పరిహారం, జ్యుడీషియల్ విచారణకు అంగీకరించని మేరకు తాము వాకౌట్ చేస్తున్నామని పేర్కొంటూ ప్రధాన ప్రతిపక్ష నేత దాడి వీరభద్రరావుతోపాటు సిపిఐ, సిపిఎం పార్టీల నేతలు వాకౌట్ చేశారు.

శ్రీకాకుళం జిల్లాకు గత ఆరేళ్ళ కాలంలో 85 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తేవటం ద్వారా గర్వపడుతున్నానని.. తాను సిగ్గుపడాల్సిన అవసరంలేదని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు. మనలాంటి బాధ్యతలేని పార్టీల వల్ల అభివృద్ధికి వ్యతిరేకంగా ఉద్యమాలు వస్తున్నాయని అన్నారు. ప్రాజెక్టుల సాధనకు సంబంధించి చేసే ప్రయత్నంలో నాలుగు ఓట్లు పోయినా పర్వాలేదు కానీ..తాను భయపడనని చెప్పారు. విశాఖపట్నంలోని సింహాద్రి పవర్ ప్రాజెక్టు, విజయవాడలోని కెటిపిఎస్, రామగుండంలోని థర్మల్ ప్రాజెక్టుల వల్ల ఎలాంటి ప్రమాదం తలెత్తిందని ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు. దేశంలో 14800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంటే..అందులో 1.05 లక్షల మెగావాట్లు థర్మల్ విద్యుతేనని..థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులు ప్రాణాలు తీస్తే దేశంలోనే ప్రజల మనుగడే ఉండేదికాదన్నారు. «థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులపై ఎలాంటి నిషేధం కూడా లేదన్నారు. శ్రీకాకుళం జిల్లా సోంపేటలో బుధవారం జరిగిన కాల్పుల ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన ఘటనకు సంబంధించి ధర్మాన ప్రసాదరావు తనపై విపక్షాలు చేసిన విమర్శలకు శాసనసభలో సుదీర్ఘ వివర ణ ఇచ్చారు. కాల్పుల ఘటనను ఏ ఒక్కరూ హర్షించరని అన్నారు. ఎవరిది తప్పు అయినా ప్రాణాలు పోవటం బాధాకరం అని వ్యాఖ్యానించారు. ఈ మరణాలను ప్రభుత్వం కోరుకోలేదన్నారు. ప్రతిపక్షాలు కోరినట్లు ధర్మాన ప్రసాదరావు రాజీనామా చేసినా..చేయకపోయినా రాష్ట్రంలో ఏమీ మునిగిపోదన్నారు. శ్రీకాకుళం జిల్లా వారికి ఇతర ప్రాంతాల వారిని చూస్తే అసూయ కలుగుతుందని…తమ జిల్లాలో ఇంటర్మీడియట్, డిగ్రీ చదివిన వారుకూడా మూట చేతపట్టుకుని ఉపాధి అవకాశాల కోసం ఇతర ప్రాంతాలకు వెళతారని చెప్పారు. అప్పటి వరకు కనిపెంచిన తల్లిదండ్రులు తిండి పెట్టడం సంగతలా ఉంచి.. వారు పొట్టనింపుకోవటం కోసం వలస వెళ్ళేవారన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఒక్క ప్రధాన పరిశ్రమ కూడా లేదన్నారు. కొత్తగా చేపట్టే థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల వల్ల తమ ప్రాంతంలోని వారికి ఉద్యోగాలు వస్తాయని..కొత్తగా టౌన్షిప్స్ అభివృద్ధి అయి…ఆర్థిక కార్యకలాపాలు పెరగాలని కోరుకోవటం త ప్పా? అని ప్రశ్నించారు. థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులతో ప్రాణాలు పోతాయన్న విధంగా మాట్లాడటం సరికాదని.. తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో ద్వంద వైఖరి అవలంభిస్తోందని ఆరోపించారు. ఆ పార్టీ టీడీపీపీ నేత నామా నాగేశ్వరరావు స్వయంగా థర్మల్ పవర్ ప్రాజెక్టు పెడుతున్నారని..ఇది తప్పని భావిస్తే ఆయన్ను పార్టీ నుంచి బయటకు పంపిస్తారా? అని ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లాలోని ఆ పార్టీ నేతలు ఇలాగే వ్యవహరిస్తున్నారని చెప్పారు. నాగార్జునా కన్స్ట్రక్షన్కు చెందిన థర్మల్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం ఒక్క సెంటు భూమి కూడా సేకరించలేదని..ఇవి పూర్తిగా వ్యవసాయానికి పనికిరాని బేల భూములన్నారు. ఈ ప్రాజెక్టు కోసం ఒక్క గ్రామాన్ని కూడా తరలించలేదన్నారు. థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు వల్ల ప్రాణాలు పోతాయని కొంత మంది అమాయక ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు. పర్యావరణ అనుమతులు వస్తేనే శ్రీకాకుళం థర్మల్ ప్రాజెక్టు వస్తుందని చెప్పారు. సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కాంగ్రెస్ పార్టీపై చేసిన విమర్శల ప్రస్తావిస్తూ తనకు నటించాల్సిన అవసరంలేదన్నారు. ప్రజా జీవితంలోఉన్నాం. కించపర్చినా బాథపడటం లేదు. ఎవరైనా కొంత మంది అమాయకులు ఉద్యమాలు చేస్తే రెండు జెండాలు పట్టుకుని వెళ్ళి ముందు నుంచుని మీరు సీపీఐ జిందాబాద్ అంటారు. ఈ కక్కుర్తి వద్దు అంటున్నాను. ఇది కాదు రాజకీయ పార్టీలకు కావాల్సింది అంటూ ఎద్దేవా చేశారు.

శ్రీకాకుళంజిల్లా, సోంపేటలో గురువారం కూడా ఉద్రిక్తత నెలకొంది. థర్మల్ ఫ్లాంట్కు అనుకూలంగా ఉన్న నేతల ఇళ్లపైకి ఈరోజు స్థానికులు దాడులు నిర్వహించారు.
స్థానిక కాంగ్రెస్ ఎంపీటీసీ రమణమూర్తి ఇంటిపై ఆందోళనకారులు దాడి చేసి ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. అలాగే శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే గౌతు శ్యామ్సుందర్ శివాజీ ఇంటికై కూడా నిరసనకారులు దాడిచేశారు. ప్రస్తుతం పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తుంది. పోలీసులు భారీగా మోహరించారు.

రాష్ట్రంలో మత్స్యకారుల పరిస్థితి దయానీయంగా మారిందని తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళంజిల్లా సోంపేట ఘటనలో బాధితులను పరామర్శించేందుకు బాబు గురువారం బయలుదేరి వెళ్ళారు.
విశాఖ విమానాశ్రయంలో దిగిన ఆయన మీడియాతో మాట్లాడుతూ మత్స్యకారులకు మద్ధతుగా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ఆందోళన కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు. ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థను భూస్వామ్య వ్యవస్థగా మార్చిందని ధ్వజమెత్తారు. దివంగిత వై.ఎస్. హయాం నుంచే సెజ్ల పేరిట వేల ఎకరాలను దారాదత్తం చేశారని పేర్కొన్నారు. సోంపేట ఘటనకు ముఖ్యమంత్రి రోశయ్య, హోమంత్రి సబితా ఇంద్రారెడ్డి, రెవెన్యూశాఖమంత్రి ధర్మానప్రసాదరావులే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మూడు వేల మంది పోలీసులతో సోంపేట పరిసర ప్రాంతాల్లో కవాతు నిర్వహించారని, ఈ విషయం ప్రభుత్వానికి తెలియకుండా జరిగిందా అని ప్రశ్నించారు.

శ్రీకాకుళం జిల్లా, సోంపేట మండలం రక్తసిక్తమైంది.థర్మల్ పవర్ప్లాంట్ పుణ్యమా అని ఇద్దరు మత్స్యకారులు బలయ్యారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా వుంది. మరెందరో గాయపడ్డారు. పోలీసుల అత్యుత్సాహం, నాయకుల ద్వంద్వవైఖరి,వంతపాడిన అధికారయంత్రాంగం ఈ అనర్ధానికి కారణం. సోంపేట బీలప్రాంతంలో థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు ద్వారా పర్యావరణం పాడు చెయ్యొద్దంటూ గత కొన్నాళ్లుగా సాగుతున్న పోరాటం తీవ్ర రూపం దాల్చింది. బుధవారం నిర్మాణా నికి ముందుకొచ్చిన నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ పనులు ప్రారంభానికి పూను కోవడంతో ఆందోళన కారులు ఆ పనులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
పనులను అడ్డుకోరాదని పోలీసులు చేసిన ముందస్తు హెచ్చరికలను ఖాతరు చేయని ఆందోళన కారులు పెద్ద ఎత్తున బీల ప్రాంతానికి చేరుకోవడం తో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పనులు ప్రారంభించడానికి ముందే అన్ని జాగ్రత్త తో వర్కర్లను తరలించిన నిర్మాణ కంపెనీ ఆ ప్రాంతంలోప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసింది. హద్దులు పాతాలనే పేరుతో కర్రలతో సిద్ధంగా వున్న వారిపై లక్కవరం , పలాసపురం, గొల్లగండి,బెంకిలి, జింకిబద్ర, ఇసుకలపాలెంకు చెందిన ఆందోళనకా రులు దూసుకెళ్లారు. తొలుత పోలీసులు, వర్కర్లు వారిని వెంబడించడంతో మొదట్లో వెనక్కి తగ్గిన ఆందోళనకారులు సంఖ్య పెరిగిన కొద్దీ మరోమారు తిరగబడ్డారు. అప్పటికే భారీ గా మోహరించిన పోలీసు బలగాలు వారిపై నాలుగు రౌండ్లు బాష్ప వాయువు ప్రయోగించారు.


అయినా ఆందో ళనకా రులు లెక్కచేయకపోవడంతో లాఠీలకు పనిచెప్పా రు. మరోవైపు లక్కవరం సమీపంలో ఆందోళనకా రులు పోలీసులపైకి రాళ్ళు రువ్వారు.అంతటితో ఆగక పోలీసు వాహనాన్ని దగ్ధం చేశారు.మీడియా ప్రతినిధుల బైక్లను దగ్ధం చేశారు. అడ్డొచ్చిన వారిని గాయపపరిచారు. దీంతో పోలీసులు పేట్రేగి పోయారు.ఈ సంఘ టనలో బారువ ఎస్ఐతో పాటు 50 మంది పోలీసులు, 62 మంది ఆందో ళనకారులు గాయప డ్డారు. వెంటనే 144 సెక్షన్ అమల్లోకి తెచ్చారు. కాల్పులు ప్రారంభించారు. ఈ కాల్పుల్లో సోంపేట మండలం, లక్కవరానికి చెందిన గొనప కృష్ణమూర్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పలాసపురం గ్రామానికి చెందిన పండి జోగారావు శ్రీకాకుళం రిమ్స్ లో ప్రాణాలు కోల్పోగా బడ్డి విశ్వనాధం విశాఖ కెజిహెచ్లో మృత్యువుతో పోరాడుతున్నారు. మరొకరి పరిస్థితి విషమంగా వుంది.

శ్రీకాకుళం ఉద్యమ చరిత్రలో రక్త చారికలు
మొదటి నుంచి ఈ ప్రాంతంలో థర్మల్ పవర్ ప్రాజెకున్టు వ్యతిరేకిస్తూ నిరాహారదీక్షలు, ఆందోళ నలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంత పెద్ద ఎత్తున ఈ ఉద్యమం లేవడం వెనుక ఈ ప్రాంతంలో గతం లో చేసిన ఉద్యమాలే పునాదిగా నిలిచాయి. సర్ధా ర్ గౌతు లచ్చన్న జన్మస్థలమైన ఈ మండలం అనేక ఉద్యమాలకు పుట్టినిల్లు.అటువంటి ఈ ప్రాంతంపై కార్పొరేట్ రంగం కన్నేసింది. 2640 మెగా వాట్లు విద్యుత్ సామర్ధ్యంతో నాగార్జున కన్స్ట్రక్షన్స్ కంపె నీ సోంపేట మండలం బీలా ప్రాంతంలో విద్యుత్ ప్లాంటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి పొం దింది. దాదాపు 12 వేల కోట్ల రూపాయలతో ఈ ప్లాంటు నిర్మాణం చేపట్టడానికి ఆ సంస్థ అన్ని ఏర్పాట్లు చేసుకుంది.


ఒక పక్క పర్యావరణ అను మతులు కోసం దరఖాస్తులు చేసుకుంటూనే , మరో వైపు భూసేకరణ పనులు పూర్తి చేసింది. ప్రాజెక్టు కోసం ప్రభుత్వం 900 ఎకరాలు కేటాయించింది. సంస్థ రైతుల నుంచి మరో 400 ఎక రాలు సేకరించింది.ప్రాజెక్టు పనులు ప్రారంభించ డానికి సంసిద్ధమవుతున్న తరుణంలో స్థానిక ప్రజల నుంచి ఉవ్వెత్తున ఉద్యమం లేచింది. ఈ ప్రాంతంలో దాదాపు 15 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. మరోవైపు ఉద్దాన ప్రాంతం ఇమిడి ఉం ది. మత్స్యకారుల జీవన పరిస్థితులు ఈ ప్రాజెక్టు తో దెబ్బతింటాయని, సముద్రంలో దొరికే చేపలు పూర్తిగా నాశనమవుతాయని వారి వాదన.
పుట్టే పిల్లలు సైతం అంగవైకల్యం బారిన పడతారన్న అనుమానాలు లేవదీశారు. రైతుల పంటలు దెబ్బ తింటాయని, కాలుష్యం కోరల్లో ఈ మండలం చిక్కుకుని విలవిలాడుతుందని పర్యావరణ వేత్త లు హెచ్చరించారు. దీంతో పర్యావరణ పరిరక్షణ సమితి పేరుతో దాదాపు 200 రోజులు నిరాహార దీక్ష శిబిరాన్ని కొనసాగించారు.బొగ్గు ప్రధాన ఇం ధనంగా ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టుకు ఒరిస్సా రాష్ట్రం మహానంది నుండి బొగ్గు తెప్పించు కోడానికి కోల్డ్ఫీల్డ్గా ఎంచుకున్నారు. సముద్ర మార్గం, రైలు మార్గం ఇక్కడ అనుకూలంగా ఉండ డంతో ఈ ప్రాంతం అనువైనదిగా భావించారు.
ఉద్యమానికి దారి తీసిన పరిస్థితులు
సోంపేట బీలా వద్ద నెలకొల్పనున్న పవర్ ప్రాజెక్టు కు అనేక అడ్డంకులు మొదటి నుంచి ఏర్పడ్డాయి. స్థానిక ప్రజలను, మత్స్యకారులను పూర్తిగా ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. పవర్ ప్రాజెక్టు వల్ల లాభనష్టాలను వివరించడంలో ఏ ఒక్కరూ ముం దుకు రాలేకపోయారు. ఎన్సిసి యాజమాన్యం కూడా అందరినీ నయానో, భయానో, ఆర్థికంగానో సహాయపడి లొంగదీసుకోడానికే ఉత్సుకత చూ పింది. ఆందోళన చేస్తున్న వారిని అరెస్ట్ చేయిం చడం లాంటి ఎత్తుగడలనే అవలంభించింది. ఉద్య మంలో ఉన్న వారు కూడా వ్యక్తిగత లాభా పేక్షతో ఆందోళన చేపట్టినా ఆఖరకు ఆ ఉద్యమం ప్రజలు చేతికి వెళ్ళిపోయింది. దీంతో ప్రజలు కూడా వెనుకడుగు వేసే పరిస్థితి లేకపోయింది.
అంతర్జా తీయ పర్యావరణ వేత్త మేథాపాట్కర్ కూడా ఆం దోళన కారులకు బాసటగా నిలిచారు. మరో వైపు పవర్ ప్రాజెక్టు వల్ల వినాశనం జరుగుతుందన్న వాదన గ్రామాల్లోకి వెళ్ళిపోయింది. ఆందోళన కారులతో సమావేశమైనపుడు ఉద్యమకారులు సంధించిన ప్రశ్నలకు అధికారులు నీళ్ళునమిలా రు. పై పెచ్చు ఈ ప్రాజెక్టు వల్ల కేవలం 150 మం దికి మాత్రమే ఉపాధి అవకాశాలు లభ్యమవుతా యని ప్రాజెక్టు యాజమాన్యం చెప్పిన మాటలు తూటాల్లా పనిచేశాయి.
రెండుగా విడిపోయిన పార్టీలు
థర్మల్ ప్రాజెక్ట్ ఏర్పాటు విషయంలో జిల్లాలోని ప్రధాన పార్టీలయిన కాంగ్రెస్, తెలుగుదేశం రెం డుగా విడిపోయాయి. తెలుగుదేశం , కాంగ్రెస్, ప్రజారాజ్యం పార్టీలో నేతలు కొందరు ఔనంటే , మరికొందరు వద్దని రెండు వర్గాలుగా చీలిపోయా రు. తెలుగుదేశం పార్టీలోనే రెండు వర్గాలుగా నేత లు వ్యవహరించారు. ఈ ప్రాంతంలో మంచి పట్టు న్న గౌతు లచ్చన్న కుమారుడు, మాజీ మంత్రి గౌతు శ్యామసుందర శివాజీ థర్మల్ ప్లాంటుకు అనుకూ లంగా మారారు. ఇదే పార్టీ నుంచి శాసన సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఇచ్చాపురం ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ ఉద్యమానికి నాయకత్వం వహించారు. పర్యావరణ నేతలు, మత్స్యకార సం ఘాలు పిరియా సాయిరాజ్ వెన్నంటే నడిచారు.
కాగా రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు మొద టి నుండి విద్యుత్ ప్లాంటు తప్పని సరిగా ఏర్పా టు చేస్తానని, ఇందుకు ఎవరు వ్యతిరేించినా అణచివేస్తామంటూ హెచ్చరించారు. దీంతో మరిం త రెచ్చిపోయిన ఉద్యమకారులు ధర్మాన కాన్వాయ్ ను అడ్డుకొని అసంతృప్తిని బహిరంగపర్చారు. పార్లమెంటు సభ్యురాలు కిల్లి కృపారాణి ని కూడా ఆందోళన కారులు నిలదీశారు. ఇంత జరుగుతు న్నా ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేదు. పైగా ఉద్యమాన్ని అణచివేసే ధోరణిని ప్రదర్శించ డంతో ప్రభుత్వం పై అనేక అపోహాలు ఏర్పడ్డాయి. ప్రజా ఉద్యమంలో పాల్గొన్నారన్న ఆరోపణలతో ఐదుగురు ఉపాధ్యాయులను అక్రమ బదిలీలతో పాటు పర్యావరణ పరిరక్షణ సమితి నేతలను అరెస్టు చేయించడంతో ఉద్యమకారులు భగ్గుమన్నా రు. మరో వైపు ఈ ప్రాంతంలో కరపత్రాల దుష్ట సంప్రదాయం ఉవ్వెత్తున లేచింది. ఎవరికి అను కూలంగా వారు కరపత్రాలు వేయడంతోనే ఆగ కుండా ప్రత్యర్ధులపై ఆరోపణలు సంధిస్తూ వచ్చారు.
అధికారుల పాత్ర సాధారణంగా ఉద్యమాల్లో స్థానిక ప్రజల మనోభావాలను జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి నివేదిస్తుంది.తదనుగుణంగా ప్రభు త్వ నిర్ణయాలు ప్రతిబింబిస్తాయి. అయితే ఎక్కడ ఎవరు తప్పు చేశారోగాని స్థానిక ప్రజల మనో భావాలకు, జరుగుతున్నదానికి పూర్తి భిన్నంగా మారిపోయింది. దీంతో ప్రభుత్వం పైనే కాకుండా అధికారుల తీరుపై కూడా ఉద్యమకారులు ఆవేశంతో ఉన్నారు. ఎంత సేపు తమకు నచ్చజెప్పే ప్రయత్నమే తప్ప ఆపే ప్రయత్నం చేయలేదని ఉద్యమకారులు పలు సందర్భాల్లో అధికారులను విమర్శిస్తూ వస్తున్నారు.
దురదృష్టకరం – సీఎం
హైదరాబాద్, మేజర్న్యూస్ : సోంపేట సంఘటన దృరదృష్టకరమని రాష్ట్ర ముఖ్యమంత్రి కొణి జేటి రోశయ్య పేర్కొన్నారు. ఘటనకు సంబంధించి దోషులపై చర్యలు తీసుకుంటామన్నారు. గురు వారం అసెంబ్లీలో దీనిపై వివరణ ఇస్తామని చె ప్పారు. బుధవారం రాత్రి ఢిల్లీ నుంచి వచ్చిన సీఎం హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, చీఫ్ సెక్రటరీ ఎస్వీ ప్రసాద్, డీజీపీ గిరీష్ కుమార్లతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి సోంపేట ఘటనపై సమీక్షించారు. అనంతరం ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లా డుతూ సోంపేట ఘటనలో ఇద్ద రు ఆందోళన కారులు మృతి చెందగా, 150 మంది గాయప డ్డారని చెప్పారు. ఇందులో 65 మంది పోలీసు లున్నారన్నారు. ఇక్కడ ఆరు నెలలుగా గొడవలు జరుగుతున్నాయని చెప్పారు. కావాలని ఎవరూ కాల్పులు జరపరని ఆయన వ్యాఖ్యానించారు.

సోంపేటలో రైతులపై కాల్పులకు సంబంధించి పోలీసులు, పవర్ప్లాంట్ యాజమాన్యాలపైన హత్యకేసు పెట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు డిమాండ్ చేశారు. కాల్పుల ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, దీనికి సీఎం రోశయ్య సమాధానం చెప్పాలని అన్నారు.
అక్కడ ప్లాటును రైతులు వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం ఎందుకు మూర్ఖంగా పోతుందని, 400 మంది పోలీసులను ఎందుకు ప్రయోగించిందని ప్రశ్నించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ప్రజల్ని లొంగదీసుకోవాలనే కుట్రలో భాగంగానే కాల్పులు జరిపారని ఆరోపించారు.
ఇప్పటి వరకు పర్యావరణ అనుమతే రాకున్నా పనులు ప్రారంభించాల్సిన అవసరం కంపెనీలకు ఎందుకొచ్చిందన్నారు. వెంటనే అక్కడి నుంచి పోలీసు బలగాలను ఉపసంహరించాలని, ఆ కంపెనీల అనుమతి రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాల్పుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటిచాలని, క్షతగాత్రులను ఆదుకోవాలని అన్నారు.

శ్రీకాకుళం జిల్లా సోంపేట ఘటనలో ప్రభుత్వం, పోలీసులే ముద్దాయిలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. ఈ సంద్భంగా బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ థర్మల్ పవర్ ప్లాంట్ శంకుస్థాపనను అడ్డుకున్న స్థానికులపై పోలీసులు కాల్పులు జరపడం దారుణమని, ప్రజా ప్రయోజనాలను కాపాడవలసిన ప్రభుత్వమే ఇలా చేయడం సరికాదని, ప్రభుత్వం దీనికి తగిన మూల్యం చెల్లించక తప్పదని అన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని నారాయణ డిమాండ్ చేశారు.

శ్రీకాకుళం జిల్లా సోంపేటలో స్థానికులపై పోలీసులు కాల్పులు జరపడాన్ని ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి ఖండించారు. ఈ సంద్భంగా బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాల్పుల ఘటన చాలా బాధకరమని, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తక్షణం ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చిరంజీవి డిమాండ్ చేశారు.

శ్రీకాకుళం జిల్లా సోంపేటలో థర్మల్ పవర్ ప్లాంట్ శంకుస్థాపనను బుధవారంనాడు స్థానికులు అడ్డుకోవడంతో పరిస్థితిని అదుపుచేయడానికి పోలీసులు కాల్పులు జరపడంతో ఇద్దరు మత్స్యకారులు మరణించారు. పోలీసులు పది రౌండ్లు కాల్పులు జరిపినట్టు తెలిసింది. పోలీసు కాల్పులను గ్రామస్థులు రాళ్లతో అడ్డుకున్నారు. ఈ సంఘటనలో ఒక సి.ఐ.తో సహా నలుగురు పోలీసులకు గాయాలయ్యాయి. అలాగే ఐదుగు మీడియా ప్రతినిధులు కూడా గాయపడ్డారు. పరిస్థితి చేజారిపోతున్న విషయాన్ని గమనించి హోమ్ శాఖ నాలుక కరుచుకుని పోలీసులను వెనక్కు పిలుస్తున్నట్టు సమాచారం అందుతున్నది.
ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తలతో ఉన్న ఆ ప్రాంతం మొత్తాన్ని పోలీసులు దిగ్బంధించారు. అయితే స్థానికులు ఇంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయాన్ని సకాలంలో నిఘా విభాగం గుర్తించకపోవడాన్ని హోమ్ శాఖ తీవ్రంగా పరిగణిస్తున్నట్టు తెలుస్తున్నది. బుధవారం జరిగిన సంఘటనలో సుమారు 30 మంది స్థానికులు గాయపడినట్టు తెలుస్తున్నది. వీరిలో నలుగురి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ (ఎన్.సి.సి.) అక్రమ నిర్మాణం చేపట్టడం చట్టవ్యతిరేకం, ఈ చట్ట వ్యతిరేక చర్యే కాల్పుల వరకూ దారితీసిందని మానవ హక్కుల వేదిక కార్యదర్శి వి.ఎస్. కృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతం మొత్తం సహజసిద్ధమైన పర్యావరణానికి నిలయమని, అటువంటి ప్రాంతంలో చెట్లన్నిటినీ నరికేసి ఇలా ప్రాజెక్టు నిర్మించడం దారుణమని ఆయన అన్నారు.
సోంపేటలో జరుగుతున్న పోలీసు కాల్పుల గురించి రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు తెలియనివ్వరాదనే ఉద్దేశంతో పోలీసులు జర్నలిస్టులను కూడా గట్టిగా అడ్డుకున్నారు. పోలీసు లాఠీఛార్జిలో ఎ.బి.ఎన్. ఆంధ్రజ్యోతి విలేఖరి కెమేరా కూడా ధ్వంసమైంది. సోంపేటలో ఉదయంనుంచే పరిస్థితి చేజారిపోతున్నదంటూ స్థానిక మత్స్యకారులపై అడ్డుకోవడానికి పోలీసులు లాఠీ ఛార్జి ప్రయోగించారు. బాష్పవాయువు కూడా ప్రయోగించారు. అనంతరం వారు గాలిలోకి కాల్పులు జరిపారు. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ఇంతలో కొందరు స్థానికులు పోలీసు వ్యానులకు నిప్పు పెట్టారు.
ప్రస్తుతం సోంపేట పోలీసు దిగ్బంధంలో ఉంది. ఎన్.సి.సి. బుధవారంనాడు థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని నిర్ణయించుకోవడంతో, స్థానికుల ఆందోళనను దృష్టిలో ఉంటుకుని అధికారులు ముందుగానే పెద్ద ఎత్తున పోలీసు బలగాలను దించారు. ఎన్.సి.సి. ఈ ప్రాజెక్టు భూభాగంగా భావించిన స్థలం చుట్టూ కంచె వేయడానికి యత్నించడంతో స్థానిక మత్స్యకారులలో ఆందోళన పెరిగింది.
వారు కంచె నిర్మించడానికి వీలు లేదని భీష్మించగా, ఎన్.సి.సి. యాజమాన్యం స్థానికులపై బలప్రయోగం చేసినట్టు తెలిసింది. అనంతరం స్థానికులు ఎన్.సి.సి. కార్యాలయంలోకి వెళ్లి అక్కడున్న ఫర్నిచర్ను దగ్ధం చేశారు. అలాగే వారిని అడ్డుకోవడానికి యత్నించిన పోలీసులపై రాళ్లు విసిరారు. కర్రలతో తిరగబడ్డారు. స్థానికుల దాడిలో కొంతమంది మీడియా సిబ్బందికి కూడా గాయాలయ్యాయి. పోలీసుల వద్ద రబ్బరు తూటాలు మాత్రమే ఉన్నందువల్ల ఎవరూ మరణించే అవకాశం లేదని పోలీసు ఉన్నతాధికారులు ముందు చెప్పారు. అయితే ఆ తర్వాత కాల్పుల్లో ఇద్దరు మరణించిన మాట వాస్తవమేనని పోలీసు అధికారులే ధ్రువపరిచారు.

రాష్ట్రంలో వర్షాలు సాధారణ స్థాయి కన్నా ఎక్కువగా కురుస్తున్నాయి. సకాలంలో రుతుపవనాలు రావడం, మధ్యలో రెండుసార్లు అల్పపీడనాలు ఏర్పడడంతో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఏకంగా 18 జిల్లాల్లో సాధారణ వర్షపాతం కన్నా అధికంగా కురవగా, ఒక్క అదిలాబాద్ జిల్లాలో మాత్రమే తక్కువగా వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలతో అనేక జిల్లాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కాగా, ఆదివారం ఉదయం నమోదైన వర్షపాతం మేరకు అనంతపురం జిల్లా ధర్మవరంలో ఏకంగా 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదుకావడం విశేషం. అనంతపురం పట్టణంలో కూడా 12 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అలాగే కర్నూలు జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం తెల్లవారు జామున విస్తారంగా వర్షాలు కురిశాయి. భారీ వర్షంతో నంద్యాల పట్టణంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారి నీట మునిగింది. అవుకు రిజర్వాయర్లోకి భారీగా నీరు చేరుతోంది. ఉయ్యాలవాడ మండల పరిధిలోని ఇంజేడు గ్రామ సమీపాన గల కుందర వాగు పొంగిపొర్లుతోంది.
రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తుండడంతో చెరువులు నిండుతున్నాయి. వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తుండటం, నదుల్లోకి నీరు భారీగా చేరడంతో జలాశయాలు కొత్తశోభను సంతరించుకుంటున్నాయి. ఎప్పుడూ లేని విధంగా గోదావరి, కృష్ణా నదులపై ఉన్న కొన్ని డ్యామ్ల వద్ద అప్పుడే గేట్లు ఎత్తివేసి నీటిని సముద్రంలోకి వదిలేయాల్సిన పరిస్థితి కూడా నెలకొనడం మంచి పరిణామంగానే చెప్పవచ్చు. అయితే భారీ వర్షాలతో అనేక చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. నదుల్లోకి నీరు చేరుతుండడంతో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. వర్షాల వల్ల ఎటువంటి సమస్యలు రాకుండా అన్ని జిల్లాల అధికారులు ఆప్రమత్తంగా ఉండాలన్న ఆదేశాలు వెళ్లాయి. హైదరాబాద్ నగరంలో ఆదివారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి రోడ్లన్నీ గుంతలుపడ్డాయి. నడిచేందుకు కూడా అవకాశం లేని విధంగా రోడ్లు మారిపోయాయి.
గత నెల రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించి వర్షాకాలం ప్రారంభమైన తరువాత ఇప్పటివరకు అనేక ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదైంది. కోస్తా ఆంధ్రాలోని అన్ని జిల్లాల్లో సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదుకాగా, రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. అయితే తెలంగాణలో మాత్రం కొంత వర్షపాతం తక్కువగా ఉంది. ఈ ప్రాంతంలోని హైదరాబాద్, ఖమ్మం, మెదక్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో సాధారణం కన్నా ఎక్కువగా వర్షం కురవగా, వరంగల్, నిజామాబాద్, మహబూబ్నగర్, కరీంనగర్ జిల్లాల్లో సాధారణ వర్షపాతం మాత్రమే నమోదైంది. ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం సాధారణ స్థాయి కన్నా తక్కువగా వర్షం కురిసింది. ఇక్కడ జూలై నెల్లో ఇప్పటివరకు 234 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా, కేవలం 174 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది.
ఇక శనివారం తెల్లవారుజాము నుండి అనేక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. అత్యధికంగా ధర్మవరంలో వర్షం కురియగా, అనంతపురంలో 12, మాచెర్లలో 10, జమ్మలమడుగులో 8, హైదరాబాద్, ములుగు, నర్సంపేట, పరిగి ప్రాంతాల్లో 7 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. అలాగే బాపట్ల, చిలమత్తూరు, భద్రాచలం, పులివెందుల్లో 6, దుమ్ముగూడెంలో 5, చేవెళ్ల, గోల్కొండ, వెంకటగిరి కోటల్లో 4, హకీంపేట, మచిలీపట్నం, ఆళ్లగడ్డ, అచ్చంపేట, నాగార్జునసాగర్ డ్యామ్, హిందుపురంలో 3, రెంటచింతల, కదిరి, పుత్తూరు, కళ్యాణదుర్గం, పెనుకొండ, తాడిపత్రి, గుడివాడ, కాళేశ్వరం, కుప్పం తదితర ప్రాంతాల్లో 2 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. అనేక ఇతర ప్రాంతాల్లో కూడా సెంటీమీటర్ కన్నా అధికంగానే వర్షపాతం నమోదైంది.
కాగా, మరో రెండు రోజులపాటు ఉత్తరాంధ్ర జిల్లాలు, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో, కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. హైదరాబాద్ నగరంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో రెండు రోజులపాటు మబ్బులు కమ్ముకుని విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
వాగులో పడ్డ బస్సు .. ప్రయాణికులు క్షేమం
అనంతపురం జిల్లాలో శనివారం రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. బత్తలపల్లి మండలం పోట్లమర్రి గ్రామం వద్ద డూపులేట్ వాగు ఉద్ధృతికి తాళలేక ఆదివారం ఉదయం వరంగల్ నుండి వస్తున్న పుట్టపర్తి డిపో బస్సు బోల్తా పడింది. అయితే డ్రైవర్, కండక్టర్ చాకచక్యంగా వ్యవహరించి గ్రామస్తుల సహాయంతో 29 మంది ప్రయాణికులను సురక్షితంగా కాపాడారు. ప్రయాణికుల తొక్కిసలాటలో నలుగురికి స్వల్పగాయాలయ్యాయి. హైదరాబాద్కు చెందిన వరలక్ష్మి అనే మహిళకు తీవ్రగాయాలవడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు.