విజయనగరం

రాష్ర్టంలో విస్తారంగా వర్షాలు

12.07
రాష్ట్రంలో వర్షాలు సాధారణ స్థాయి కన్నా ఎక్కువగా కురుస్తున్నాయి. సకాలంలో రుతుపవనాలు రావడం, మధ్యలో రెండుసార్లు అల్పపీడనాలు ఏర్పడడంతో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఏకంగా 18 జిల్లాల్లో సాధారణ వర్షపాతం కన్నా అధికంగా కురవగా, ఒక్క అదిలాబాద్ జిల్లాలో మాత్రమే తక్కువగా వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలతో అనేక జిల్లాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కాగా, ఆదివారం ఉదయం నమోదైన వర్షపాతం మేరకు అనంతపురం జిల్లా ధర్మవరంలో ఏకంగా 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదుకావడం విశేషం. అనంతపురం పట్టణంలో కూడా 12 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అలాగే కర్నూలు జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం తెల్లవారు జామున విస్తారంగా వర్షాలు కురిశాయి. భారీ వర్షంతో నంద్యాల పట్టణంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారి నీట మునిగింది. అవుకు రిజర్వాయర్‌లోకి భారీగా నీరు చేరుతోంది. ఉయ్యాలవాడ మండల పరిధిలోని ఇంజేడు గ్రామ సమీపాన గల కుందర వాగు పొంగిపొర్లుతోంది.
రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తుండడంతో చెరువులు నిండుతున్నాయి. వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తుండటం, నదుల్లోకి నీరు భారీగా చేరడంతో జలాశయాలు కొత్తశోభను సంతరించుకుంటున్నాయి. ఎప్పుడూ లేని విధంగా గోదావరి, కృష్ణా నదులపై ఉన్న కొన్ని డ్యామ్‌ల వద్ద అప్పుడే గేట్లు ఎత్తివేసి నీటిని సముద్రంలోకి వదిలేయాల్సిన పరిస్థితి కూడా నెలకొనడం మంచి పరిణామంగానే చెప్పవచ్చు. అయితే భారీ వర్షాలతో అనేక చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. నదుల్లోకి నీరు చేరుతుండడంతో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. వర్షాల వల్ల ఎటువంటి సమస్యలు రాకుండా అన్ని జిల్లాల అధికారులు ఆప్రమత్తంగా ఉండాలన్న ఆదేశాలు వెళ్లాయి. హైదరాబాద్ నగరంలో ఆదివారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి రోడ్లన్నీ గుంతలుపడ్డాయి. నడిచేందుకు కూడా అవకాశం లేని విధంగా రోడ్లు మారిపోయాయి.
గత నెల రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించి వర్షాకాలం ప్రారంభమైన తరువాత ఇప్పటివరకు అనేక ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదైంది. కోస్తా ఆంధ్రాలోని అన్ని జిల్లాల్లో సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదుకాగా, రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. అయితే తెలంగాణలో మాత్రం కొంత వర్షపాతం తక్కువగా ఉంది. ఈ ప్రాంతంలోని హైదరాబాద్, ఖమ్మం, మెదక్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో సాధారణం కన్నా ఎక్కువగా వర్షం కురవగా, వరంగల్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాల్లో సాధారణ వర్షపాతం మాత్రమే నమోదైంది. ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం సాధారణ స్థాయి కన్నా తక్కువగా వర్షం కురిసింది. ఇక్కడ జూలై నెల్లో ఇప్పటివరకు 234 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా, కేవలం 174 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది.
ఇక శనివారం తెల్లవారుజాము నుండి అనేక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. అత్యధికంగా ధర్మవరంలో వర్షం కురియగా, అనంతపురంలో 12, మాచెర్లలో 10, జమ్మలమడుగులో 8, హైదరాబాద్, ములుగు, నర్సంపేట, పరిగి ప్రాంతాల్లో 7 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. అలాగే బాపట్ల, చిలమత్తూరు, భద్రాచలం, పులివెందుల్లో 6, దుమ్ముగూడెంలో 5, చేవెళ్ల, గోల్కొండ, వెంకటగిరి కోటల్లో 4, హకీంపేట, మచిలీపట్నం, ఆళ్లగడ్డ, అచ్చంపేట, నాగార్జునసాగర్ డ్యామ్, హిందుపురంలో 3, రెంటచింతల, కదిరి, పుత్తూరు, కళ్యాణదుర్గం, పెనుకొండ, తాడిపత్రి, గుడివాడ, కాళేశ్వరం, కుప్పం తదితర ప్రాంతాల్లో 2 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. అనేక ఇతర ప్రాంతాల్లో కూడా సెంటీమీటర్ కన్నా అధికంగానే వర్షపాతం నమోదైంది.
కాగా, మరో రెండు రోజులపాటు ఉత్తరాంధ్ర జిల్లాలు, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో, కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. హైదరాబాద్ నగరంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో రెండు రోజులపాటు మబ్బులు కమ్ముకుని విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
వాగులో పడ్డ బస్సు .. ప్రయాణికులు క్షేమం
అనంతపురం జిల్లాలో శనివారం రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. బత్తలపల్లి మండలం పోట్లమర్రి గ్రామం వద్ద డూపులేట్ వాగు ఉద్ధృతికి తాళలేక ఆదివారం ఉదయం వరంగల్ నుండి వస్తున్న పుట్టపర్తి డిపో బస్సు బోల్తా పడింది. అయితే డ్రైవర్, కండక్టర్ చాకచక్యంగా వ్యవహరించి గ్రామస్తుల సహాయంతో 29 మంది ప్రయాణికులను సురక్షితంగా కాపాడారు. ప్రయాణికుల తొక్కిసలాటలో నలుగురికి స్వల్పగాయాలయ్యాయి. హైదరాబాద్‌కు చెందిన వరలక్ష్మి అనే మహిళకు తీవ్రగాయాలవడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు.

ఒంటరివాణ్ని కాను – దేనికైనా సిద్ధమన్న జగన్‌

09.07
వైఎస్‌ కొడుకుగా పుట్టడం నాకు పెద్ద వరం.. నాకు పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు.. మీరంతా వచ్చి నన్ను ఆశీర్వదిస్తున్నారు.. మీ కోసం నేను దేనికైనా సిద్ధం.. మీ కోసమే ఓదార్పు యాత్ర చేపట్టాను.. మీ అందరినీ చూసిన తరువాత నేను ఒంటరివాణ్ణి కాదన్న ధైర్యం వచ్చింది.. మీరందరూ నన్ను కొడుగ్గా చూసుకుంటున్నారు.. నాన్న ఆశయాలు నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నా’ అని కడప పార్లమెంట్‌ సభ్యులు వైఎస్‌ జగన్మోహనరెడ్డి శ్రీకాకుళం జిల్లాలో గురువారం మొదలుపెట్టిన ఓదార్పు యాత్రలో వ్యాఖ్యానించారు. ఎక్కడా రెండు మూడు నిమిషాలకు మించి మాట్లాడలేదు. పలకరింపులకూ, కరచాలనాలకే అధిక సమయం వెచ్చిస్తున్నారు. ఇచ్ఛాపురానికి గురువారం ఉదయం 8.30 గంటలకు ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో చేరుకున్నారు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నాక ఉదయం 11.30 గంటలకు తన తండ్రి వైఎస్‌ ప్రజా ప్రస్థానం పాదయాత్ర ముగింపునకు చిహ్నంగా నిర్మించిన విజయస్థూపం వద్దకు చేరుకున్నారు. అక్కడ వైఎస్‌ 61వ జయంతిని పురస్కరించుకుని కేక్‌ కట్‌ చేశారు. అంతకుముందు ఇచ్ఛాపురంలో ఏర్పాటు చేసిన వైఎస్‌ విగ్రహాన్ని ఆవిష్కరిం చారు. యాత్ర రెండు గంటలు ఆలస్యంగా మొదలయ్యింది. యాత్ర ఆరుగంటలు ఆలస్యంగా నడుస్తోంది. నిర్వాహకులు ప్రకటించిన ప్రకారం సాయంత్రం ఆరు గంటలకు టెక్కలి చేరుకోవాల్సి ఉంది. మధ్యాహ్నం 12 గంటలకు చేరుకోవాల్సిన కంచిలి మండలం కేసరపడ గ్రామంలోనే ఆ సమయానికి ఉన్నారు.
కుటుంబాలకు పరామర్శఇచ్ఛాపురం మండలం లొద్దపుట్టి గ్రామంలో పైల చంద్రమ్మ, కవిటి మండలం జగతి గ్రామంలో రెడ్డి అప్పన్న, కంచిలి మండలం కేసరపడ గ్రామంలోని పిలక గణపతి కుటుంబాలను కలిసి జగన్‌ ఓదార్చారు. బాధిత కుటుంబాల ఇళ్లలో ఆహారాన్ని తీసుకున్నారు. ఆర్థిక సహాయం అందించే సమయంలో మీడియానూ, ఇతరులనూ బయటకు పంపేస్తున్నారు. యాత్ర ప్రారంభమైన ఇచ్ఛాపురంలో జనసమీకరణ చేశారు. మార్గమధ్యంలో ఎక్కువమంది ఉన్నచోట జగన్‌ వాహనం దిగి, అభివాదం చెప్పి ముందుకు సాగుతున్నారు.
జిల్లా ఎమ్మెల్యేలు డుమ్మా
యాత్రలో రాయచోటి ఎమ్మెల్యే శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు కాని జిల్లాకు సంబంధించిన ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా హాజరుకాలేదు. మొదటినుంచీ యాత్ర ఏర్పాట్లు చూస్తున్న టిటిడి మాజీ ఛైర్మన్‌ బి కరుణాకర్‌రెడ్డితోపాటు మాజీ మంత్రి మారెప్ప యాత్రలో పాల్గొన్నారు. జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరూ ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా, డిసిసి ఆధ్వర్యాన కాంగ్రెస్‌ నాయకులంతా యాత్రలో, జనసమీకరణలో భాగస్వాములయ్యారు. ఇచ్ఛాపురంలో మాజీ ఎమ్మెల్యేలు ఎంవి కృష్ణారావు, నరేష్‌కుమార్‌ అగర్వాలా పాల్గొన్నారు. కంచిలిలో నరేష్‌కుమార్‌ సోదరుని కొడుకు మధ్యాహ్న భోజనం ఏర్పాట్లు చేశారు. డిసిసి అధ్యక్షులు, ఎంపీ కిల్లి కృపారాణి భర్త డాక్టర్‌ రామ్మోహన్‌రావు, యువజన కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు మామిడి శ్రీకాంత్‌ జగన్‌ యాత్రకు సారథ్యం వహించారు. యాత్రలో ‘జగన్‌ జిందాబాద్‌, జగన్‌ సిఎం కావాలి’ అంటూ నినాదాలు చేశారు.
దొంగతనాల జోరు
ఓదార్పుయాత్రలో దొంగతనాల జోరు ఎక్కువైంది. చోరులు కొందరు మహిళల ఆభరణాలను తస్కరించారు. పోలీసులకు పలువురు ఫిర్యాదులు చేసినదాన్ని బట్టి తొలిరోజు ఆరు గంటల్లోనే సుమారు రూ.మూడు లక్షల విలువైన ఆభరణాలు దొంగలపాలయ్యాయి. పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
ఓదార్పు యాత్రలో అపశ్రుతులు
జగన్‌ ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్‌ నుంచి బయటకు వస్తుండగా, రైల్వే స్టేషన్‌లోని రేకుల షెడ్డుపైకి ఫొటోగ్రాఫర్లు, అభిమానులు ఎక్కడంతో జగన్‌ ఆ ప్రాంతానికి వచ్చేటప్పటికి కూలిపోయింది. సెక్యూరిటీ సిబ్బంది జగన్‌ను పక్కకు లాగడంతో ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఇచ్ఛాపురం మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ లాభాల స్వర్ణమణి స్వాగతం పలికి వస్తుండగా, తొక్కిసలాటలో గాయపడ్డారు. ఓ అభిమానికి స్వల్ప గాయాలయ్యాయి

మావోయిస్టుల బంద్‌ పిలుపుతో పోలీసు యంత్రాంగం అప్రమత్తం

02.06
మావోయిస్టు పార్టీ రెండు రోజుల భారత్‌ బంద్‌కు పిలుపునివ్వడంతో రాష్ట్ర పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. గ్రేహౌండ్స్‌ దళాలతో పాటు కేంద్ర పారామిలటరీ దళాలను రంగంలోకి దింపారు. రాష్ట్రంలో మావోయిస్టుల ప్రాబల్యం అంతగా లేకపోయిన్పటికీ ఆదిలాబాద్‌ జిల్లాలో మావోయిస్టు అగ్రనేత ఆజాద్‌ ఎన్‌కౌంటర్‌ జరిగింది కాబట్టి మావోయిస్టులు ఏక్షణమైనా విరుచుకుపడే అవకాశాలు ఉన్నాయని పోలీసు యంత్రాంగం భావిస్తోంది. కేంద్ర కమిటీ సభ్యులు రాజ్‌కుమార్‌ అలియాస్‌ ఆజాద్‌ది ఎన్‌కౌంటర్‌ కాదని, అది బూటకపు ఎన్‌కౌంటర్‌ అంటూ ఆరోపిస్తున్న మావోయిస్టులు దీనికి నిరసనగా ఈనెల 7,8 తేదీల్లో భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని మావోయిస్టు ప్రభావిత జిల్లాల ఎస్పీలను డిజిపి ఆదేశించారు. డిజిపి గిరీష్‌కుమార్‌, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ మహేందర్‌రెడ్డి కలిసి మంగళవారం సాయంత్రం ఆయా జిల్లాల ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఛత్తీస్‌గఢ్‌-ఒరిస్సా సరిహద్దుల్లోని దండకారణ్యం అడవుల్లో మావోయిస్టుల కదలికలు ఉన్నట్లు సమాచారం ఉందని, ఆజాద్‌ ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారం తీర్చుకునేందుకు మావోయిస్టులు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర నిఘా వర్గాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశాయి. అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్‌ దళాలు అప్రమత్తంగా ఉండాలని, అలాగే వరంగల్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల పోలీసులు కూడా అప్రమత్తంగా ఉండాలని డిజిపి ఆదేశించారు. కూంబింగ్‌కు వెళ్లేటప్పుడు అడుగడుగునా మెటల్‌ డిటెక్టర్‌తో తనిఖీ చేసిన తర్వాతే ముందుకు కదలాలని, అనుమానం ఉన్న చోట మార్కింగ్‌ చేసి బాంబ్‌స్క్వాడ్‌ దళాలలతో తనిఖీలు చేసిన తర్వాత ముందుకు పోవాలని డిజిపి ఆదేశించినట్లు తెలిసింది.
విజయనగరంలో రెండు రైళ్ల నిలిపివేత
విజయనగరం జిల్లా కోనేరు వద్ద రైల్వే ట్రాక్‌ను పేల్చివేసినట్లు మావోయిస్టులు లేఖ పంపడంతో బిలాస్‌పూర్‌-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేశారు. అలాగే కోర్సాలింగ్‌ ఎక్స్‌ప్రెస్‌ను విజయనగరంలో నిలిపివేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ట్రాక్‌లను పరిశీలించాకే రైళ్లను ముందుకు పంపిస్తామని అధికారులు తెలిపారు. రైల్వే ట్రాక్‌లను పేల్చివేసినట్లు మావోయిస్టులు లేఖ రాయడంతో రాష్ట్ర పోలీసు యంత్రాగం అప్రమత్తమైంది. రైల్వే అధికారులకు సహకరించాలని, ట్రాక్‌లను అడుగడుగునా తనిఖీ చేయాలని ఆయా జిల్లాల ఎస్పీలకు డిజిపి ఆదేశించారు. అలాగే రైల్వే స్టేషన్ల వద్ద కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

మద్యంపై లోక్‌సత్తా చైతన్య యాత్ర

07.07
మద్య నియంత్రణపై చైతన్య యాత్రకు లోక్‌సత్తా సిద్ధమైంది. మద్యానికి వ్యతిరేకంగా ప్రజలను సమీకరించడం లక్ష్యంగా బుధవారం నెల్లూరు జిల్లా దూబగుంట నుంచి యాత్ర ప్రారంభించాలని నిర్ణయించింది. ఉప ఎన్నికలు జరిగే జిల్లాలు మినహాయించి శ్రీకాకుళం వరకు మొత్తం 16 జిల్లాల్లో 22వతేదీ వరకు యాత్ర సాగే విధంగా షెడ్యూల్ ఖరారు చేసింది.  ఈమేరకు పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ మంగళవారం పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద చైతన్య రథానికి జెండా ఊపి యాత్రను లాంఛనంగా ప్రారంభించారు. ‘కొత్త ఎక్సైజ్ సంవత్సరంలో మొదలైన మద్యం ప్రవాహం రాష్ట్ర ప్రజలను భయంకర సంక్షోభంలోకి నెడుతుంది.  ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో చేస్తున్న ఖర్చు కంటే మద్యం ద్వారా ప్రజలకు కలుగుతున్న నష్టం మూడు రెట్లు ఎక్కువ. మద్య నియంత్రణకు పార్టీలకతీతంగా అందరూ కదిలిరావాలి’ అని జేపీ కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు, మహిళా సత్తా రాష్ట్ర అధ్యక్షురాలు సరోజాదేవి పాల్గొన్నారు.

తమ్ముళ్ళకు చంద్రబాబు క్లాస్‌

an-1265060465604
బుజ్జగింపులు..ప్రక్షాళన, అసమ్మతుల బెడద, బూత్‌ స్థాయి నుంచి పార్టీ పరిస్థితిపై చంద్రబాబు నియోజకవర్గాల వారీగా చేస్తున్న సమీక్షలు అర్ధరాత్రి వరకూ కొనసాగాయి. గతంలో చంద్రబాబు ఇదే విధంగా 2004లో స్థానిక రహదారి బంగ్లాలో జరిపిన సమీక్షలు తెల్లవారుజాము రెండు వరకూ కొనసాగాయి. ఇదే తరహాలో మళ్ళీ ఆయన పార్టీని బలోపేతం చేసేందుకు తమ్ముళ్లకు క్లాస్‌ తీసుకున్నారు. రెండురోజుల పర్యటనలో బాగంగా చంద్రబాబు రెండవరోజు బుధవారం పార్టీ వర్గాలతో సమీక్షలు నిర్వహించారు. స్థానిక పివిజి కళ్యాణ మండపంలో బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు పార్టీ నియోజక వర్గాలవారీ సమీక్షను మొదలు పెట్టారు. ఈ సమీక్షలు అర్ధరాత్రి వరకూ కొనసాగాయి. రాత్రి తొమ్మిది గంటల వరకూ పార్వతీపురం, సాలూరు, బొబ్బిలి నియోజకవర్గాల నాయకులతో సమీక్షలు నిర్వహించారు. ప్రధానంగా పార్టీలో ఉన్న ఆంతరంగిక వ్యవహారాలపై ఆయా నియోజకవర్గాల నాయకులతో తీవ్రంగా చర్చించారు. పార్టీలో అందరూ కలసికట్టుగా పని చేయాలని, క్రమశిక్షణ లోపించకుండా చూడాలని నేతలకు కార్యకర్తలకు బాబు సూచించినట్లు సమాచారం.
పార్వతీపురం నియోజకవర్గ ఇన్‌చార్జి ద్వారపురెడ్డి జగదీష్‌కు రాష్ట్ర పదవి కల్పిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. దాదాపు గంట సేపు పార్వతీపురం నియోజక వర్గ నేతలతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో కార్యకర్తలకు పార్టీని బలోపేతం చేసేలా అయందరూ పని చేయాలని హితబోధ చేసినట్లు తెలిస్తోంది.
పార్టీ అధినేత సమక్షంలోనే బొబ్బిలి నేతల మధ్య ఉన్న అంతర్గత విబేదాలు మళ్లీ బయటపడ్డాయి. సమీక్షల్లో భాగంగా బొబ్బిలి నియోజక వర్గ నేతలతో సమీక్ష ప్రారంభించారు బాబు. అయితే నియోజకవర్గ నేతలైన శంబంగి, తెంటు లక్ష్మునాయుడి లతో చంద్రబాబు వేర్వేరుగా చర్చించినట్లు సమాచారం. దాదాపు అరగంటకు పైగా వీరితో చర్చలు జరిపారు. ఇంతలోనే శంబంగి బయటకు వచ్చారు. కాసేపటికి తెంటు కూడా బయటకు వచ్చారు. సమావేశంలోకి కార్యకర్తలు రావాలని అశోక్‌ వీరిని పిలిచారు. అయితే తెంటు వర్గీయులు మాత్రం శంబంగి వర్గీయులుంటే మేము లోపలికి వచ్చేది లేదని తేల్చి చెప్పారు. అయితే కొంత మంది నేతలు వీరికి నచ్చజెప్పి సమావేశంలోనికి తీసుకెళ్లారు. అయితే కొంత సేపు బాగానే ఉన్న శంబంగి వర్గీయులు తెంటు వర్గీయులుంటే మేం ఉండబోమని అలక పాన్పెక్కి బయటకు వచ్చారు. దీంతే పార్టీ నేతలకు మళ్లీ బుజ్జగింపు చేసినట్లు తెలుస్తోంది. అయితే పార్టీ అధినేత ముందే నేతల వర్గీయులు బాహాబాహీ కి దిగటంతో ఆయా నియోజక వర్గాల నేతలకు టెన్షన్‌ మొదలైంది. అయినా బాబు వీరికి నచ్చజెప్పాలని ఆయా నేతలను సూచించినట్లు తెలుస్తోంది.

22 నుంచి కార్యకర్తలతో చంద్ర బాబు ముఖాముఖి

an-1271620246996
నేరుగా కార్యకర్తలతో సమావేశం కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు సంకల్పించారు. ఈ కార్యక్రమాన్ని విజయనగరం జిల్లా నుంచి ప్రారంభిస్తారు. ఈ నెల 22, 23 తేదీల్లో ఆయన ఆ జిల్లా పర్యటనకు వెళుతున్నారు. 23న పూర్తిగా కార్యకర్తలతో సమావేశాలకే కేటాయించారు. ప్రతీ నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశమై వారి అభిప్రాయాలు తెలుసుకుంటారు. మునిసిపల్ ఎన్నికలలోపు ఈ తరహా సమావేశాలను అన్ని జిల్లాల్లో పూర్తి చేయాలన్నది ఆయన ఆలోచన.

‘టి’ కప్‌ విన్నర్స్‌ నాగ్‌ టీమ్‌

  • మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌, మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అక్కినేని అఖిల్‌

SIV_012614-6-10-51578
సినీ కళాకారులతో ‘మా’ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ఎల్‌.బి.స్టేడియంలో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో నాగ్‌ కింగ్స్‌ జట్టు విజయం సాధించి టి20 టాలీవుడ్‌ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఉత్కంఠ భరితంగా సాగిన 10 ఓవర్ల ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన వెంకీ వారియర్స్‌ జట్టు 88 పరుగుల లక్ష్యాన్ని నిర్ణయించింది.
రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ ప్రారంభించిన నాగ్‌ కింగ్స్‌ జట్టుకు చెందిన అక్కినేని అఖిల్‌, తారకరత్నల జోడీ 6.4 ఓవర్ల వద్ద 67 పరుగులు చేసి ఆదర్శ్‌ బౌలింగ్‌లో మొదటి వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన ఖయ్యుంతో కలిసి అఖిల్‌ ఇంకా 8 బంతులు మిగిలి ఉండగానే 8.4 ఓవర్లకు 88 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాడు. అఖిల్‌ పరుగులను ఆపడంలో వెంకీ వారియర్స్‌ విఫలమయ్యారు. పలుమార్లు క్యాచ్‌కు అవకాశం వచ్చినా జారవిడవటంతో విజయావకాశాలు కోల్పోయారు.
మ్యాన్‌ఆఫ్‌ ది సీరీస్‌, మ్యాచ్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అఖిల్‌
మ్యాచ్‌ ప్రారంభం నుంచీ ఫైనల్స్‌లోనూ మంచి ప్రతిభ కనపరచిన అఖిల్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది సీరీస్‌ అవార్డు లభించింది. కాగా క్లాసిక్‌ క్యాచ్‌ అవార్డును సుమంత్‌కు అందజేశారు.
విజేతలకు ట్రోఫీలు అందజేసిన మంత్రులు
టి20 టాలీవుడ్‌ ట్రోఫీని నాగ్‌ కింగ్స్‌ జట్టుకు రాష్ట్ర మంత్రులు డాక్టర్‌ జె.గీతారెడ్డి, పి.సబితారెడ్డి, దానం నాగేందర్‌ అందజేశారు. జట్టు క్యాప్టెన్‌ అక్కినేని నాగార్జున ఈ ట్రోఫీని అందుకున్నారు. అలాగే రన్నర్స్‌గా నిలిచిన వెంకీ వ్యారీయర్స్‌కు మంత్రి దానం నాగేందర్‌ ట్రోఫీని బహూకరించారు.
ట్రోఫీల ప్రదానోత్సవంలో ప్రముఖ నటుడు ఎం.మురళీమోహన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో నటుడు మోహన్‌బాబు హల్‌చల్‌ సృష్టించారు.

నకిలీ విత్తనాలపై విచారణకు సిఎం ఆదేశం

CM-6
రాష్ట్రంలో నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న వారిపై నిఘా ఉంచాలని, విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె. రోశయ్య అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా నకిలీ విత్తనాలు, ఎరువులకు కేంద్ర స్థానంగా మారిందని వచ్చిన వార్తలపై ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించారు. ఈ సంఘటనపై విచారణకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.వి. ప్రసాద్‌, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి రేచల్‌ ఛటర్జీలను ఆదేశించారు. అలాగే వారం రోజుల్లో తనకు నివేదిక సమర్పించాలని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ను కోరారు.

స్థిరంగా సాగుతున్న అల్పపీడన ద్రోణి

laila
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం మరింత బలహీన పడే అవకాశం ఉంది. మచిలీపట్నం కు ఆనుకొని ఉన్న అల్పపీడనం వలన కోస్తా ప్రాంతం అంతట విస్తారంగా వర్షాలు కురియనున్నాయి. ఉత్తర కోస్తా , దక్షిణ కోస్తా ప్రాంతాల్లో ఒక మోస్తారు జల్లులుతోపాటు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు వెల్లడించారు. అల్పపీడన ద్రోణి ప్రభావం మరో 24 గంటల పాటు ఉంటుందని తెలిపారు. రుతుపవనాలలో ఎటువంటి కదలిక లేదని విశాఖ వాతావరణ అధికారులు చెప్పారు. విశాఖా వరకు వ్యాపించిన రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించడానికి మరో రెండు రోజులు పడుతుందని పేర్కొన్నారు.

మంత్రులే మద్యం వ్యాపారులు మద్యాన్ని నియంత్రించండి – చంద్రబాబు

* పెద్దలకు ముడుపులు… ప్రభుత్వానికి రెవెన్యూ  * గవర్నర్‌ నరసింహన్‌తో చంద్రబాబు

an-1276375439008
రాష్ట్రంలో విచ్ఛలవిడిగా సాగుతున్న మద్యం వ్యాపారాన్ని నియంత్రించాలనీ, పేద ప్రజల ఆరోగ్యం, ఆర్ధిక పరిస్థితులను పరిరక్షించాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాష్ట్ర గవర్నర్‌ ఇవిఎల్‌ నరసింహన్‌ను కోరారు. మద్యం వ్యాపారంలో మంత్రులే భాగస్వాములుగా ఉన్నారనీ, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రభుత్వమే మద్యం వ్యాపారాన్ని ప్రోత్సహిస్తోందని ఆయన ఆరోపించారు. బెల్టు షాపులను రద్దు చేయాలని, ఎమ్మార్పీ కన్నా అధిక రేట్లకు విక్రయించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. రాష్ట్రంలో మద్యపానం విచ్చలవిడిగా విస్తరించకుండా చర్యలు తీసుకోవాలనీ, దుకాణాల వద్ద బహిరంగ మద్యపానం నిషేధించాలని, విద్యాసంస్థలు, హైవేలు, ప్రార్థనా మందిరాల వద్ద ఉన్న దుకాణాలను తక్షణమే తొలగించాలని ఆయన డిమాండ్‌ చేశారు. కొత్త దుకాణాలకు అనుమతి నిరాకరించాలనీ, అక్రమ మద్యం వ్యాపారాలను అరికట్టాలని ఆయన కోరారు. చంద్రబాబు తెలుగుదేశం పార్టీ పార్లమెంటు, శాసనసభ్యులతో కలిసి శనివారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశారు. మద్యం టెండర్ల కుంభకోణం, ఇందులో మంత్రుల భాగస్వామ్యం, బెల్టుషాపులపై ఆయన ఫిర్యాదుచేశారు.

babu--handఆ తర్వాత విలేఖరులతో మాట్లాడుతూ, మద్యం టెండర్లలో మంత్రులకు కూడా ప్రమేయం ఉందని, సిండికేట్‌లుగా ఏర్పడి టెండర్లు పంచుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వం రెవెన్యూ సాకుతో గ్రామాల్లో కూడా మద్యం విక్రయించేందుకు దిగజారిందని ఆయన మండిపడ్డారు. గత ఏడాదికన్నా 50 శాతం మద్యం రెవెన్యూ పెరిగిందనీ, రాష్ట్రంలో 32 శాతం మందిని మద్యానికి బానిస చేసిన ఘనత ఈ ప్రభుత్వానిదేనని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజలు 40 వేల కోట్ల రూపాయలు మద్యానికి దుబారా చేస్తున్నారనీ, ముఖ్యంగా మధ్య తరగతి, కిందిస్థాయి ప్రజల కుటుంబాలు చితికిపోతున్నాయని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.
కర్నాటకలో ఒక్క కొత్త వైన్‌ షాపుకు కూడా అనుమతించలేదనీ, కానీ మన రాష్ట్రంలో కొత్త షాపులతో పాటు బెల్టుషాపులకు అక్రమంగా అనుమతులిస్తున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వంలోని పెద్దలకు అవినీతి ముడుపులు ప్రభుత్వానికి రెవెన్యూ వస్తుందని, పేదలకు మాత్రం ఆర్ధికంగా, ఆరోగ్యపరంగా నష్టపోతున్నారని ఆయన విచారం వ్యక్తం చేశారు. సమాజం పట్ల రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. మద్యపానాన్ని నిషేధించాలని రాజకీయపరంగా తాము డిమాండ్‌ చేయడం లేదనీ, అయితే దాన్ని పరిమితికి లోబడి మాత్రమే అనుమతించాలని ఆయన డిమాండ్‌ చేశారు.
సమాజాన్ని ఛిన్నాభిన్నం చేస్తున్న మద్యపాన రక్కసికి వ్యతిరేకంగా రాజకీయపక్షాలు, ప్రసార సాధనాలు, సామాజిక సంస్థలు, ధార్మిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, సమాజంలో అన్నివర్గాల వారు ఏకోన్ముఖంగా పోరాడాల్సిన తరుణం ఆసన్నమైందని చంద్రబాబు పేర్కొన్నారు. అనేక కుటుంబాల ఆర్ధిక పరిస్థితులు ఛిన్నాభిన్నమై ఆర్జించే వ్యక్తులు అనారోగ్యం పాలై వికలాంగులవుతున్నారని అన్నారు. మద్యపానం దుష్ఫలితాలపై సరైన ప్రచారం, సమగ్ర చర్చల ద్వారానే ఆరోగ్యవంతమైన సమాజాన్ని ఆవిష్కరించగలమని చంద్రబాబు చెప్పారు. రాజ్యాంగంలోని ఆదేశసూత్రాలు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు దీనిపై సరైన మార్గదర్శకాలను అందించాయనీ, రాజ్యాంగపరంగా రాష్ట్రంలో నెలకొన్న విష సంస్కృతికి అడ్డుకట్ట వేసే దిశగా చర్యలు చేపట్టాలని ఆయన గవర్నర్‌ను కోరారు. విచ్ఛలవిడిగా సాగుతున్న మద్యపాన విక్రయాల దుష్ఫలితాల పర్యవసానాల గురించి రాష్ట్ర ప్రభుత్వానికి సరైన నిర్దేశన చేయాలని కోరినట్లు చంద్రబాబు చెప్పారు. మద్యం ఉత్పత్తి, విక్రయాలు, వినియోగాన్ని ప్రోత్సహించే ప్రభుత్వ విధానాలకు స్వస్తి చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో హద్దు మీరిన మద్యం విక్రయాలను నియంత్రించాలని గవర్నర్‌ను కోరినట్లు చంద్రబాబు చెప్పారు.